Skip to main content

భారత ఆర్థిక ప్రణాళిక వ్యవస్థ

దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రణాళికా సంఘం పాత్ర కీలకమైంది. వలసవాదుల దోపిడీ నుంచి విముక్తి పొంది స్వపరిపాలన దిశగా బుడిబుడి అడుగులు ప్రారంభించిన భారత్.. ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధి సాధించడానికి మార్గదర్శనం చేసే గురుతర బాధ్యతను ప్రణాళికా సంఘం భుజాలనెత్తుకుంది. ఈ ప్రస్థానం నల్లేరుపై నడకేం కాలేదు. లక్ష్యాల సాధనలో అడుగడుగునా అనేక సవాళ్లు, ఎన్నో ఒడుదొడుకులు.. ఎన్ని అవాంతరాలెదురైనా దృఢ నిర్ణయాలతో అయిదేళ్ల కాలానికి ప్రణాళికలు రచిస్తూ, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తూ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా పురోగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తినా ఆ ప్రభావం భారత్‌పై నామమాత్రంగానే ఉందంటే.. దానికి కారణం ప్రణాళిక సంఘం అందించిన సుస్థిర ఆర్థిక విధానాలేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇటీవలే ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న అభ్యర్థుల సౌకర్యార్థం ‘భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ - లక్ష్యాలు, వ్యూహాలు, ప్రణాళికా సంఘం పాత్ర’కు సంబంధించిన ఆసక్తికర అంశాలను అందిస్తున్నారు.. టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, హెచ్‌సీయూ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు.
భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ - లక్ష్యాలు, వ్యూహాలు
భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశ ఆర్థిక, సామాజిక పురోగతి కోసం ప్రణాళికా వ్యవస్థను రూపొందించుకోవాలని భావించారు. భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వివిధ దేశాల్లో అనుసరిస్తున్న కేంద్రీకృత ప్రణాళికా విధానానికి ప్రభావితులై మన దేశంలోనూ వీటిని అమలు చేయడానికి కృషి చేశారు. నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 1950లో పి.సి. మహలనోబిస్ ఆధ్వర్యంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ 65 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంది. మౌలిక లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాలానుగుణ నిర్ణయాలతో సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా పురోగమించింది. ప్రపంచపటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగింది. ఈ దిశగా ప్రణాళికా వ్యవస్థ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా గమ్యం చేరుకోవడంలో కొన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధి దిశగా సాగించిన సుదీర్ఘ ప్రయాణంలోనూ ఇలాంటి ఇబ్బందులు అనేకం ఎదురయ్యాయి. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని విధాన నిర్ణయాలతో ముందడుగేశారు. మన దేశంలో 1950 నుంచి 2012 వరకు 11 పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. 2012లో 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఇది 2017 వరకు కొనసాగుతుంది.

ప్రణాళికా వ్యవస్థ ప్రారంభదశలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, వ్యూహాలు కాలానుగుణంగా ఏ విధమైన మార్పులకు గురయ్యాయి? ఏ మేరకు లక్ష్యాలను సాధించగలిగాం తదితర అంశాలను ముందుగా పరిశీలిద్దాం..
వలసపాలన సంకెళ్లు తెంచుకుని స్వతంత్ర భారతంగా ఆవిర్భవించే నాటికి దేశంలో 70 శాతం కంటే అధిక జనాభా వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవనం సాగిస్తోంది. పేదరికం, నిరుద్యోగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పరిశ్రమలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఉపాధి అవకాశాల కొరత ఏర్పడింది. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికాభివృద్ధి విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో స్పష్టమైన లక్ష్యాలను నిర్వచించుకోవడం అనివార్యమయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికల రచయితలు అభివృద్ధి, ఆదాయ వనరులను సృష్టించుకోవడంతోపాటు సామాజిక న్యాయం, అన్ని వర్గాలవారికీ సముచిత అవకాశాలు కల్పించడం, ఆదాయ వనరుల కేటాయింపు మొదలైన అంశాలను ప్రాధాన్యాలుగా ఎంచుకున్నారు.

