Skip to main content

ప్రాథమిక హక్కులు

ప్రభుత్వ గొప్పదనం అనేది అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాతరాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్.జె. లాస్కీ వ్యాఖ్యానించారు. హక్కు అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక రాజకీయ భావన. ప్రజలు కోరుకునే, ప్రభుత్వం గుర్తించిన అధికారాన్నే హక్కుగా పేర్కొనవచ్చు. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. హక్కులు.. ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు. ఒక వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా ఔన్నత్వం, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా అభివర్ణించవచ్చు.
భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రకరణలు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుంచి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ‘బిల్ ఆఫ్ రైట్స్’ రూపంలో పొందుపరిచారు. చట్టబద్ధమైన హక్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించి, ప్రత్యేక ప్రతిపత్తితో గుర్తిస్తే వాటిని ‘ప్రాథమిక హక్కులు’గా పేర్కొంటారు. వ్యక్తి వికాసానికి ఇవి కనీస అవసరాలు. దేశ ప్రాథమిక శాసనమైన రాజ్యాంగంలో గుర్తించడం వల్ల వీటిని ‘ప్రాథమిక హక్కులు’ అని అంటారు.

ప్రాథమిక హక్కుల నేపథ్యం
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. లోకమాన్య బాలగంగాధర తిలక్ 1895లో ‘స్వరాజ్య బిల్లు’లో మొదటిసారిగా ఈ హక్కులను ప్రతిపాదించారు. ఆ తర్వాత..
  • 1911లో కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు.
  • 1922లో మహాత్మా గాంధీ సాధారణ ప్రజల హక్కుల గురించి ‘యంగ్ ఇండియా’లో ప్రస్తావించారు.
  • 1925లో అనిబీసెంట్.. కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో, ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకూ ప్రాథమిక హక్కులు ఉండాలని ప్రతిపాదించారు.
  • 1927లో మద్రాసులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భావి రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలనే తీర్మానాన్ని ఆమోదించారు.
  • 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ వెల్లడించిన నివేదికలో ‘ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరుల అవసరం’గా పేర్కొన్నారు.
  • 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కొంతమంది ప్రముఖులు ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ చేశారు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వీరి నివేదికే ప్రాతిపదిక అయింది.
  • 1931లో నిర్వహించిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ భావి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కోరారు.
  • 1945లో తేజ్ బహదూర్ సప్రూ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసింది.

రాజ్యాంగ పరిషత్తు - ప్రాథమిక హక్కులు
హక్కులను రాజ్యాంగంలో చేర్చి, వాటికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించడానికి రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 24న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సలహా సంఘం ప్రాథమిక హక్కుల పరిశీలన కోసం 1947 ఫిబ్రవరి 12న ఆచార్య జె.బి. కృపలాని అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది.
ఉప సంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్. రావు హక్కులపై ఒక ముసాయిదా తయారు చేశారు. ఈ ముసాయిదాలో హక్కులను.. న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా వర్గీకరించారు.

ప్రాథమిక హక్కులు - లక్షణాలు
  • ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను పొందుపరిచారు.
  • ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ (Justiciable) ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. వీటి రక్షణ, అమలుకు రాజ్యాంగంలో న్యాయపరమైన ఏర్పాట్లు ఉన్నాయి.
  • ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాల (Absolute Authority)పై పరిమితులు. ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి, ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలి.
  • కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి (Negative). అంటే ఇవి ప్రభుత్వ అధికారితపై పరిమితులు.
    ఉదా: నిబంధనలు 14, 15, 16, 20, 21 మొదలైనవి. ఇవి ప్రభుత్వం ఏయే అంశాలను చేయకూడదో సూచిస్తాయి.
  • మరికొన్ని హక్కులు సకారాత్మకమైనవి (Positive). ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ఉదా: నిబంధన 17లోని అస్పృశ్యత నిషేధం, నిబంధన 24లోని బాల కార్మిక వ్యవస్థ నిషేధం.
  • ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. నిబంధనలు 20, 21 మాత్రం రద్దుకావు.
  • ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి. కానీ, నిబంధనలు 17, 23, 24లో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు (Non self-executory). వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
  • ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం. కానీ, సవరణ పేరుతో వీటి స్ఫూర్తికి భంగం కలిగించకూడదు.
  • కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలు, సాయుధ బలగాలు, పోలీసులు, ఖైదీలు, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నవారికి పరిమితంగా వర్తిస్తాయి.
  • కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా లభిస్తాయి.
    ఉదా: ప్రకరణ 17 - అస్పృశ్యత నివారణ, ప్రకరణ 23 - వెట్టిచాకిరి రద్దు, ప్రకరణ 24 - బాలకార్మిక వ్యవస్థ రద్దు.
  • కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడి, జాతీయ సమగ్రత నిలపడానికి ఉద్దేశించారు.
    ఉదా: మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు.
  • ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు/ వివక్షలు.. ప్రభుత్వాలు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి.
    ఉదా: జాతి, మత, కుల, లింగ, జన్మ సంబంధ వివక్షలను ఎవరూ పాటించకూడదు.

