Skip to main content

ఏప్రిల్ 2020 వ్యక్తులు

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్ కొఠారి
Current Affairs రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 25న కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ హాజరయ్యారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్‌బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు.
ప్రధాని నేతత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్‌బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఏప్రిల్ 20వ తేదీన కేంద్రం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియామకం
ఎప్పుడు: ఏప్రిల్ 25
ఎవరు: సంజయ్ కొఠారి

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రీతీ సుదాన్ 2020, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆమె పదవీ కాలం పొడిగింపునకు ప్రధాని నేతత్వంలోని కేబినెట్ కమిటీ ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది. మరో 23 మంది సీనియర్ ఐఏఎస్‌లను పలు విభాగాలకు కార్యదర్శులుగా నియమించింది. పలువురి శాఖలను మార్చింది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి గిరిధర్ అరమానె కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్న సంజీవ్ రంజన్ నౌకాయాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు: ఏప్రిల్ 26
ఎవరు: కేంద్ర ప్రభుత్వం

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్‌కు చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ 2020, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
ఎప్పుడు: ఏప్రిల్ 29
ఎవరు: చంద్ర దత్తా

బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా దిపాంకర్ దత్తా
బాంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిపాంకర్ దత్తా ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన జస్టిస్ భూషణ్ ధర్మాధికారి ఏప్రిల్ 27న రిటైరయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన దిపాంకర్ దత్తా 1965 ఫిబ్రవరి 9న జన్మించారు. 1989 నవంబర్ 14న న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించారు. కలకత్తా హైకోర్టు శాశ్వత జడ్జిగా 2006 జూన్ 22న నియమితులయ్యారు. కలకత్తాలో జడ్జి కావడానికి ముందు గువాహతి హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో 16 సంవత్సరాలు పని చేశారు. రాజ్యాంగం, కార్మికులు, సర్వీసు విభాగాల్లో నిపుణులైన జస్టిస్ దిపాంకర్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గానూ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లలో లాయర్ ఇన్‌చార్జిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బాంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: ఏప్రిల్ 28
ఎవరు: జస్టిస్ దిపాంకర్ దత్తా

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఇకలేరు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని టోంక్ గ్రామంలో 1967, జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ’పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా ’అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బాలీవుడ్ విలక్షణ నటుడు కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 29
ఎవరు: ఇర్ఫాన్ ఖాన్ (54)
ఎక్కడ: ముంబై, మహారాష్ట్ర
ఎందుకు: క్యాన్సర్ వ్యాధితో

ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత
ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన రిషీకపూర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ నటుడు కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: రిషీకపూర్ (67)
ఎక్కడ: ముంబై, మహారాష్ట్ర
ఎందుకు: క్యాన్సర్ వ్యాధితో

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. 1985 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమూర్తి ప్రస్తుతం విదేశీ మంత్రిత్వశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఆసే్ర్టలియాలో భారత రాయబారిగా జైదీప్ మజుందార్‌ను, జాయింట్ సెక్రటరీ దీపక్ మిట్టల్‌ను ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు.
క్షేత్రస్థాయి స్థితిని బట్టి పార్లమెంట్
తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏప్రిల్ 29న పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2020 ఏడాది ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియామకం
ఎప్పుడు: ఏప్రిల్ 29
ఎవరు: టీఎస్ తిరుమూర్తి

రోగులకు స్వీడన్ రాకుమారి సోఫియా సేవలు
Current Affairs
స్వీడన్ రాకుమారి సోఫియా ఏప్రిల్ 17 నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రోగులకు స్వీడన్ రాకుమారి సేవలు
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : సోఫియా
ఎందుకు: డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు

టామ్ అండ్ జెర్రీ దర్శకుడు జీన్ డీచ్ కన్నుమూత
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16న హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు.
జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పెలైట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టామ్ అండ్ జెర్రీ దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : జీన్ డీచ్(95)
ఎక్కడ:ప్రేగ్, చెక్ రిపబ్లిక్

