Skip to main content

Holidays Suspended: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సెలవులు నిలిపివేత

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో యుద్ధం జరిగే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
Osmania and Gandhi Hospital Holidays Suspended in Telangana

ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ట్రామా సేవలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా అందించేందుకు వైద్యులు, ఇతర సహాయక సిబ్బందికి సెలవులను నిలిపివేసి, అందరూ హాజరుగా ఉండాలంటూ అధికారాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

మందుల, రక్త నిల్వల ఏర్పాట్లు
వైద్య శాఖ అధికారుల ప్రకారం, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా అన్ని రకాల మందుల నిల్వలు ఉన్నాయి. తదుపరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాటిని మరింత పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేగాక, అత్యవసర పరిస్థితుల్లో రక్తం మరియు ప్లాస్మా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రక్తదానం శిబిరాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

రెడ్‌క్రాస్ గుర్తుతో ఆసుపత్రుల రక్షణ
జెనీవా ఒప్పందానికి అనుగుణంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల భవనాలపై రెడ్‌క్రాస్ గుర్తులు వేశారు. యుద్ధ సమయంలో వైద్య సంస్థలపై దాడులు జరగకూడదనే ఉద్దేశంతో ఈ గుర్తులను వేశారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సీటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్థీషియా వంటి విభాగాల్లో నిపుణులు అందుబాటులో ఉంటారు. వీరు నిరంతరం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Red Cross Symbol: భారత్-పాక్ యుద్ధం.. ఆస్పత్రులపై ‘రెడ్‌ క్రాస్‌’ సింబల్

ట్రామా సేవల విభజన, వసతులు
గాయపడిన రోగులకు తక్షణ చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో మూడు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ట్రామా కేంద్రాల్లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో వేర్వేరు లైన్లు ఏర్పాటు చేశారు. ఎరుపు లైన్‌లో తీవ్రంగా గాయపడినవారిని, ఆకుపచ్చ లైన్‌లో స్థిరమైన గాయాలున్నవారిని, పసుపు లైన్‌లో మితమైన గాయాలున్నవారిని చేర్చి చికిత్స అందిస్తారు.

శస్త్రచికిత్సల కోసం గాంధీ ఆసుపత్రిలో 28, ఉస్మానియాలో 25 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ట్రామా విభాగాల్లో 40–50 పడకల చొప్పున వసతి కల్పించారు. అంతేకాక, అత్యవసర విభాగంలో 250 పడకలు, న్యూరో సర్జరీలో 50, ఆర్థో విభాగంలో 20, ఎంఎంసీలో 65 పడకలు అందుబాటులో ఉంచారు. మొత్తం వైద్యులు, పేషెంట్ కేర్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది కలిపి 3,000 నుండి 4,000 మందిని ఈ కార్యకలాపాల్లో నియోజించనున్నారు.

Doctors Holidays: ఏపీలో వైద్యులకు సెలవులు రద్దు

ఇతర ఆసుపత్రుల సహకారం
అత్యవసర సమయంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పాటు, నిమ్స్ (NIMS) ఆసుపత్రి సహాయాన్ని కూడా వినియోగించనున్నారు. అలాగే, హైదరాబాద్‌ పరిసరాల ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ట్రామా కేర్ కేంద్రాలను కూడా యాక్టివ్ చేస్తారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 10 May 2025 01:11PM

Photo Stories