ప్రాథమిక హక్కుల వర్గీకరణ
భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కుల గురించి తెలిపారు.
  1. సమానత్వ హక్కు (Right to Equality): ప్రకరణలు 14-18.
  2. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్ర హక్కు (Personal Freedoms): ప్రకరణలు 19-22.
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (Right against Exploitation): ప్రకరణలు 23, 24.
  4. మత స్వాతంత్య్ర హక్కు (Right to Religion): ప్రకరణలు 25-28.
  5. సాంస్కృతిక, విద్యా హక్కులు (Cultural & Educational rights): ప్రకరణలు 29, 30.
  6. ఆస్తి హక్కు (Right to Property): ప్రకరణ 31.
  7. రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies): ప్రకరణ 32.

ప్రత్యేక వివరణ
పైన పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆస్తి హక్కు (ప్రకరణ 31)ను, ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(f)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. వీటిని 12వ భాగంలోని 300(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధ హక్కు (Constitutional Right) మాత్రమే. దీన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగానూ పరిగణిస్తున్నారు.

ప్రకరణ 12 - రాజ్యం నిర్వచనం
ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్యం నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. రాజ్యాంగంలో రాజ్యం అనే పదాన్ని చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యం నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ 12లో పేర్కొన్నారు. రాజ్యం అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రాథమిక హక్కులను రాజ్యం లేదా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించారు. కాబట్టి ఏయే సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయి? అనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల దీనికి విస్తృతమైన నిర్వచనం అవసరం. దీని ప్రకారం రాజ్యం అంటే..
ఎ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర, రాష్ట్ర శాసనసభలు
బి. స్థానిక ప్రభుత్వాలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు)
సి. ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలు (ఎల్.ఐ.సి., ఓ.ఎన్.జి.సి., ఎన్.టి.పి.సి. మొదలైనవి)
డి. న్యాయవ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఎలాంటి ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ కేసుల తీర్పుల సందర్భంగా స్పష్టపరిచింది. అవి:
  • అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ (1981): సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పులో ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి కింది ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
  • మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి.
  • ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి.
  • ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలనా నియం త్రణ ఉండాలి.
  • ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి.

న్యాయస్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి - సుప్రీంకోర్టు తీర్పులు
ఎ.ఆర్. అంతూలే వర్సెస్ ఆర్.ఎస్. నాయక్ కేసు (1988): న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలున్నాయి.
ప్రకరణ 145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంత నియమ, నిబంధనలను రూపొందించుకోవచ్చు. అదేవిధంగా తన సిబ్బందిని నియ మించుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఈ చర్యలు కార్యనిర్వాహకపరమైనవి. వీటివల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు.
కాబట్టి న్యాయశాఖ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యమనే పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

రాజ్యం నిర్వచనం - మినహాయింపులు
సహకార సంఘాలు; బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా; ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థలు; ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం నిర్వచనం పరిధిలోకి రావు.
ప్రకరణ 13 - చట్టం నిర్వచనం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు - న్యాయ సమీక్షాధికారం
ప్రకరణ 13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే.. అవి చెల్లకుండా పోతాయి.
ప్రకరణ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే లేదా పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు.
ప్రకరణ 13(3)లో పేర్కొన్న చట్టం నిర్వచనం కిందకి వచ్చే అంశాలు:
  • కేంద్ర, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు.
  • రాష్ట్రపతి, గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్స్ లు.
  • ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, ప్రకటనలు.
  • ప్రభుత్వం గుర్తించిన, చట్టబద్ధత ఉన్న ఆచార వ్యవహారాలు.
ప్రత్యేక వివరణ
1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా.. నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలను నిబంధన 13లో పేర్కొన్న ‘చట్టం’ నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్‌నాథ్ కేసు(1967)లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి చేర్చారు. కానీ, సుప్రీంకోర్టు 1973లో కేశవానందభారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా చట్టం నిర్వచన పరిధిలోకి వస్తుంది.

