అనంత అమ్మాయికి యూఎస్ ప్రెసిడెంట్ స్కాలర్ పురస్కారం
Sakshi Education
అనంతపురం విద్య : ప్రతిష్టాత్మక యూఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్-2020 పురస్కారాన్ని అనంతపురం జిల్లాకు చెందిన పి.సంజనరెడ్డి దక్కించుకుంది.

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం నుంచి అమ్మాయిల కోటాలో ఆమె ఈ పురస్కారాన్ని సాధించారు. విద్య, ఆర్ట్స, టెక్నాలజీలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దీనిని అందిస్తారు. సంజనరెడ్డిని ప్రత్యేక విమానంలో వైట్హౌస్కి తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగా పురస్కారాన్ని బహూకరిస్తారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం ఆమెకు లభించనుంది. విద్యాసంబంధ అంశాలపైనా చర్చకు అవకాశమిస్తారు. చియ్యేడు గ్రామానికి చెందిన పెద్దగొర్ల లక్ష్మీరెడ్డి, సమత దంపతులు పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. లక్ష్మీరెడ్డి విస్కాన్సిన్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె సంజన బ్రూక్ఫీల్డ్ ఈస్ట్ ఉన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది. తల్లిదండ్రుల స్ఫూర్తితోనే ఈ పురస్కారాన్ని దక్కించుకున్నట్టు సంజనరెడ్డి చెప్పింది.
Published date : 29 May 2020 01:45PM