Skip to main content

న్యాయ సమీక్షాధికారం

ప్రాథమిక హక్కులు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ, రాజ్యాంగ ఆధిక్యత తదితర అంశాలు న్యాయ సమీక్షకు తోడ్పడతాయి. ‘న్యాయ సమీక్ష’ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
1803లో మార్బరీ Vs మాడిసన్ వివాదంలో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ తీసుకున్న గొప్ప నిర్ణయం నుంచి న్యాయ సమీక్ష సూత్రం ఆవిర్భవించింది. భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ న్యాయ సమీక్ష భావనను స్వీకరించాయి.

భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదం లేకపోయినా, ఆ భావన మాత్రం రాజ్యాంగంలో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు న్యాయ సమీక్ష భావనను వ్యక్తీకరిస్తున్నాయి. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్ష అవసరమని రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కె.ఎం. మున్షీ పేర్కొన్నారు.

న్యాయ సమీక్ష అధికారం అంటే?
శాసన శాఖ రూపొందించే శాసనాలు, కార్యనిర్వాహక శాఖ అమలు చేసే విధానాలు రాజ్యాంగబద్ధంగా లేకుంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయ శాఖకు ఉంటుంది. ఈ అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు.

భారత రాజ్యాంగంలోని ప్రకరణ 13(2) ద్వారా న్యాయ సమీక్ష అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కల్పించారు. ప్రభుత్వం రూపొందించే శాసనాలు, విధానాలు ప్రకరణ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.

న్యాయ సమీక్షకు ఆధార సూత్రాలు
‘కంపారిటివ్ పాలిటిక్స్’ గ్రంథ రచయిత జె.సి. జోహారి.. న్యాయ సమీక్షకు ఆధారాలైన ఆరు సిద్ధాంతాలను పేర్కొన్నారు. అవి..
  1. శాసన సామర్థ్య సిద్ధాంతం
  2. వేర్వేరు భాగ సిద్ధాంతం
  3. రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం
  4. క్రియాశీల సిద్ధాంతం
  5. అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం
  6. రాజ్యాంగ పురోభావన సిద్ధాంతం
ఒక అంశాన్ని సమీక్షించి, అది రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే దాన్ని ఆల్ట్రావైరస్ అంటారు. అది రాజ్యాంగ సమ్మతమైందిగా ప్రకటిస్తే.. దాన్ని ఇంట్రావైరస్ అంటారు.

న్యాయ సమీక్ష అధికారం- సుప్రీంకోర్టు వ్యక్తీకరణలు
1951లో సుప్రీంకోర్టు మొదటిసారిగా శంకరీ ప్రసాద్ Vs భారత ప్రభుత్వం వ్యాజ్యంలో న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించింది. అదేవిధంగా ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని వ్యక్తీకరించింది.

గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం-1967లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆధ్వర్యంలోని బెంచ్.. ప్రకరణ-13కు సంబంధించిన సవరణ గురించి తీర్పు చెబుతూ.. నిబంధన-368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణలు ప్రకరణ- 13 పరిధిలోకి వస్తాయని, అందువల్ల అవి చెల్లవని తీర్పు చెప్పింది. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదని పేర్కొంది.

1973లో కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ వివాదంలో.. గోలక్‌నాథ్ వివాదంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత పార్లమెంట్ చేసిన 24, 25 రాజ్యాంగ సవరణలను పరిశీలించిన తర్వాత నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్. సిక్రీ పై తీర్పును వెలువరించారు.

మినర్వా మిల్స్ కేసు-1980లో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లకుండా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగ మౌలిక అంశాల్లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

ఎస్.ఆర్. బొమ్మాయ్ కేసు-1994లో సుప్రీంకోర్టు లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని, దాన్ని రద్దు చేసేఅధికారం పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా రాష్ర్ట ప్రభుత్వం లౌకికతత్వాన్ని ఉల్లంఘిస్తే నిబంధన-356 ప్రకారం ఆ రాష్ర్ట ప్రభుత్వంపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.

అశోక్ కుమార్ ఠాగూర్ Vs భారత ప్రభుత్వం కేసులో 9వ షెడ్యూల్‌లోని అంశాలు కూడా న్యాయ సమీక్షకు గురవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

భారత న్యాయ శాఖ న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించడం ద్వారా కింది న్యాయ సూత్రాలు వచ్చాయి.

శాసనసభ అధికార పరిమితి: శాసనసభ చేసిన చట్టం రాజ్యాంగపరమైందా, శాసనసభ తన అధికార పరిధికి లోబడి వ్యవహరించిందా లేదా అని నిర్ణయించడం.

