Skip to main content

రెండు పరీక్షలతో మేలెంత..?

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులపై ప్రవేశ పరీక్షల సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గించేందుకు రెండుసార్లు జేఈఈ మెయిన్ నిర్వహించాలన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.
రెండుసార్లు పరీక్షకు ఒకే చెబుతున్నప్పటికీ అవి నిర్వహించే నెలల విషయంలో సమస్యలు తప్పవని తల్లిదండ్రులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలన్న ఒత్తిడిలో ఉండే విద్యార్థులు జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌పై దృష్టిపెట్టే అవకాశం ఉండదని, దానిపై దృష్టి పెడితే జనవరిలోనే జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్, ఇంటర్ వార్షిక పరీక్షలపైనా ప్రభావం తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి, ఏప్రిల్‌లో కాక నవంబర్, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

కొద్ది మందికే ప్రయోజనం...
రెండు తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్, నీట్, ఎంసెట్ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దాదాపు 5 లక్షల మంది ఉంటారు. ఇప్పటివరకున్న విధానంలో ఏప్రిల్, మే నెలల్లోనే జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలు ఉంటున్నాయి. రెగ్యులర్ విద్యార్థులంతా జనవరిలో ప్రాక్టికల్స్ రాసి, మార్చిలో వార్షిక పరీక్షలను పూర్తిచేసి, ఏప్రిల్‌లో జేఈఈ, మేలో ఎంసెట్, ఇంజనీరింగ్ వంటి పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే జనవరి, మార్చి, ఏప్రిల్‌లో వివిధ పరీక్షలతో బిజీగా ఉండే లక్షలాది మంది విద్యార్థులు జనవరిలో జేఈఈ మెయిన్‌పై దృష్టి పెట్టడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకునే వారికే ఇది ఉపయోగకరమని అంటున్నారు.

నవంబర్, ఏప్రిల్‌లో పరీక్షలు మేలు :
అకడమిక్ కోర్సుల్లో ప్రవేశాలకు 2 పరీక్షల విధానం సరికాదని విద్యావేత్తలు అంటున్నాయి. జనవరికి బదులు నవంబర్, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తే ప్రయోజనకరమని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. నవంబర్‌లో పరీక్షకు హాజరైతే పరీక్షా విధానానికి సంబంధించి అవగాహన వస్తుందని, ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు పక్కాగా సిద్ధం కావచ్చని అంటున్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్ వారికీ ఇదే ప్రయోజనకరమని, నవంబర్‌లో మంచి స్కోర్ రాకపోతే ఏప్రిల్ పరీక్ష స్కోర్‌ను పెంచుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా జూలైలో చేపట్టే ప్రవేశాల్లో మంచి కాలేజీల్లో సీట్లు దక్కుతాయని వివరిస్తున్నారు. జనవరిలోనే పరీక్ష నిర్వహించాలనుకుంటే.. విద్యార్థులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అకడమిక్ కేలండర్‌నే మార్చుకోవాల్సి వస్తుందని, జనవరి నాటికే వార్షిక పరీక్షలు పూర్తి చేయాల్సి వస్తుందని పేరొంటున్నారు.

రెండు పరీక్షల డిమాండే లేదు..
జేఈఈ మెయిన్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్ రాలేదు. కేంద్రమే నిర్ణయం తీసుకుంది. రెండు పరీక్షల ద్వారా స్కోర్ పెంచుకునే అవకాశం ఉన్నా జనవరి పరీక్షలతో ప్రయోజనం ఉండదు. కాబట్టి నవంబర్, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఉపయోగం. ఆ దిశగా మార్పులు చేసేలా కేంద్రానికి రాష్ట్రం సూచించాలి.
- డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్

కేంద్రం ప్రకటించిన షెడ్యూల్...
జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష :
దరఖాస్తుల స్వీకరణ: 2018
సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు
ఆన్‌లైన్ పరీక్షలు: 2019 జనవరి 6 నుంచి 20వ తేదీ వరకు
ఫలితాలు: ఫిబ్రవరి మొదటి వారం

రెండో పరీక్ష..
దరఖాస్తుల స్వీకరణ: 2019 ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి రెండో వారం వరకు
ఆన్‌లైన్ పరీక్షలు: ఏప్రిల్ 7 నుంచి 21వ తేదీ వరకు(8 రోజుల్లో)
ఫలితాలు: మే మొదటి వారం
Published date : 11 Jul 2018 02:56PM

Photo Stories