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)
రెండో ప్రపంచ యుద్ధ ప్రభావంతో కకావికలమైన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అసమతౌల్యంతో కొట్టుమిట్టాడుతోంది. బ్రిటిషర్లు మనదేశంలోని సంపదను కొల్లగొట్టడం వల్ల ఏర్పడిన పరిస్థితులకు క్షామం కూడా తోడవటంతో.. తీవ్ర ఆహార కొరత, ద్రవ్యోల్బణం, దుర్భిక్ష సమస్యలతోపాటు కాందీశీకుల చొరబాటు మన ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. ఇలాంటి సంధికాలంలో ప్రణాళికా సంఘం ద్వారా 1951 జూలైలో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. దీన్ని 1952 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు
  1. ఆహారోత్పత్తిని పెంచడం.
  2. ఉత్పత్తి వనరులను సంపూర్ణంగా వినియోగించుకునేలా అందుబాటులోకి తేవడం.
  3. దేశ విభజన, రెండో ప్రపంచ యుద్ధం ద్వారా ఏర్పడిన ఆర్థిక అసమతౌల్యాన్ని తగ్గించడం.
  4. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం.
  5. రైలు మార్గాలు, విద్యుచ్ఛక్తి, రహదారులు, నీటిపారుదల (డ్యామ్‌ల నిర్మాణం) లాంటి మౌలిక వసతుల (అవస్థాపన సౌకర్యాలు, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కల్పనకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం.
  6. ఆస్తి, సంపద, ఆదాయ వ్యత్యాసాల్లో అసమానతలను క్రమంగా తగ్గించి, వాటిని పూర్తిగా రూపుమాపడానికి చర్యలు తీసుకోవడం.
  • మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 3870 కోట్లు. ఇందులో రూ. 2378 కోట్లు పబ్లిక్ రంగం పెట్టుబడి. మరో రూ.1800 కోట్లు ప్రైవేట్ రంగం నుంచి సమకూరాయి.
  • ప్రణాళికా వ్యయం మొత్తాన్ని వ్యవసాయ, పారిశ్రామిక, శక్తి, నీటిపారుదల, రవాణా, సమాచార, సాంఘిక సేవా రంగాలకు కేటాయించారు.
  • మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో చాలా లక్ష్యాలనే సాధించగలిగారు. స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి లక్ష్యాన్ని 2.1 శాతంగా నిర్ణయించారు. సాధించిన వాస్తవ వృద్ధిరేటు 3.6 శాతం.
  • మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలోనే దేశంలోని ప్రధాన నదులపై మెట్టూర్, హిరాకుడ్, భాక్రానంగల్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించారు.

రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)
పి.సి. మహలనోబిస్ స్ఫూర్తితో రెండో పంచవర్ష ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇందులో పారిశ్రామిక రంగం అభివృద్ధికి పునాదులు వేశారు. 1948లో ప్రతిపాదించిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని సమీక్షించి 1956లో రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించారు. పబ్లిక్ రంగ పరిశ్రమలకు పెద్దపీట వేశారు. సత్వర పారిశ్రామికీకరణ కోసం భారీ పరిశ్రమలను స్థాపించారు.
  • భారత్ అల్యూమినియం, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, బొగ్గు, రాగి, మాంగనీస్ లాంటి భారీ పరిశ్రమలతోపాటు.. విద్యా, శిక్షణ, శాస్త్ర, సాంకేతిక సంస్థలను పెద్ద ఎత్తున ప్రారంభించారు.
ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు
  1. జాతీయ ఆదాయస్థాయిని పెంపొందించుకోవడం రెండో ప్రణాళిక బృహత్తర లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి లక్ష్యాన్ని 4.5 శాతంగా నిర్ణయించారు. ప్రణాళికాంతానికి ఈ వృద్ధిరేటును దాదాపు అందుకున్నారు.
  2. సత్వర పారిశ్రామికీకరణ కోసం ముఖ్య ఆధారభూతమైన పరిశ్రమలను దశలవారీగా నెలకొల్పడం మరో లక్ష్యంగా ఎంచుకున్నారు.
  3. శ్రమ సాంద్రత ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడం మరో లక్ష్యం.
  4. అభివృద్ధి సాధిస్తూనే, ఆదాయ అసమానతలను తగ్గించడానికి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
  • రెండో ప్రణాళికా కాలం నాటికి దేశంలో ఆదాయ వనరులు పెరిగాయి. వివిధ దేశాల సహకారంతో ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలను స్థాపించారు. దుర్గాపూర్, భిలాయ్, రూర్కేలా స్టీల్ పరిశ్రమలను ఈ విధంగానే ఏర్పాటు చేశారు. వీటితోపాటు భారీ యంత్ర పరిశ్రమలు, యంత్ర పనిముట్లకు సంబంధించిన యూనిట్లను నెలకొల్పారు.
  • 1957లో అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
  • ఈ ప్రణాళికా కాలంలో మౌలిక రంగ ఉత్పాదనల్లో పటిష్టమైన సమర్థత, వైవిధ్యం సాధించగలిగారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీలు, రసాయన, ఔషధ పరిశ్రమల విషయంలో సాధికారత సాధ్యమైంది.

మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)
మూడో పంచవర్ష ప్రణాళికలో దీర్ఘ కాలిక అభివృద్ధి స్థిరీకరణ, అయిదేళ్లకాలంలో సమర్థమైన స్వయం నిర్భరత, స్వయం సమృద్ధి సాధన, స్వతహాగా ప్రగతి మార్గంలో వృద్ధిరేటు సాధన తదితరాలను లక్ష్యాలుగా నిర్దేశించారు.
ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు
  1. ఆహార, వ్యవసాయోత్పత్తులను అధికం చేసుకుంటూ ఆహార స్వయం సమృద్ధి సాధించడం.
  2. మౌలిక పరిశ్రమలను విస్తరించడం, అందుబాటులో ఉన్న వనరుల వినియోగాన్ని ఒక దశాబ్ద కాలంలో ద్విగుణీకృతం చేసుకోవడం.
  3. స్థూల జాతీయోత్పత్తి రేటును 5 శాతం సాధించడానికి కృషి చేయడం.
  4. మానవ వనరుల సమగ్ర వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ప్రగతి సాధించడం.
  5. ఉద్యోగావకాశాలు, ఆదాయ వనరుల పంపిణీలో ఆర్థిక అసమానతలను తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
  • మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 11,600 కోట్లు. ఇందులో రూ. 7500 కోట్లు పబ్లిక్ రంగానికి కేటాయించారు.
  • నిర్దేశించిన లక్ష్యాలు, అన్ని రంగాల అభివృద్ధిని సాధించడంలో మూడో పంచవర్ష ప్రణాళిక విఫలమైందనే చెప్పవచ్చు.

