Skip to main content

టీఎస్ ఇంటర్ ఫలితాల తర్వాతే..ఏపీ ఎంసెట్ ఫలితాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాల విడుదల మళ్లీ వాయిదా పడింది.
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల వివాదం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల నిలిచిపోయింది. ఎంసెట్ ఫలితాలను మే 18వ తేదీన విడుదల చేయనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి మే 15న ఒక ప్రకటన చేసింది. అయితే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల వివాదంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను, స్కాన్ కాపీలను మే 27వ తేదీన ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్ ఫలితాలను మే 18వ తేదీన విడుదల చేసేందుకు ఆటంకం ఏర్పడింది. అదే సందర్భంలో ఇంటర్మీడియెట్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు మే 27న విడుదల చేయనున్నామని, విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని అప్పటివరకు ఎంసెట్ ఫలితాల విడుదలను నిలుపుదల చేయాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఏపీ ఉన్నత విద్యామండలికి, ఎంసెట్ కమిటీకి లేఖ రాసింది. దీంతో ఫలితాల విడుదల మళ్లీ వాయిదా పడింది. మే 18న విడుదల చేయాల్సిన ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు పేర్కొన్నారు.
Published date : 17 May 2019 02:12PM

Photo Stories