Skip to main content

పేటీఎంలో 20,000 ఉద్యోగాలు..రూ.35 వేల జీతం.. అర్హతలివే!?

సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది.
మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఉద్యోగుల ద్వారా..
కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్‌ చేస్తోంది.

మరోవైపు రూ.16,000 కోట్ల..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) మే నాటి డేటా ప్రకారం ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా, 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.16,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం అక్టోబర్ నాటికి స్టాక్ మార్కెట్లోకి రానుంది. జూలై 15 న మార్కెట్ రెగ్యులేటర్ సెబీవద్ద ఇప్పటికే ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది పేటీఎం.
Published date : 28 Jul 2021 04:53PM

Photo Stories