ప్రాథమిక హక్కులు-వర్గీకరణ
సమానత్వ హక్కు (ప్రకరణ 14-18)
ప్రకరణ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఈ భావన బ్రిటిష్ రాజ్యాంగంలోని సమ న్యాయపాలన (Rule of law)కుఅనుగుణంగా పొందుపరిచారు. వ్యక్తి హోదా, గౌరవంతో సంబంధం లేకుండా హక్కులు కల్పిస్తారు.
 
సమన్యాయ పాలన భావాన్ని ‘ఎ.వి. డైసీ’అనే రాజ్యాంగ నిపుణుడు ప్రతిపాదించాడు. చట్టం మూలంగా సమాన రక్షణ (Equal protection of law) అనేది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. దేశంలో ఒకే చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని అమలు చేసే సమయంలో ప్రజలను వర్గీకరించి అమలు చేయొచ్చు. అయితే వర్గ చట్టాలు చేయొద్దు (Classification of people but not class legislation). దీన్నే ‘రక్షిత వివక్ష’  అంటారు. దీంతో సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
 
ప్రకరణ 14 ప్రకారం, చట్టం ముందు అందరూ సమానులే. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వొచ్చు. హేతుబద్ధ, శాస్త్రీయ వర్గీకరణ ద్వారా మినహాయింపులు ఇవ్వడం ప్రకరణ 14కు వ్యతిరేకం కాదు. భౌగోళిక ప్రాంతం, అక్షరాస్యత, పెద్ద, చిన్న పరిశ్రమలు, మైనర్, మేజర్, స్త్రీలు, పురుషులు మొదలైన ప్రాతిపదికలపైన మినహాయింపులు ఇవ్వొచ్చు.
 
ప్రత్యేక వివరణ
ప్రకరణ 39(బి), (సి)లోని ఆదేశికాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటే అవి ప్రకరణ 14కు వ్యతిరేకమని న్యాయస్థానంలో ప్రశ్నించొద్దు. వీటిని అమలు చేయడానికి ప్రకరణ 14 అడ్డుకాదు.
 
మినహాయింపులు
నిబంధన 14లో పేర్కొన్న‘ అందరూ సమానులు’ అనే సూత్రం రాష్ర్టపతి, గవర్నర్లకు వర్తించదు. వారు ఈ సూత్రానికి మినహాయింపు.
 
ప్రకరణ 361 ప్రకారం రాష్ర్టపతి, గవర్నర్ తమ అధికార విధుల నిర్వహణలో ఏ న్యాయ స్థానానికీ జవాబుదారులు కారు. వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలులేదు. అయితే రెండు నెలల ముందస్తు నోటీసుతో సివిల్ కేసులు పెట్టొచ్చు.
 
ప్రకరణ 105, ప్రకరణ 194 ప్రకారం, పార్లమెంట్, రాష్ర్ట శాసన సభల్లో సభ్యులు వ్యక్తీకరించిన అభిప్రాయాలకు వారు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
 
విదేశీ సార్వభౌములకు, దౌత్యవేత్తలకు కూడా మినహాయింపుఉంటుంది.
 
ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి కూడా ఈ మినహా యింపు వర్తిస్తుంది.
 
సుప్రీంకోర్టు ముఖ్య తీర్పులు
చిరంజిత్ లాల్ వర్సెస్యూనియన్ ఆఫ్ ఇండియా (1950)
చట్టం ముందు అందరూ సమానులే అంటే సమానుల్లో మాత్రమే సమానత్వం అమలుచేస్తారని సుప్రీంకోర్టు  పేర్కొంది. హేతుబద్ధమైన వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది.
 
