ఏపీలో కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలు..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. మెడికల్ కాలేజీలు, నాడు -నేడు కార్యక్రమాలు తదితరాల కోసం ప్రజారోగ్యంపై రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 15న క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు లక్ష్యాలను నిర్దేశించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు.
సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
- ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉండగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నిటి కోసం రూ.6,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
- ఇవి కాకుండా 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు, సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం మొత్తం రూ.6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
- మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు, కొత్తవాటి నిర్మాణాల కోసం రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
- ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని సీఎం జగన్ సూచించారు. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నాడు -నేడు కార్యక్రమాల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు.
- సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 16 May 2020 03:06PM