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది.
బొప్పూడి కృష్ణమోహన్
1965, ఫిబ్రవరి 5న గుంటూరులో జన్మించిన కృష్ణమోహన్ 1988లో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. గుంటూరు జిల్లా కోర్టులో కొద్ది నెలల పాటు ప్రాక్టీస్ చేశారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఈయన.
కంచిరెడ్డి సురేష్‌రెడ్డి
అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్ 7న సురేష్‌రెడ్డి జన్మించారు. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేసిన ఆయన కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా మరణశిక్ష కేసులను వాదించడంలో దిట్ట. సివిల్, రాజ్యాంగపరమైన కేసులను కూడా వాదించారు.
కన్నెగంటి లలితకుమారి
లలిత కుమారి స్వగ్రామం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెం. 1971, మే 5న జన్మించిన ఆమె పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెస్సైస్ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు : బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ఏప్రిల్ 20న సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.
విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
ఎప్పుడు:ప్రిల్ 20
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గందరగోళం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

ఆసియాలో అపర కుబేరుడుగా ముకేశ్ అంబానీ
చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఫేస్‌బుక్, రిలయన్స్ జియో ఒప్పందంతో అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఏప్రిల్ 23న తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ ఏప్రిల్ 22 నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది.
మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
Current Affairs
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో ఏప్రిల్ 9న కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న సీటును నుంచి సీఎం ఉద్ధవ్‌ను నియమించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని కోరినట్టు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ పరబ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఎవరైనా మంత్రి ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాలేపోతే ఆ పదవికి అనర్హుడవుతారు. 2019, నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. 2020, మే 28 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ఎప్పుడు: ఏప్రిల్ 9
ఎవరు: మహారాష్ట్ర కేబినెట్
ఎందుకు: ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా పంచాయతీరాజ్ చట్టం-1994 సెక్షన్-200కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్రవేశారు. తాజా చట్టం ద్వారా ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించారు.
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా నియామకం
ఎప్పుడు: ఏప్రిల్ 11
ఎవరు: హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్

ఐఎంఎఫ్ బృందంలో రఘురామ్ రాజన్‌కు చోటు
ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఏప్రిల్ 10న ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు ఈ కమిటీలో వున్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐఎంఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బందంలో చోటు
ఎప్పుడు: ఏప్రిల్ 10
ఎవరు: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఎందుకు: గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందించేందుకు

ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి కన్నుమూత
దూరదర్శన్ న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి ప్రసాద్(70) ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1947 ఆగస్టు 9న జన్మించిన ఆమె మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో చదువుకున్నారు. 1980 నుంచే ఆకాశవాణిలో పనిచేసిన పార్వతి ప్రసాద్ దూరదర్శన్ వార్తలు చదివిన తొలి న్యూస్‌రీడర్లలో ఒకరు. 35 ఏళ్లపాటు న్యూస్‌రీడర్‌గా సేవలందించారు. ఆమె యోజన, ఇతర పత్రికలకు అనువాదాలతో పాటు ఎన్నో నాటికలు, వ్యాసాలు రచించారు. యునిసెఫ్, సేవ్‌ద చిల్డన్ర్ యూకే, పంచాయతీ రాజ్ శాఖ మొదలైన సంస్థలకు ప్రచార సామగ్రి తయారీలో తోడ్పాటును అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దూరదర్శన్ న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 12
ఎవరు: పింగళి పార్వతి ప్రసాద్(70)
ఎక్కడ: హైదరాబాద్
ఎందుకు: అనారోగ్యంతో

కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎమ్‌వీ రాజశేఖరన్(92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న తుదిశ్వాస విడిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప అల్లుడైన రాజశేఖరన్ 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి గ్రామీణాభివద్ధికి ప్రాధాన్యమిచ్చారు.