బెన్నెట్ కోల్‌మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1973)
పత్రికలను చిన్న, పెద్ద పత్రికలు అనే ప్రాతిపదికపై వర్గీకరించి  న్యూస్ ప్రింట్ పంపిణీ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని పత్రికలకు సమానంగా పంపిణీ చేయడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది.
 
విశాఖ వర్సెస్  స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1997)
 పనిచేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులు  ప్రకరణ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి వ్యతిరేకం, స్త్రీల పట్ల వివక్ష అని, పురుషులతో సమానంగా వారు హక్కులను కలిగి ఉండే అధికారం ఉందని పేర్కొంది. పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.
 
ప్రకరణ 15
ప్రకరణ 15(1):
మత, జాతి, కుల, లింగ,పుట్టుక అనే  వివక్షను పాటించొద్దు.
 
ప్రకరణ 15(2): ప్రజా ప్రయోగకర ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. ఈ సౌకర్యాల విషయంలో వివక్ష చూపొద్దు. బావులు, చెరువులు, రోడ్లు, హోటళ్లు, వినోద ప్రదేశాలు, ఇతర ప్రజా సంబంధ ప్రదేశాల్లోకి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి.
 
మినహాయింపులు
ప్రకరణ 15(3):
దీని ప్రకారం మహిళలు, బాలలకు ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు.
 
ప్రకరణ 15(4): సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, మినహాంపులు ఇవ్వొచ్చు. ఈ క్లాజ్‌ను 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
 
ప్రకరణ 15(5): ప్రైవేట్, ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు లేదా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు. అయితే ఇది ప్రకరణ 30లో పేర్కొన్న మైనారిటీ సంస్థలకు వర్తించదు. ప్రకరణ 15(5) క్లాజ్‌ను 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
 
ప్రకరణ 16
ప్రకరణ 16(1):
ప్రభుత్వోద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు.
 
ప్రకరణ 16(2): ప్రభుత్వోద్యోగాల్లో పౌరులను జాతి, మత, కుల, లింగ పుట్టుక వారసత్వ, స్థిర నివాస అనే ఏడు ప్రాతిపదికలపై వివక్ష చూపొద్దు.
 
ప్రకరణ 16(3): ప్రభుత్వ ఉద్యోగాల్లో   షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చు.
 
ప్రకరణ 16(4ఎ): ప్రభుత్వోద్యోగాలు, ప్రమోషన్లలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఈ అంశాన్ని 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు.
 
ప్రకరణ 16(4బి): ఈ క్లాజును 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో చేర్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక ఏడాదిలో కేటాయించిన రిజర్వ్ కోటా  భర్తీ కాకుంటే ఆ ఖాళీలను తర్వాత సంవత్సరంలో సంబంధిత రిజర్వేషన్ కోటాలో కలుపుతారు. అప్పుడు రిజర్వేషన్ల శాతం 50కి మించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ ఏడాది రిజర్వేషన్ కోటాలో కలిసిన గత సంవత్సరం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా, మిగిలిన ఖాళీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో క్యారీ ఫార్వర్డ్ అవకాశాన్ని కల్పించారు.
 
ప్రకరణ 16(5): ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖలో పూర్తిగా ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉంటే ఆ శాఖలో కేవలం ఆ మత విశ్వాసాలకు చెందిన వారిని మాత్రమే నియమించడానికి తగిన చట్టాలను ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు.
దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడానికి హిందువులు మాత్రమే అర్హులు. అలాగే వక్ఫ్‌బోర్డు ఇతర మత సంస్థల్లో నియామకాలకు సంబంధిత మత విశ్వాసం ఉన్నవారే అర్హులు.
అదేవిధంగా 2001లో 85వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందిన ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా లభించే సీనియారిటీ అర్హత కూడా లభిస్తుంది. ఈ సవరణ 1995 నుంచి వర్తిస్తుంది.
 
ప్రత్యేక వివరణ
81, 85వ రాజ్యాంగ సవరణల ద్వారా  గతంలో సుప్రీంకోర్టు బాలాజీ వర్సెస్ మైసూరు (1963), ఇంద్ర సహాని వర్సెస్ భారత ప్రభుత్వం (1992) కేసుల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పిన తీర్పులకు మినహాయింపు లభించింది.
 