వార్షిక ప్రణాళికలు
మూడో పంచవర్ష ప్రణాళిక ముగిసే (1966) నాటికి దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దీంతో 1967, 1968, 1969 వార్షిక ప్రణాళికలతో ఆర్థిక వ్యవహారాలను నెట్టుకు రావాల్సిన గడ్డు పరిస్థితులు తలెత్తాయి. కొందరు ఆర్థికవేత్తలు ఈ మూడేళ్ల కాలాన్ని ‘ప్రణాళికా విరామం’గా పేర్కొంటారు. వార్షిక ప్రణాళికలు రూపొందించడానికి రెండు ప్రధాన కారణాలుఉండగా, చైనాతో యుద్ధం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. నెహ్రూచౌఎన్‌లై మధ్య కుదిరిన పంచశీల ఒప్పందం విఫలమైంది. దీంతో 1962లో భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన ఆక్సాయ్ చిన్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధ ప్రభావం నుంచి తేరుకోక ముందే, మూడేళ్లు తిరక్కుండానే పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సి రావడం రెండో కారణం. ఈ రెండు యుద్ధాలతో భారత ఆర్థిక వ్యవస్థ భారీ ఒడిదొడుకులకు గురైంది. ఆ సంక్లిష్టతను అధిగమించడం కోసం మూడేళ్లపాటు వార్షిక ప్రణాళికలతో ఆర్థిక గమనం సాగించాల్సి వచ్చింది.
ఈ మూడు వార్షిక ప్రణాళికలకు రూ. 1624 కోట్లు కేటాయించారు. అందులో 24 శాతం వ్యవసాయానికి, సామాజిక సమూహాల అభివృద్ధికి కేటాయించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని సానుకూలతలను కూడా గమనించవచ్చు. వార్షిక ప్రణాళికల కాలంలో దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వ్యవసాయ రంగ వృద్ధిరేటు 6.9 శాతంగా నమోదైంది. 1967-68లో ఆహారోత్పత్తి గరిష్టంగా 95.6 మిలియన్ టన్నులకు చేరింది. అప్పటి వరకు వార్షిక ఆహార పంటల దిగుబడిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదే కాలంలో రసాయనిక ఎరువుల వినియోగం, అధికోత్పత్తి సాధించే వంగడాల వాడకం విస్తృతమైంది. ఈ దశలోనే ఆధునిక నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. అందుకే ఆర్థికవేత్తలు ఈ దశను హరిత విప్లవం లేదా గ్రీన్ రివల్యూషన్ అని పిలుస్తారు.
హరిత విప్లవ కాలంలో వ్యవసాయాభివృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ధనిక రైతు వర్గం మరింత బలపడింది. చిన్న, సన్నకారు రైతులు.. రైతు కూలీలుగా మారారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. వ్యవసాయాభివృద్ధి ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని జిల్లాలకు పరిమితమైంది. దక్షిణాదిలో తమిళనాడులోని రెండు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా లాంటి ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన పోరాటాలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక విదర్భ తదితర ఉద్యమాలు దీని పర్యావసానమే. మూడో పంచవర్ష ప్రణాళిక ఆరంభం నాటికే ప్రాంతీయ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రాంతీయ ప్రణాళికా బోర్డుల ఏర్పాటు ఆవశ్యకతను కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ప్రాధాన్యాన్ని ఉటంకించారు. ఇందుకోసం తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక బోర్డుతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయి (రాష్ర్ట స్థాయి) ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేశారు.

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969 -74)
వార్షిక ప్రణాళికల కారణంగా నాలుగో పంచవర్ష ప్రణాళిక మూడేళ్లు ఆలస్యంగా 1969లో ప్రారంభమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక సంఘం నూతన లక్ష్యాలను నిర్దేశించింది. 5.5 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక స్థిరీకరణ, ఆదాయ అసమానతలు తగ్గించడం తదితరాలను కూడా ప్రాధాన్యాంశాల్లో చేర్చారు. స్వావలంబనను అధిక ప్రాధాన్యం ఉన్న అంశంగా పేర్కొన్నారు. వ్యవసాయం, సంబంధిత ప్రాథమిక రంగాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు.
పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. తద్వారా క్షేత్రస్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచవచ్చని భావించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చి, ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారించారు.
ఆహార ధాన్యాలు, దినుసుల సరఫరాను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నారు. వర్షాభావం వల్ల పంట దిగుబడి తగ్గిన సందర్భంలో మధ్యంతర నిల్వలు(బఫర్ స్టాక్స్) నిర్వహించే గిడ్డంగుల ఏర్పాటుకు ప్రయత్నించారు. గుత్తాధిపత్య నివారణ కోసం పారిశ్రామిక నియంత్రణ చట్టాల్లో మార్పులు చేశారు. ఆర్థికస్వామ్య కేంద్రీకృత ధోరణులను నివారించే దిశగా ద్రవ్య, కోశ విధానాల్లో మార్పులు చేపట్టారు. సహకార వ్యవస్థను పటిష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం మొదలైంది. తద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయిలో విస్తరించే పథకాన్ని ప్రారంభించడం ఈ ప్రణాళికా కాలంలోనే వేళ్లూనుకుంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాల రద్దు కూడా ఈ కాలంలోనే జరిగింది. 1971లో మరోసారి పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం ద్వారా తూర్పు పాకిస్తాన్ విమోచనం పొంది, బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరింది. ఈ యుద్ధం వల్ల ఇందిరా గాంధీ కీర్తిప్రతిష్టలు పెరిగాయి. ఆమె బంగ్లాదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కానీ వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ప్రణాళిక విఫలమైంది. 5.6 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకోగా 3.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.

అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-79)
1974-75లో ప్రపంచ బ్యాంకు నేతృత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తల వర్గం స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలకు అనుకూలంగా అనేక సిద్ధాంతాలను ముందుకు తెచ్చింది. ఇవి ప్రణాళికా విధానానికి, వాణిజ్యంలో ప్రభుత్వ రంగ జోక్యానికి వ్యతిరేకం. ఈ క్రమంలోనే మహలనోబిస్ సిద్ధాంత వ్యూహాలను విమర్శించడం మొదలైంది. భారతదేశ స్వావలంబన విధానాన్ని, దిగుమతి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఈ వర్గం విమర్శించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల ఉనికిని ప్రశ్నించింది. మార్కెట్ లావాదేవీల్లో ప్రభుత్వ జోక్యం తగ్గించుకోవాలనే వాదన ఈ సమయంలోనే మొదలైంది. ఈ తరహా వాదనలు చేసిన వారిలో జగదీశ్ భగవతి, టీఎన్ శ్రీనివాసన్, అవినాశ్ దీక్షిత్, మాంటెక్ సింగ్ అహ్లువాలియా తదితరుల గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే వీరి వాదనలు, ప్రతిపాదనలు సాకారం కావడానికి 1991 వరకు వేచి చూడాల్సి వచ్చింది. వారి విమర్శలు, సూచనలు ఆ దశకంలో ఆకట్టుకోలేకపోయాయన్నది నిర్వివాదాంశం. అయిదో పంచవర్ష ప్రణాళిక కూడా స్వావలంబన మార్గంలోనే పయనించింది.
ఈ ప్రణాళిక లక్ష్యాలు..
  1. సంపూర్ణ జాతీయ వృద్ధి రేటును 5.5 శాతం లక్ష్యంగా నిర్ణయించారు.
  2. ఉద్యోగావకాశాల విస్తరణ, ఇదివరకే ఉన్న ఉత్పత్తి సామగ్రి, నైపుణ్యాల సమగ్ర, సమర్థమైన వినియోగానికి దిశా నిర్దేశం.
  3. సామాజిక సంక్షేమానికి, జీవనానికి కావాల్సిన మౌలిక అవసరాల కోసం విస్తృత పర్చిన జాతీయ కార్యక్రమం.
  4. వ్యవసాయ విద్య, శిక్షణ, పరిశోధనలను పటిష్టం చేయడం. 125 మెట్రిక్ టన్నుల అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై దృష్టిసారించడం.
  5. నిత్యావసరాల కోసం వస్తువుల ఉత్పత్తిని పెంచడం. ఇందుకు అవసరమైన మౌలిక పరిశ్రమలను నెలకొల్పడం. అంటే దేశవ్యాప్తంగా వినిమయ డిమాండ్‌ను అధికం చేయడం.
  6. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు కల్పించడం.
  7. సంస్థాగత, వ్యవస్థాగత, ద్రవ్య, కోశ విధానాలను మెరుగుపర్చడం. తద్వారా సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
ఈ ప్రణాళిక కోసం రూ.53,410 కోట్లు కేటాయించారు. అందులో ప్రభుత్వ రంగ కేటాయింపులు సుమారు రూ. 39,426 కోట్లు. ఇదే కాలంలో దిగుమతి ఆంక్షలను సడలించి, కొంత సరళీకరణ చర్యలు చేపట్టడం కూడా గమనించవచ్చు. ఎమర్జెన్సీ విధించడం వల్ల 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూసింది. అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1978లోనే ప్రణాళికా కాలాన్ని కుదించింది. 1978-79, 1979-80 సంవత్సరాలకు భారతదేశ ఆర్థిక గమనంలోనే నూతన తరహా ప్రణాళికా పద్ధతి చోటు చేసుకుంది. ఈ తరహా ప్రణాళికలనే ‘చలన ప్రణాళికలు’ లేదా రోలింగ్ ప్రణాళికలు అంటారు. జనతా ప్రభుత్వం 1978లో ప్రవేశపెట్టిన ఆరో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమై రెండేళ్లపాటు అమల్లో ఉంది. 1979లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జనతా పార్టీ ప్రణాళికాలను రద్దు చేసింది. ఆ స్థానంలో 1980లో మళ్లీ ఆరో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఆరో ప్రణాళికను పరిశీలించే ముందు రోలింగ్ ప్రణాళికా విధాన సిద్ధాంతాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రోలింగ్ ప్లాన్‌లో మూడు ఉత్తర భాగాలుంటాయి. అంటే ఒకే ప్రణాళికలో మూడు విడివిడి భిన్న ప్రణాళికలు ఉంటాయన్నమాట. మొదటిది ప్రస్తుత సంవత్సర ప్రణాళిక. ఇది వార్షిక బడ్జెట్‌లో భాగంగా ఉంటుంది. రెండో ప్రణాళికను ఒక నిర్దిష్ట కాల పరిమితికి నిర్ణయిస్తారు. దీన్ని మూడు నుంచి నాలుగు లేదా అయిదేళ్లకు స్థిరీకరిస్తారు. ఆర్థిక పురోగమనం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా లక్ష్యాలను సడలిస్తూ (పెంచడం లేదా తగ్గించడం చేస్తూ) రోలింగ్ చేస్తుంటారు. అంటే ఇందులో చలన ప్రణాళికా లక్షణాలున్నాయి. మూడో ప్రణాళికను దీర్ఘకాలిక ప్రణాళిక (పర్స్పెక్టివ్ ప్లాన్)గా వ్యవహరిస్తారు. దీని కాల పరిధి పదేళ్లు, పదిహేనేళ్లు లేదా 20 ఏళ్లు కూడా ఉండవచ్చు. ఈ తరహా ప్రణాళికలో సమీక్ష, సవరణల వెసులుబాటు ఉంటుంది. పంచవర్ష ప్రణాళికలోని కఠినతరమైన, సవరించడానికి వీల్లేని నిబంధనల దృఢత్వం ఉండదు. ఈ తరహా పద్ధతిలో ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా ప్రణాళికా తీరుతెన్నులను మార్చుకోగలగడం ప్రధాన ప్రయోజనమని చెప్పవచ్చు. రోలింగ్ ప్రణాళికా విధానం జనతాపార్టీ ప్రభుత్వంతోనే కనుమరుగైంది. అందుకే ఈ ప్రణాళికా లక్ష్యాలు కూడా అర్థాంతరంగానే ముగిసిపోయాయి.

ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85)
‘నిర్మాణాత్మక మార్పులు మౌలిక ఆర్థిక ప్రణాళికా విధానంలో సమూల పరివర్తన తీసుకురావాలి. అప్పుడే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అధిక వృద్ధిరేటుతో కూడిన జాతీయాదాయ పురోగతి సాధ్యపడుతుంది’ అని ఆరో పంచవర్ష ప్రణాళిక ఆరంభంలో పేర్కొన్నారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థ కోసం స్వావలంబన మార్గం తప్పనిసరని ఈ ప్రణాళిక ఉద్ఘాటించింది.
  • నిరుద్యోగాన్ని సంపూర్ణంగా, శాశ్వతంగా నిర్మూలించడం ఈ ప్రణాళిక మొదటి లక్ష్యంగా కనిపిస్తుంది.
  • జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, పేదరిక నిర్మూలన రెండో లక్ష్యం.
  • ఆదాయ, సంపత్తి వ్యత్యాసాలు తగ్గించడం ఈ ప్రణాళిక మూడో లక్ష్యం.
  • సురక్షిత మంచినీరు, ఆరోగ్య రక్షణ, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడం, పట్టణ ప్రాంత పేదలకు కనీస జీవన వసతి సౌకర్యాలు కల్పించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.
ఈ ప్రణాళిక కోసం భారీగా రూ. 1,58,710 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ రంగ నిధుల వాటా రూ.1,10,967 కోట్లు. కేటాయింపులు, ప్రజా సంక్షేమ పథకాల వల్ల ఈ ప్రణాళిక ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ‘గరీభీ హటావో’ నినాదంతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. వాటిలో.. సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం (ఐఆర్‌డీపీ), జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎన్‌ఆర్‌ఈపీ), గ్రామీణ భూమి హీన ఉపాధి హామీ పథకం (ఆర్‌ఎల్‌ఈజీపీ) మొదలైన పథకాలు ముఖ్యమైనవి. ఆరో పంచవర్ష ప్రణాళిక ముగిసే కాలానికి దేశ జనాభాలో 37 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.

ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90)
1985 నాటికి జాతీయాభివృద్ధి మండలి లేదా నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దేశ ప్రణాళికలను రూపొందించే క్రమంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశమవుతారు. సాధించాల్సిన లక్ష్యాలు, పరిధులు, పరిమితులను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. భిన్నాభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత మేరకు ఫెడరల్ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.
ఏడో పంచవర్ష ప్రణాళిక జాతీయాభివృద్ధి మండలి ఆమోదం పొందింది. దీన్ని పదిహేనేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికగా రూపొందించారు.
  • ప్రణాళికా వికేంద్రీకరణ, పూర్తిస్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడటం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.
  • పేదరిక నిర్మూలన, ఆదాయ అసమానతలను తగ్గించడం, వర్గ వ్యత్యాసాలను తగ్గించడం ఈ ప్రణాళిక రెండో ముఖ్య లక్ష్యం.
  • అధిక స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడంలో భాగంగా ఉత్పాదకత, ఉద్యోగిత పెంపొందించుకోవడాన్ని తర్వాతి లక్ష్యంగా నిర్దేశించారు.
  • ఆహారోత్పత్తి, వినిమయ స్థాయిలను పెంచడానికి ప్రయత్నించారు.
  • విద్య, వైద్యం ఇతర మౌలిక వసతుల కల్పనలో ముందడుగు వేసేలా కేటాయింపులు చేశారు.
  • ఎగుమతులను అధిక స్థాయిలో ప్రోత్సహించారు. అదే సమయంలో దిగుమతి ప్రత్యామ్నాయ వ్యూహాల ద్వారా ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడ్డారు.
  • ఉత్పత్తి, ఉత్పాదక సామర్థ్యాలను తయారీ రంగంలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దిశగా కార్యాచరణ రూపొందించారు. అందుకోసం పారిశ్రామిక రంగంలో దక్షత, ఆధునికీకరణ, పోటీతత్వ లక్షణాలను పెంపొందించారు.
  • ఆధునిక విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను అభివృద్ధి ప్రణాళికా ప్రధాన స్రవంతిలో, సమాకలన ప్రక్రియలో అంతర్భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఈ ప్రణాళికలో రూ. 1,80,000 కోట్లను పబ్లిక్ రంగానికి కేటాయించారు. ప్రణాళిక ముగిసే నాటికి ఆ వ్యయం దాదాపు రూ. 2,18,739 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వ రంగ నిధులు అధికంగా ఖర్చు కావడానికి దేశవ్యాప్తంగా ఇంధన వనరుల ఉత్పత్తిని భారీ స్థాయిలో ద్విగుణీకృతం చేయడమే ముఖ్య కారణం.
వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం కల్పించారు. భూ సంస్కరణల అమల్లో తలెత్తే ఇబ్బందులు, అసమతౌల్యతలను అధిగమించడానికి ప్రయత్నించారు. రైతులకు అవసరమైన మౌలిక ఉత్పాదకాలు సకాలంలో అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల, భూ వినియోగం, కాలువల పునరుద్ధరణ, బహుళ పంటల వ్యవసాయంతోపాటు అధిక దిగుబడినిచ్చే వంగడాల వినియోగం లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించారు. పారిశ్రామిక రంగంలో జీవిత కాలం ముగిసిన యంత్ర సామగ్రి స్థానంలో ఆధునిక యంత్ర సామగ్రిని ప్రవేశపెట్టారు.
ఏడో పంచవర్ష ప్రణాళికలో అయిదు శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆరు శాతం వృద్ధి నమోదైంది. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి, వ్యవసాయ రంగ లక్ష్యాలు సంతృప్తినివ్వలేదు. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం కూడా నిరుత్సాహకరంగానే ఉంది. నిరుద్యోగం, పేదరిక నిర్మూలన కోసం జవహర్ రోజ్‌గార్ యోజనను ఈ ప్రణాళికా కాలంలోనే ప్రవేశపెట్టారు. విదేశీ వాణిజ్య చెల్లింపుల పట్టికలో కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోవడాన్ని ఈ ప్రణాళిక కాలంలో గమనించవచ్చు.

వార్షిక ప్రణాళికలు (1990-92)
రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఎనిమిదో పంచవర్ష ప్రణాళికను ఆరంభించడం రెండేళ్లు ఆలస్యమైంది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ దేశ అభివృద్ధి ప్రణాళికా వ్యూహాన్ని పూర్తిగా మార్చివేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఒరవడిని ఆచరణలోకి తెచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తలుపులు బార్లా తెరిచారు. విదేశీ పెట్టుబడుల విషయంలో కనీస ప్రాధామ్యాలను నిర్దేశించుకోలేదు. సత్వర సంస్కరణల వేగవంతంతో వివిధ నిర్మాణాత్మక మార్పులకు తెరతీశారు. వెరసి 1990-91, 1991-92లను వార్షిక ప్రణాళికలుగా పరిగణించారు. 1992లో ఎనిమిదో పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు.

