Skip to main content

మే 2020 అవార్డ్స్

తెలంగాణ సీఎస్‌కు నెల్సన్ మండేలా అవార్డు
Current Affairs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యలు ‘నెల్సన్ మండేలా అవార్డు-2020’కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ముద్ర సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు మే 25న తెలిపారు. నేషనల్ కో.ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ‘నెల్సన్ మండేలా అవార్డును ఇస్తున్నాయి. 2020, నవంబర్ 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సోమేశ్‌కుమార్, జస్టిస్ చంద్రయ్యలకు ఈ ప్రదానం చేయనున్నారు.
2001 -03 సంవత్సరాల మధ్య అనంతపురం జిల్లా కలెక్టర్‌గా సోమేశ్‌కుమార్ పనిచేసినప్పుడు ఆ జిల్లాలో నెలకొన్న భయంకర కరువు పరిస్థితుల్లో ఆకలిబాధను తీర్చడానికి పనికి ఆహారం పథకం కింద వచ్చిన కేంద్ర ప్రభుత్వ కరువు బియ్యం పేదలకు చేర్చడానికి కృషి చేశారని రామదాసప్ప ప్రశంసించారు. అలాగే జస్టిస్ జి.చంద్రయ్య ప్రజల వద్దకే న్యాయమంటూ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచుతున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెల్సన్ మండేలా అవార్డు-2020కు ఎంపిక
ఎప్పుడు : మే 25
ఎవరు : తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, రాష్ట్ర హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

భారత సంతతి శాస్త్రవేత్తకు ఇన్వెంటర్ అవార్డు
ఎలక్ట్రానిక్ పరిశ్రమలను అభివృద్ధిపరిచడంలోనూ, కృత్రిమ మేధస్సు సమర్థతని మెరుగుపర్చడంలోనూ అత్యున్నత ప్రతిభ కనబర్చినందుకుగాను భారతీయ సంతతికి చెందిన రాజీవ్ జోషిని ప్రతిష్టాత్మక ‘ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు వరించింది. న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అమెరికాలో దాదాపు 250కి పైగా ఆవిష్కరణలు చేసిన డాక్టర్ జోషి న్యూయార్క్‌లోని ఐబీఎం థాంసన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి అయిన ఆయన మశాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : మే 26
ఎవరు : భారత సంతతి శాస్త్రవేత్త
ఎందుకు : ఎలక్ట్రానిక్ పరిశ్రమలను అభివృద్ధిపరిచడంలోనూ, కృత్రిమ మేధస్సు సమర్థతని మెరుగుపర్చడంలోనూ అత్యున్నత ప్రతిభ కనబర్చినందుకుగాను

రాస్‌ టేలర్‌కు రిచర్డ్‌ హ్యాడ్లీ పురస్కారం
Current Affairs
న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు లభించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్‌ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డును టేలర్‌ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్‌ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్‌.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్‌ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మ‌రోవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
2006లో కివీస్‌ తరఫున అరంగేట్రం చేసిన టేలర్‌.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు. ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020, ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్‌. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస​ తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్‌ వెటోరి(112), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(111), బ్రెండన్‌ మెకల్లమ్‌(101)లు టేలర్‌ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్‌ ఆటగాళ్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు విజేత‌
ఎప్పుడు : మే 1
ఎవరు : రాస్‌ టేలర్‌

రామాయణ్ సీరియల్ మరో రికార్డు
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులను ఆనందింపజేయడానికి 1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్, మహాభారత్, శ్రీ కష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్ సీరియల్ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్‌లో ఏప్రిల్ 30న అధికారికంగా వెల్లడించింది.
1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్ సీరియల్‌ను రామానంద సాగర్ దర్శకత్వం వహించారు. సీరియల్‌లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్ తదితరులు నటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: రామాయణ్
ఎక్కడ: ప్రపంచంలో

ముగ్గురు భారత జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
ముగ్గురు భారత ఫొటోజర్నలిస్టులను జర్నలిజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం వరించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్నీ ఆనంద్ ఫీచర్ ఫోటోల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకుగానూ వారికి ఈ పురస్కారం దక్కింది. ఈ ముగ్గురు జర్నలిస్టులు ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’లో పనిచేస్తున్నారు. పరిశోధనాత్మక కథనాలు, అంతర్జాతీయ వార్తల విభాగంలో అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులకు పురస్కారం వరించగా.. ఎడిటోరియల్ రైటింగ్‌లో హెరాల్డ్ ప్రెస్‌కు అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ముగ్గురు భారత ఫొటోజర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
ఎప్పుడు: మే 5
ఎవరు: దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్నీ ఆనంద్
ఎక్కడ: ఫీచర్ ఫోటోల విభాగం
ఎందుకు: ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకు

Published date : 23 May 2020 12:59PM

Photo Stories