Skip to main content

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి 2019, నవంబర్ 27న ఈ ప్రయోగాన్ని  చేపట్టారు. కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్‌ఎల్‌వీ-సీ47 సంకేతాలను అంటార్కిటకలోని ఇస్రో కేంద్రం అందుకుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగానికి నవంబర్ 26న ఉదయం 7.28 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.

కార్టోశాట్-3 విశేషాలు
  • మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం అయిన కార్టోశాట్-3 బరువు 1,625 కిలోలు.
  • జీవిత కాలం ఐదేళ్లు.
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
  • కార్టోశాట్-3 దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేయనుంది.
  • సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ఈ ఉపగ్రహం సేవలందించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి దీన్ని వినియోగించుకోవచ్చు.
  • కార్టోశాట్-3లోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్ చిత్రాల్ని తీసే సామర్థ్యముంది.
  • ఈ ఉపగ్రహ తయారీకి ఇస్రో రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
  • చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.
  • పీఎస్‌ఎల్‌వీ సీరీస్ లో ఇది 49వ ప్రయోగం కాగా.. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం.
  • పీఎస్‌ఎల్వీ సీ-47 ను ఎక్స్‌ఎల్(XL) తరహాలో రూపొందించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : 2019, నవంబర్ 27
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సైనిక అవసరాల కోసం
Published date : 27 Nov 2019 04:54PM

Photo Stories