Skip to main content

ఒకేసారి ఇంటర్ సప్లిమెంటరీ...డీసెట్ పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు పరీక్షలు జరగనుండటంతో విద్యార్థులు సతమతమవుతున్నారు.
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 14 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే అదే సమయంలో ఎలిమెంటరీ టీచర్ ట్రయినింగ్ కోర్సు ప్రవేశానికి సంబంధించిన డీసెట్ పరీక్షలు కూడా జరగనుండడంతో విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. డీసెట్ పరీక్షకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులు. ఇంటర్ చదువుతున్న వారు అనేక మంది డీసెట్‌కు దరఖాస్తు చేశారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వీరిలో కొంతమంది సెకండియర్ పాస్ కాకపోవడంతో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ఇంటర్ పాసైనా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంటు కోసం మరోసారి పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరంతా మే 14 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో డీసెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో మే 15, 16 తేదీల్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ రాసేవారిలో డీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. రెండు పరీక్షలు ఒకేసారి ఉండటంతో డీసెట్ రాసే అవకాశాన్ని కోల్పోవలసి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. తమకు డీసెట్ రాసేందుకు వీలుగా అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. డీసెట్ పరీక్షల సమయంలో ఇంటర్ పరీక్షలు లేకుండా తేదీల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు. లేదా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.
Published date : 02 May 2019 03:04PM

Photo Stories