బ్రిటన్ కమెడియన్ కన్నుమూత
కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) ఏప్రిల్ 12న కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు
ఎప్పుడు: ఏప్రిల్ 13
ఎవరు: ఎమ్‌వీ రాజశేఖరన్(92)
ఎక్కడ: బెంగళూరు, కర్ణాటక
ఎందుకు: అనారోగ్యంతో

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ మృతి
పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల జాఫర్ పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న కన్నుమూశారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. రిటైర్మంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. జాఫర్ సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా 1997-98 మధ్యలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి
ఎప్పుడు: ఏప్రిల్ 13
ఎవరు: జాఫర్ సర్ఫరాజ్(50)
ఎక్కడ: పెషావర్, పాకిస్తాన్

కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత ష్లెసింగర్ మృతి
Current Affairs
ప్రముఖ పాటల రచయిత, గాయకుడు, గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా సమస్యతో ఏప్రిల్ 1న కన్నుమూశారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 1961, అక్టోబర్ 31న జన్మించిన... ఆడమ్ 1995లో ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ అనే రాక్ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్ చిత్రం ’దట్ ధింగ్ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికై ంది. ఆడమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్ క్రిస్మస్’కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మతి
ఎప్పుడు: ఏప్రిల్ 1
ఎవరు: ఆడమ్ ష్లెసింగర్(52)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు: కరోనా సమస్యతో

డీఎల్‌ఎస్ సూత్రధారి లూయిస్ ఇక లేరు
అంతర్జాతీయ క్రికెట్‌కు ‘డక్‌వర్త్ లూయిస్ పద్ధతి’ (డీఎల్‌ఎస్)ని పరిచయం చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లూయిస్ ఏప్రిల్ 1న తుదిశ్వాస విడిచారని ఇగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని స్వాన్‌సీలో 1938, జూలై 6న జన్మించిన లూయిస్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే జర్నలిస్టుగానూ సేవలందించారు. 1990వ దశకంలో బీబీసీ టెలివిజన్ కామెంటేటర్‌గా ఆయన పనిచేశారు. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్) పురస్కారంతో ఆయనను సత్కరించింది.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతి...
క్రికెట్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆగిపోతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. 1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి టోనీ లూయిస్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది.
దనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014 నుంచి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్‌ఎస్)గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డీఎల్‌ఎస్ సూత్రధారి కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 1
ఎవరు: టోనీ లూయిస్(78)
ఎక్కడ : ఇగ్లండ్
ఎందుకు: అనారోగ్యం కారణంగా

మాజీ వికెట్ కీపర్ జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత
న్యూజిలాండ్ క్రికెట్‌లో బిగ్ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాక్ ఎడ్వర్డ్స్(64) కన్నుమూశారు. ఎడ్వర్డ్స్ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్టిక్స్ ్రక్రికెట్ అసోసియేషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్ 1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్రవేశారు. ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలతోపాటు 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఆడాడు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్‌‌సల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 6
ఎవరు: బ్యాట్స్‌మన్ జాక్ ఎడ్వర్డ్స్(64)

నాస్కామ్ చైర్మన్‌గా యూబీ ప్రవీణ్‌రావు
ఐటీ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్’ చైర్మన్‌గా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), నాస్కామ్ ప్రస్తుత వైస్ చైర్మన్ యూబీ ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూపు సీఈవో కేశవ్ మురుగేశ్ స్థానంలో ప్రవీణ్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు అస్సెంచుర్ ఇండియా చైర్‌పర్సన్, సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్ అయిన రేఖ ఎం మీనన్ నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పనిచేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏప్రిల్ 6న ఈ మేరకు నియామక నిర్ణయాలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21 ఆర్థిక సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎంపిక
ఎప్పుడు: ఏప్రిల్ 6
ఎవరు: యూబీ ప్రవీణ్‌రావు
Published date : 06 May 2020 10:49PM

Photo Stories