Electronics Projects: తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్రారంభించిన సీఎం జగన్
జూన్ 23న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వికృతమాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) వేదికగా మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మరో మూడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పేడు, ఇనగలూరులో పారిశ్రామికవేత్తలు, శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ప్రయాణం అత్యద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... టీసీఎల్ సంస్థ ద్వారా రూ.1,230 కోట్ల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్ డిస్ప్లే యూనిట్లు తయారు చేసే మంచి వ్యవస్థకు తిరుపతి కేంద్రం కావటం శుభ పరిణామని అన్నారు. దీని ద్వారా దాదాపు 3,200 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. రూ.1050 కోట్ల పెట్టుబడితో ఫాక్స్ లింక్ సంస్థ యుఎస్బీ కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులు తయారు చేసే పరిశ్రమ పూర్తయ్యిందని.. దీని ద్వారా మరో 2 వేల మందికి ఉపాధి కలుగుతోందని వివరించారు. సన్నీ ఓపోటెక్ ద్వారా సెల్ఫోన్లలో కెమెరా లెన్స్ తయారు చేసే మరో సంస్థ రూ.280 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైందని... దీనిద్వారా 1200 మందికి ఉద్యోగాలు లభించాయని తెలియజేశారు. డిక్సన్ టెలివిజన్కు సంబంధించిన మరో సముదాయానికి శంకుస్థాపన చేశామని... దాదాపు రూ.110 కోట్ల పెట్టుబడితో సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించిందని తెలిపారు. ఈ సంస్థ 850 మందికి ఉద్యోగాలు ఇస్తుందని వివరించారు. ఫాక్స్ లింక్ ఇండియా లిమిటెడ్ సంస్థ ద్వారా రూ.300 కోట్ల పెట్టుబడితో మరో ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభ దశలోకి రానుందన్నారు. తద్వారా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
Also read: Vakula Matha Temple: వకుళమాత మహాసంప్రోక్షణ క్రతువులోఏపీ సీఎం వైఎస్ జగన్