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)
1991లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ పరిష్కారాన్ని అందించాయి. దాన్నే వాషింగ్టన్ అంగీకారం అని వ్యవహరిస్తారు. నాటి సంక్షోభం, పరిష్కారాలను చర్చిద్దాం..
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల కోవకు చెందినవే. ఇవి తమ ఆర్థిక అవసరాలు, వెసులుబాటు కోసం 1980-90 దశకంలో పెద్ద ఎత్తున మూలధన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న భారీ ఉత్పత్తి యంత్రాలు లేదా యంత్ర సామగ్రిని మూలధన వస్తువులుగా పరిగణిస్తాం. వీటిని దిగుమతి చేసుకోవడం కోసం ఆయా దేశాలు తమ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాయి. విదేశీ మారక నిల్వల లోటు పూడ్చుకోవాలంటే పెద్ద ఎత్తున ఎగుమతులను పెంచుకోవాలి. కానీ అంతర్జాతీయ విపణిలో ఎగుమతులు ఆకర్షణీయంగా ఉండాలంటే వస్తువుల ధరలు తగ్గించుకోవాలి. అంతర్జాతీయ వినియోగదారులు చౌక ధరలకే ఉత్పత్తులను కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించాలి. ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ఎగుమతి చేసే వస్తువుల నాణ్యతా ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి.
ప్రభుత్వ రంగ పరిశ్రమల లక్షణాలు పోటీలో నిలబడలేకపోవచ్చు లేదా ప్రభుత్వ రంగ పరిశ్రమల ఉనికి విదేశీ పెట్టుబడులకు కంటగింపుగా మారవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించాలి. అంటే ప్రభుత్వ భాగస్వామ్యాన్ని తగ్గించే దిశలో అమ్మకాలు సాగించాలి. తద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలి. ఈ రంగాలను సంస్కరణ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆలవాలంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ పరిష్కారాన్ని అంటే.. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణను కలిపి నిర్మాణాత్మక సర్దుబాటు పథకం (స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ ప్రోగ్రాం)గా నామకరణం చేశారు.
వాషింగ్టన్ అంగీకారంలో భాగంగా ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక మన దేశంలో రూపొందిందని పరిశీలకులు భావిస్తారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. స్థూల ఆర్థిక స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా, వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి తీసుకున్న చర్యగా దీన్ని పరిగణిస్తారు. కానీ వృద్ధిరేటును పెంచినంత మాత్రాన పేదరిక సమస్య దానంతట అదే తగ్గుముఖం పట్టదు. కాబట్టి ప్రత్యక్ష జోక్య విధానాలు కూడా ఆవశ్యకమేనని ఎనిమిదో ప్రణాళికలో తెలిపారు.
కేంద్రీకృత ప్రణాళికా విధానం నుంచి సంక్షేమ కార్యకలాపాలకు దూరంగా మార్కెట్ ప్రేరేపిత, మార్కెట్ సూచిత అభివృద్ధి బాటలో పయనాన్ని నిర్దేశించడం చూడవచ్చు. మార్కెట్ ప్రేరేపిత, మార్కెట్ సూచిత అభివృద్ధి పథంలో పయనిస్తూ 20వ శతాబ్దం చివరి నాటికి పూర్తి ఉద్యోగితను సాధించడం ప్రథమ లక్ష్యంగా పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా జనాభాను అరికట్టాలని నిర్ణయించారు. సార్వత్రిక విద్యావకాశాల ద్వారా ప్రాథమిక విద్యను పటిష్టం చేసి నిరక్షరాస్యతను నిర్మూలించడం ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక మరో ముఖ్య లక్ష్యం. వీటితోపాటు మౌలిక సదుపాయాల రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఉటంకించారు. దాదాపు రూ. 8 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వ రంగ కేటాయింపులు రూ. 4,34,100 కోట్లు.
ఏడో పంచవర్ష ప్రణాళిక కాలంలో 6 శాతంగా నమోదైన వృద్ధిరేటు, ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి 6.8 శాతానికి పెరిగింది. చివరి మూడు సంవత్సరాల్లో అంటే 1994-97 మధ్య కాలంలో సగటు వార్షిక వృద్ధి రేటు 7.5 శాతం కావడం విశేషం. ఏడో పంచవర్ష ప్రణాళికతో పోలిస్తే ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి వ్యవసాయోత్పత్తుల దిగుబడి 20 శాతం అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002)
1997లో తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ఆరంభం కావాలి. కానీ రాజకీయ అనిశ్చితి వల్ల జాతీయాభివృద్ధి మండలి 1999లో ఈ ప్రణాళికకు ఆమోద ముద్ర వేసింది. 6.5 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా, రెండేళ్లు ఆలస్యంగా ఈ ప్రణాళిక మొదలైంది. కానీ అయిదేళ్ల బదులు 2002 వరకే ఈ ప్రణాళిక కాలపరిమితిని నిర్ణయించారు. రూ. 8,59,000 కోట్ల అంచనాతో ఈ ప్రణాళిక ప్రారంభమైంది. దీన్ని గత ప్రణాళికల లక్ష్యాలతో అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని ఆరంభించారు.
ప్రణాళిక ముగిసే కాలానికి చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించలేదు. ఎనిమిదో ప్రణాళికలో 6.7 శాతంగా నమోదైన వృద్ధిరేటు 5.3 శాతానికి పడిపోయింది. అన్ని రంగాల్లోనూ వృద్ధిరేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. ఈ కాలంలోనే సంభవించిన ఆసియా ఆర్థిక సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది.
ఒడిశాలో సంభవించిన భీకర తుఫాను, గుజరాత్ భూకంపం, కార్గిల్ యుద్ధం తదితర సంఘటనలు మన ఆర్థిక వ్యవస్థను పాక్షికంగా దెబ్బతీశాయని చెప్పవచ్చు. 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన విదేశీ వాణిజ్య చెల్లింపులు ఆశాజనకంగా ఉండటం ఊరట కలిగించే విషయం. వాణిజ్య లోటు ఉన్నా, విదేశీ మారక నిల్వలు పెరగడం హర్షించదగ్గ పరిణామం. ఇదే గమనాన్ని 10వ పంచవర్ష ప్రణాళికలోనూ గమనించవచ్చు.

