Skip to main content

2019 నోబెల్ బహుమతులు

స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ప్రతియేటా ఆరు రంగాల్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, శాంతిలో నోబెల్ బహుమతులను అందజేస్తారు. వీటిని ఏటా అక్టోబర్ లో ప్రకటించి, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ప్రధానం చేస్తారు. శాంతి బహుమతిని మాత్రమే నార్వే రాజధాని ఓస్లోలో అందజేస్తారు. 2019కి గాను నోబెల్ బహుమతులను ఇటీవలే ప్రకటించారు. వాటి వివరాలు...
భౌతిక శాస్త్రం
 2019కి గాను ముగ్గురు అంతరిక్ష పరిశోధకులకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. కెనెడియన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మిషెల్ మేయర్, డిడియెర్ క్యులోజ్‌లకు ఈ విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. బహుమతి (9.14 లక్షల అమెరికన్ డాలర్లు లేదా రూ.6.5 కోట్లు)లో సగం పీబుల్స్, మిగతా సగాన్ని మిషెల్ మేయర్, డిడియెర్ క్యులోజ్ సంయుక్తంగా గెలుచుకున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ ప్రకటించింది. బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా రూపాంతరీకరణ చెందింది అనే విషయమై జేమ్స్ పీబుల్స్ చేసిన పరిశోధనలకు గాను ఈ బహుమతి లభించింది. 1995లో తొలిసారి మన గ్రహ వ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని గుర్తించినందుకుగాను స్విస్ శాస్త్రవేత్తలు మిషెల్ మేయర్, డిడియెర్ క్యులోజ్‌లకు నోబెల్ దక్కింది. ఆ గ్రహానికి ‘51 పెగాసి బీ’ అని నామకరణం చేశారు. ఈ ముగ్గురి పరిశోధనలు విశ్వంపై మన అవగాహనను మరింత పెంచాయి.
 
 రసాయన శాస్త్రం
 లిథియం-అయాన్ బ్యాటరీ సృష్టికర్తలైన ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన జాన్ గుడెనఫ్, బ్రిటిష్ అమెరికన్ శాస్త్రవేత్త స్టాన్లీ విట్టింగ్‌హామ్, జపాన్‌కు చెందిన అకిరా యోపినోలకు సంయుక్తంగా ఈ అవార్డు లభించింది. 9.14 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీని వీరు ముగ్గురూ సమంగా పంచుకుంటారు. స్మార్ట్‌ఫోన్లు మొదలుకొని ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల వరకూ.. అన్నింటినీ నడిపే అత్యంత శక్తివంతమైనది లిథియం-అయాన్ బ్యాటరీ. ఇది తేలికైనది, పలుమార్లు రీచార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవి సౌర, పవన విద్యుత్ శక్తిని గణనీయ పరిమాణంలో నిల్వ చేయగలవు. ఈ బ్యాటరీలు శిలాజ ఇంధనాలైన పెట్రోలు, డీజిళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి.. పర్యావరణానికి ఎంతో మేలు చేశాయి. లిథియం బ్యాటరీలు మానవ జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. జాన్ గుడెనఫ్ వయసు 97 ఏళ్లు. ఆయన ఆర్థర్ ఆష్కిన్ (96) రికార్డును అధిగమించి.. నోబెల్ పురస్కారం గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కారు.
 
 వైద్య శాస్త్రం
 2019కిగాను వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. అమెరికాకు చెందిన విలియం కేలిన్, గ్రెగ్ సెమెంజా, బ్రిటన్‌కు చెందిన సర్ పీటర్ రాట్‌క్లిఫ్‌లకు సంయుక్తంగా లభించింది. శరీరంలోని కణాలు ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయి, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయి అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. క్యాన్సర్, రక్తహీనత తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని నోబెల్ కమిటీ పేర్కొంది. శరీరానికి ఆక్సిజన్ తగినంత స్థాయిలో అందకపోవడాన్ని ‘హైపోక్సియా’ అని పిలుస్తారు. ఆ ప్రతికూలతలను కణాలు ఎలా ఎదుర్కొంటాయి, ఆక్సిజన్ లభ్యత స్థాయిని శరీరంలో కణాలు ఎలా గుర్తిస్తాయి అనే అంశాలపై కేలిన్, సెమెంజా, రాట్‌క్లిఫ్‌లు పరిశోధనలు చేశారు.
 
