Skip to main content

రాజ్యాంగ సవరణ పద్ధతి

ప్రజాస్వామిక దేశాల్లో పరిపాలనకు పునాది, సర్వోన్నతమైంది.. రాజ్యాంగం. ఏ దేశ రాజ్యాంగాన్నైనా రచన కాలంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా రూపొందిస్తారు. దేశ కాలమాన పరిస్థితులు మార్పు చెందుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగంలోనే పొందుపర్చారు. రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సవరణ అర్థం
సవరణ అంటే కొత్త ప్రకరణలు చేర్చడం (Insertion), ప్రకరణ తొలగించడం (Repeal), పూర్తిగా తొలగించడం (Ommission), మార్పులు చేయడం, ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మరొక అంశాన్ని చేర్చడం (Substitute) మొదలైన అంశాలన్నింటినీ సవరణగానే (Amendment) పరిగణిస్తారు.

సవరణకు ఉత్తమ పద్ధతి ఏది?
సాధారణంగా రాజ్యాంగాలను సాధారణ మెజారిటీతో లేదా ప్రత్యేక మెజారిటీతో సవరిస్తారు. రాజ్యాంగాన్ని సవరించడానికి చాలా సరళమైన ప్రక్రియ ఉన్నప్పుడు రాజ్యాంగ స్థిరత్వం, నిరంతరతకు విఘాతం కలుగుతుంది. కఠినమైన ప్రక్రియను ఎంచుకుంటే అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు పద్ధతుల్లోని సమత్యులత పాటించారు.

సవరణ పద్ధతులు - రాజ్యాంగ స్థానం
రాజ్యాంగంలోని 20వ భాగంలో ప్రకరణ-368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రకరణలను మూడు వర్గాలుగా వర్గీకరించి, మూడు ప్రత్యేక పద్ధతులను నిర్దేశించారు. అవి..
  1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి
  2. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి
  3. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ర్ట శాసనసభల ఆమోదం ద్వారా జరిగే సవరణ పద్ధతి.
గమనిక-1: మౌలిక రాజ్యాంగంలో ప్రకరణ- 368లో రాజ్యాంగాన్ని ‘సవరించే ప్రక్రియ (Procedure for Amendment of Constitution)’ అని పేర్కొన్నారు. కానీ 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదబంధాన్ని ‘రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారం (Power to amend for Amend Constitution and procedure there of)’గా మార్చారు.
గమనిక-2: ప్రకరణ-368లోని అంశాలను ఇప్పటివరకు రెండు పర్యాయాలు సవరించారు. అవి.. 24వ రాజ్యాంగ సవరణ (1974), 42వ రాజ్యాంగ సవరణ (1976). ప్రకరణ-368లో ఐదు సబ్ క్లాజులు ఉన్నాయి. అవి..
  1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారం
  2. ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలు
  3. ప్రకరణ- 13లో పేర్కొన్న ‘చట్టం’ నిర్వచన పరిధిలోని అంశాలు.. రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.
  4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను (ప్రాథమిక హక్కులతో సహా) రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.
  5. సవరణ అధికారాల్లో మార్పులు, కూర్పులు, రద్దు చేసే అంశంలో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.
గమనిక: క్లాజు - 4, 5లలోని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ క్లాజులు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని, మౌలిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని 1980లో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

సాధారణ మెజారిటీ పద్ధతి
ఈ పద్ధతి ప్రకారం పార్లమెంటు.. సాధారణ మెజారిటీ ద్వారా కొన్ని ప్రకరణలను సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలను సవరించొచ్చు. సాధారణ మెజారిటీ అంటే.. హాజరై ఓటువేసిన వారిలో సగానికంటే ఎక్కువ ఉండాలి.
గమనిక: సాధారణ మెజారిటీ పద్ధతి గురించి ప్రకరణ- 368లో ప్రస్తావించలేదు. అందుకే సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. అంటే ఈ కింద పేర్కొన్న అంశాలు ప్రకరణ- 368లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు.
ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు..
  • కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ర్ట సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు (ప్రకరణలు 1-4)
  • రాష్ర్ట ఎగువసభ విధాన పరిషత్ ఏర్పాటు, రద్దు (ప్రకరణ- 169)
  • భారత పౌరసత్వంలో మార్పులు (ప్రకరణ 5-11)
  • పార్లమెంటులో కోరం (ప్రకరణ-100)
  • రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యాలు (ప్రకరణ- 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221)
  • పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసనసభ్యుల సాధికారాలు (ప్రకరణ- 105, 194)
  • సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు (ప్రకరణ- 139)
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనమండలి, శాసనసభ ఏర్పాటు (ప్రకరణ- 239)
  • నియోజకవర్గాల పునర్విభజన (ప్రకరణ- 82)
  • పార్లమెంటులో ఉపయోగించే భాష(ప్రకరణ-120)
  • ఐదో షెడ్యూల్, ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు
  • సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం (ప్రకరణ -124)

పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలు
ప్రకరణ- 368 ఈ పద్ధతిని వివరిస్తోంది. రాజ్యాంగంలో అత్యధిక భాగాలను ఈ పద్ధతి ద్వారానే సవరిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించాలి. ఈ పద్ధతి ద్వారా ఈ కింది అంశాలు సవరిస్తారు. అవి..
  • భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు (ప్రకరణ 12-35)
  • భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో పేర్కొన్న నిర్దేశిక నియమాలు (ప్రకరణ 36-51)
  • మొదటి పద్ధతిలో, మూడో పద్ధతిలో పేర్కొనని ఇతర అన్ని అంశాలు.
Published date : 09 Jun 2016 03:45PM

Photo Stories