Skip to main content

Murali Naik: భారత్‌–పాక్‌ యుద్ధంలో జవాన్‌ మురళీ నాయక్‌ వీర మరణం

భారత్‌–పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌(22) వీరమరణం పొందాడు.
Indian Army Jawan Murali Naik From Andhra Pradesh Killed in Pakistan Firing at LoC

దేశ రక్షణలో మే 9వ తేదీ దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. 

ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్‌ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్‌ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్‌ కొడుతోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  

India Attacks Pakistan: పాకిస్తాన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన ప్రాంతాలు ఇవే..

ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం 
జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌ దంపతులకు మురళీ నాయక్‌ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్‌ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అనంతపురంలోని సాయి జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశాడు. 

అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్‌లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్‌ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు.  

రూ.5 లక్షల ఆర్థిక సహాయం
మురళీ నాయక్‌ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్‌ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

S-400 Missile System: భారత వాయుసేనలో.. పవర్‌ఫుల్ ఆయుధం ఇదే..

Published date : 10 May 2025 10:51AM

Photo Stories