విభాగ సిద్ధాంతం: చట్టం మొత్తం కాకుండా, అందులోని ఏ విభాగం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటుందో అది చెల్లదని తీర్పునివ్వడం.

సంవర్ధక వ్యాఖ్యానం: మారుతున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ వాతావరణంలో చట్టాలను కాలానుగుణంగా వ్యాఖ్యానించడం.

రాజ్యాంగభావ సిద్ధాంతం: చట్టాలను వ్యాఖ్యానించడంలో, తీర్పులు ఇవ్వడంలో రాజ్యాంగ ఉద్దేశం, భావాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం.

రాజ్యాంగబద్ధమని భావించడం: ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని రుజువయ్యేంత వరకు అది రాజ్యాంగ పరంగా సరైందేనని న్యాయ శాస్త్రం భావిస్తుంది.

న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే అంశాలు
ప్రకరణ-13 ప్రకారం: ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే శాసనాలు చెల్లవని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అదే న్యాయసమీక్షాధికారం.
ప్రకరణ-32 ప్రకారం: ప్రాథమిక హక్కులకు విరుద్ధ కార్యనిర్వహణ చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొనొచ్చు.
ప్రకరణ-73 ప్రకారం: కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాలను న్యాయ సమీక్షకు గురిచేయొచ్చు.
ప్రకరణ-162 ప్రకారం: రాష్ర్ట ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాలను న్యాయ సమీక్ష కు గురిచేయొచ్చు.
ప్రకరణ-131 ప్రకారం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల విషయంలో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు.
ప్రకరణ-132 ప్రకారం: ప్రత్యేక కేసుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ అప్పీళ్లను స్వీకరించవచ్చు.
ప్రకరణ-133 ప్రకారం: సుప్రీంకోర్టు సివిల్ అప్పీళ్ల స్వీకరణ.
ప్రకరణ-134 ప్రకారం: క్రిమినల్ కేసుల్లో అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టవచ్చు.
ప్రకరణ-136 ప్రకారం: అప్పీళ్లకు సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి ఇవ్వడం.ప్రకరణ-137 ప్రకారం: ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు తనే పునఃసమీక్షించుకోవడం.
ప్రకరణ-147 ప్రకారం: రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వడం.
ప్రకరణ-246 ప్రకారం: పార్లమెంట్, శాసనసభల శాసన అధికార పరిధిని నిర్ణయించడం.
ప్రకరణ-248 ప్రకారం: అవశిష్టాధికారాలను నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.
ప్రకరణ-254 ప్రకారం: ఉమ్మడి జాబితాపై కేంద్రం, రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం.
ప్రకరణ-256 ప్రకారం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బాధ్యతలను తెలియజేయడం.
ప్రకరణ-257 ప్రకారం: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ.
ప్రకరణ-258 ప్రకారం: కేంద్ర అధికారాలను రాష్ట్రాలకు సంక్రమింపజేయడం.

న్యాయ సమీక్షకు అవకాశం లేని అంశాలు
ప్రకరణ-53 ప్రకారం: భారత రాష్ర్టపతి పేరుపై కార్యనిర్వహణ అధికారాలను ఏర్పాటు చేయడం. పరిపాలన రాష్ర్టపతి పేరుపై నిర్వహించడం.
ప్రకరణ-74(1) ప్రకారం: ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర మంత్రిమండలి రాష్ర్టపతికి సలహాలివ్వడం.
ప్రకరణ-77(1) ప్రకారం: ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రాష్ర్టపతి పేరునే జరగాలి.
ప్రకరణ-105 ప్రకారం: పార్లమెంట్ సభ్యులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, హక్కులు.
ప్రకరణ-122 ప్రకారం: పార్లమెంట్ కార్యకలాపాలపై న్యాయస్థానాలు విచారణ జరపకూడదు.
ప్రకరణ-154 ప్రకారం: రాష్ర్ట కార్యనిర్వహణ అధికారాలు గవర్నర్ పేరుపై రూపొందాయి.
ప్రకరణ-163(1) ప్రకారం: ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడిన మంత్రిమండలి రాష్ర్ట పాలనలో గవర్నర్‌కు సలహాలివ్వడం.
ప్రకరణ 166(1) ప్రకారం: రాష్ర్ట ప్రభుత్వ కార్యక్రమాలన్నీ గవర్నర్ పేరునే జరగాలి.
Published date : 06 Feb 2017 12:26PM

Photo Stories