 సాహిత్యం
 నోబెల్ కమిటీ సాహిత్యం విభాగానికి సంబంధించి రెండేళ్ల అవార్డులను అక్టోబర్ 10న ప్రకటించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018కి ఈ పురస్కారాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. 2019కి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు ప్రకటించారు. అత్యంత ప్రభావశీల రచనలు చేసినందుకుగాను ఆయనకు అవార్డిస్తున్నట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒకరిగా పీటర్ హండ్కే ఎదిగారని అకాడమీ ప్రశంసించింది. ‘ఏ సారో బియాండ్ డ్రీమ్స్’, ‘అఫెండింగ్ ద ఆడియన్స్’, ‘ద హార్నెట్స్’, ‘షార్ట్ లెటర్’, ‘లాంగ్ ఫేర్‌వెల్’ వంటివి ఆయన ప్రముఖ రచనలు. అయితే పీటర్ హండ్కే తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కారు. 2014లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని నిషేధించాలని పిలుపునిచ్చి వివాదాన్ని రేకెత్తించారు.
 
 2018 నోబెల్ సాహితీ పురస్కారం పోలండ్ రచయిత్రి ఓల్గా తొకర్జుక్‌కు లభించింది. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురితమైంది. ఆమె రచించిన ‘ఫ్లైట్స్’ అనే నవలకు జెన్నిఫర్ క్రాఫ్ట్ అనే అనువాదకురాలితో కలిసి 2018లో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఆమె రచించిన 900 పేజీల ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’ ఏడు దేశాలు, ఐదు భాషల చరిత్రకు సంబంధించింది. సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్న 15వ మహిళ ఓల్గా తొకర్జుక్.
 
 ఆర్థిక శాస్త్రం
 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ, ఫ్రెంచ్ అమెరికన్ ఎస్తర్ డఫ్లో, అమెరిక్ ఆర్థిక వేత్త మైకేల్ క్రెమర్‌లకు ఈ బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసినందుకు వీరికి నోబెల్ పురస్కారం వరించింది. వీరు ముగ్గురు డిసెంబర్ 10న సంయుక్తంగా ఈ బహుమతిని అందుకోనున్నారు. అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లోలు దంపతులు కావడం విశేషం. వీరిద్దరూ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. మైకేల్ క్రెమర్ హార్వర్డ్‌లో ప్రొఫెసర్. ఎలినార్ ఓస్ట్రమ్ తర్వాత(2009) ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన రెండో మహిళ ఎస్తర్ డఫ్లో. నోబెల్ పురస్కారాన్ని ఆరుగురు భార్యాభర్తల జతలు ఇప్పుటి వరకూ అందుకున్నారు. వీరు మేరీ క్యూరీ, పియరీ క్యూరీ(1903); ఫ్రెడరిక్ జోలియట్, ఇరీన్ జోలియట్(1935); కార్ల్ కోరీ, గెర్టీ కోరీ(1947); ఆల్వా మిర్దాల్, గున్నార్ మిర్దాల్ (1974); ఎడ్వర్డ్ మొసర్, మే బ్రీట్ మొసర్(2014), అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో( 2019).
 
 శాంతి బహుమతి
 ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019కి గాను ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీకి దక్కింది. ఆఫ్రికాలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. పొరుగు దేశం ఎరిట్రియాతో దశాబ్దాల తరబడి నెలకొనియున్న సరిహద్దు ఉద్రిక్తతలను నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ అలీ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతంలోని ఇథియోపియా నుంచి ఎరిట్రియా 1993లో విడిపోయింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. 1998 నుంచి 2000 వరకు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు రెండు దశాబ్దాల పాటు కొనసాగాయి. 2018లో అబీ అహ్మద్ అలీ ఇథియోపియా ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ఎరిట్రియాతో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించారు. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి నోబెల్ పురస్కారం రావడం ఇదే ప్రథమం. ఆయన నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత కావడం మరో విశేషం.
   -ఎన్.విజయేందర్‌రెడ్డి,సీనియర్ ఫ్యాకల్టీ
Published date : 21 Oct 2019 02:21PM

Photo Stories