పదో పంచవర్ష ప్రణాళిక (2002-2007)
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో వృద్ధి రేటును 8 శాతంగా నిర్ణయించారు. వ్యాపార, వాణిజ్య పెట్టుబడులకు అడ్డంకులు తొలగించి, స్వేచ్ఛా విపణిని విస్తృతం చేసి, సుపరిపాలనను అందించాలనే లక్ష్యాలతో పదో పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. విదేశీ వ్యాపారమే కాకుండా, దేశీయ అంతర్గత వాణిజ్యాన్ని కూడా పెంపొందించాలని నిర్ణయించారు. పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం సృష్టించే దిశలో ఉన్న అడ్డంకులు, నియంత్రణలు తొలగించారు. పెట్టుబడుల కోసం మార్గాన్ని సుగమం చేసే చర్యలు చేపట్టారు.
వనరుల బదలాయింపు వ్యవస్థలోని లోటుపాట్లని సవరించేందుకు చట్టం తెచ్చారు. కేంద్ర నిధులను రాష్ర్ట, ప్రాంత, గ్రామీణ స్థాయిల్లో సమర్థంగా వినియోగించడం కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేశారు.
ప్రకృతి విపత్తుల వల్ల నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వం చేసే ఖర్చును ప్రణాళికేతర వ్యయంగా పరిగణించేవారు. కానీ పదో పంచవర్ష ప్రణాళికలో ఇలాంటి వ్యయాన్ని ప్రణాళికా వ్యయంగా పరిగణించారు. ఇది మంచి పరిణామం. దీనివల్ల ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి, పునర్‌వ్యవస్థీకరణ చర్యల కోసం చేసే ఖర్చును కూడా ప్రణాళికలో చేర్చడం మొదలైంది. నేచురల్ డిజాస్టర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా నేచురల్ డిజాస్టర్ విభాగాన్ని నెలకొల్పారు.
పదో పంచవర్ష ప్రణాళికా వ్యయం రూ.15,92,300 కోట్లు. పబ్లిక్ రంగ పరిశ్రమ పెట్టుబడులను మార్కెట్లో విక్రయించడానికి వీలుగా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ శాఖకు అరుణ్ శౌరీ మంత్రిగా వ్యవహరించారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 78,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పదకొండో పంచవర్ష ప్రణాళిక (2007-12)
పదకొండో పంచవర్ష ప్రణాళిక వ్యయం రూ. 36,44,718 కోట్లు. ఇది పదో పంచవర్ష ప్రణాళిక వ్యయం కంటే 118 శాతం అధికం. దళిత, ఆదివాసీ, మైనార్టీ వర్గాలను ప్రత్యేక చర్యల ద్వారా అభివృద్ధిలో సమ భాగస్వాములను చేసేందుకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు. సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ వృద్ధిరేటును 4 శాతానికి పెంచాలని నిర్ణయించారు.

పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17)
పన్నెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన, అమలు ప్రక్రియ రెండు వేర్వేరు పరిస్థితుల్లో జరిగాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేశారు. దీని ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా. కానీ యూపీఏ ప్రభుత్వం రూపొందించిన పన్నెండో ప్రణాళికను రద్దు చేయకుండా ఎన్డీయే ప్రభుత్వం సవరణలు, మార్పులు చేసింది. 2015 జనవరి 1న ఏర్పాటైన నీతి ఆయోగ్ పన్నెండో పంచవర్ష ప్రణాళిక పురోగతిని పర్యవేక్షిస్తోంది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు
  • మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో రచించిన ‘ప్లాన్డ్‌ ఎకానమీ ఫర్ ఇండియా’ గ్రంథంలో భారతదేశానికి ప్రణాళికలు అవసర మని పేర్కొన్నారు.
  • 1938లో భారత్‌లో ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • 1943లో బాంబేకు చెందిన కొంత మంది పారిశ్రామికవేత్తలు ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని ‘బాంబే ప్రణాళిక’గా వ్యవహరిస్తారు.
  • గాంధీ సిద్ధాంతాల ఆధారంగా శ్రీమన్నారాయణ అగర్వాల్ 1944లో ‘గాంధీ ప్రణాళిక’ను రూపొందించారు.
  • ఎంఎన్ రాయ్ 1945లో ‘ప్రజా ప్రణాళిక’ను రూపొందించారు.
  • 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం ఆవిర్భవించింది. ఇది ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు కృషి చేస్తుంది. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మొదటి అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ. ఉపాధ్యక్షుడు గుల్జారీ లాల్ నందా.
  • నిరంతర ప్రణాళికల భావనను గున్నార్ మిర్దాల్ ప్రవేశపెట్టారు.
  • నాలుగో పంచవర్ష ప్రణాళిక వరకు ఆర్థికవృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వగా అయిదు, ఆరో ప్రణాళికల్లో స్వయం సమృద్ధి, ఉద్యోగ కల్పన, పేదరిక నిర్మూలనకు ప్రాముఖ్యం ఇచ్చారు.
  • 1991 జూన్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థూల-ఆర్థిక స్థిరీకరణ సాధనకు పెద్దపీట వేయడంతో భారత ఆర్థిక వ్యవస్థ ‘మార్కెట్ ఆధారిత వ్యవస్థ’గా రూపుదిద్దుకుంది.
  • 2015 ఫిబ్రవరిలో ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేశారు. దీనికి ‘అరవింద్ పనగరియా’ను ఉపాధ్యక్షుడిగా నియమించారు.
Published date : 16 Dec 2015 03:39PM

Photo Stories