మండల్ కమిషన్ నివేదిక
వెనుకబడిన తరగతులను వర్గీకరించి తగిన రాయితీలు కల్పించడానికి 1979లో నాటి జనతా ప్రభుత్వం బి.పి. మండల్ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కేంద్ర సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 1989లో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తర్వాత పి.వి. నరసింహారావు ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికకు రెండు సవరణలు చేసింది.
 ఎ) వెనుకబడిన తరగతులకు కేటాయించిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయడం.
 బి) అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం.
 పై అంశాలు ఇంద్రా సహాని కేసులో  సుప్రీంకోర్టులో చర్చకు వచ్చాయి.
 
ఇంద్రా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (మండల్ కేసు) (1993)
వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే.
 వెనుకబడిన తరగతుల్లో క్రిమీలేయర్ (మెరుగైన వర్గాలు)ను గుర్తించి వారిని రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా, అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించొద్దు.
ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు.  రాజ్యాంగంలో ఈ ప్రాతిపదికన మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.
గమనిక: క్రిమీలేయర్ వర్గాలను గుర్తించడానికి 1993లో రామ్‌నందన్ ప్రసాద్ కమిటీని నియమించారు.
 
ప్రకరణ 17
ఈ ప్రకరణ ప్రకారం అస్పృశ్యతను నిషేధించారు. ఈ ప్రకరణ తనంతట తాను అమలులోకి రాదు. దీని అమలుకు సంబంధిత చట్టాలను రూపొందించాలి. అయితే అస్పృశ్యత అనే పదాన్ని రాజ్యాంగంలోగాని, చట్టంలోగానీ నిర్వచించలేదు. కులతత్వ నేపథ్యంలో అస్పృశ్యతను గమనించాలని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. దీని అమలుకు సంబంధించి పార్లమెంట్ ఈ కింది చట్టాలను రూపొందించింది.
 
అస్పృశ్యత నిషేధ చట్టం (1955)
అస్పృశ్యతను నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణిస్తూ, పార్లమెంట్ 1955లో ఈ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టంలోని లొసుగులను తొలగించడానికి 1976లో ఈ చట్టాన్ని సమగ్రంగా సవరించి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా  పేరు మార్చారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు, అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.
 
ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టం (1989)
ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అకృత్యాలను సమగ్రంగా నిరోధిస్తూ కఠినమైన నియమ నిబంధనలను రూపొందించారు.
 
ప్రకరణ 18
18(1):
సైనిక, విద్యాపరమైన గుర్తింపు మినహా మిగతా బిరుదుల రద్దు.
 
18(2): భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించొద్దు.
 
18(3): భారత పౌరులు కానప్పటికీ భారత ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్నప్పుడు రాష్ర్టపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎలాంటి బిరుదులు స్వీకరించొద్దు.
 
18(4): ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాష్ర్టపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎలాంటి బహుమతులను, భత్యాన్ని, ఉద్యోగాన్ని స్వీకరించొద్దు.
 
ఈ ప్రకరణలో కొన్ని రకాల బిరుదులను రద్దు చేశారు. ఉదాహరణకు, బ్రిటిష్ పాలనా కాలంలో సమాజంలోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక ప్రాతిపదికలపై కల్పించిన ప్రత్యేక హోదాలైన రావ్ బహద్దూర్, రావ్ సాహబ్, రాజా విక్రమార్క, జాగిర్దార్, ఇనాందార్, జమిందార్ మొదలగు వాటిని రద్దు చేశారు.
 
అయితే ఈ నిషేధం విద్యా, సైనిక, విశిష్ట యోగ్యతాపరమైన బిరుదులకు వర్తించదు. ఉదాహరణకు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అదే విధంగా సైనిక హోదాలైన పరమ వీరచక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర, మొదలగు వాటిని ఇవ్వవచ్చు.
 
ప్రత్యేక వివరణ
భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పౌర పురస్కారాలేకానీ బిరుదులు కావు. వీటిని పేరుకు ముందుకానీ, పేరుకు తర్వాతకానీవాడటం, వ్యాపార కార్యక్రమాలకు వినియోగించొద్దని బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996)లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ మధ్యనే సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం తమ పద్మశ్రీ గుర్తింపును వ్యాపారపరంగా ఉపయోగించారనే అభియోగంతో వాటిని రద్దు చేయాలని కోర్టు సూచించింది.
Published date : 03 Dec 2015 05:11PM

Photo Stories