ఇంటర్ రీ వెరిఫికేషన్పై ఆందోళన వద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రంలోని 12 మూల్యాంకన కేంద్రాల్లో జరుగుతోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మే 4న ఓ ప్రకటనలో తెలిపారు.

వేసవి సెలవుల్లో ఉన్న లెక్చరర్లందరినీ పిలిపించి ఏప్రిల్ 25 నుంచి రీ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రీ వెరిఫికేషన్తో గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపిస్తారని పేర్కొన్నారు. ఇలా వచ్చిన మార్కులతో ఫలితాల ప్రాసెసింగ్ చేయడానికి త్రిసభ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ సంస్థ ద్వారా ‘డేటాటెక్ మెథాడెక్స్’అనే ఓ కంప్యూటర్ ఏజెన్సీని ఎంపిక చేశామని చెప్పారు. ఈ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండు వేర్వేరుగా జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తాయని తెలిపారు. ఆ రెండు ఫలితాలను సరిపోల్చుకుని సరైనవిగా నిర్ధారించుకున్న తర్వాతే రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్, జేఎన్టీయూహెచ్ల పర్యవేక్షణలో ఈ రెండు సంస్థలు ఫలితాలను ప్రాసెసింగ్ చేస్తాయని తెలిపారు.
Published date : 06 May 2019 04:36PM