Skip to main content

డిగ్రీ పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలంటే...?

సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది.
మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు మే 14న సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. ముందుగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటించేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణాళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది. జూన్ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు.
Published date : 15 May 2020 03:12PM

Photo Stories