Pallonji Mistry పారిశ్రామిక దిగ్గజం ‘పల్లోంజీ’ అస్తమయం
పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ చైర్మన్, పద్మ భూషన్ పల్లోంజీ మిస్త్రీ జూన్ 28న ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 93 సంవత్సరాలు. పారిశ్రామిక దిగ్గజ సంస్థ.. టాటా గ్రూప్లో ఎస్పీ గ్రూప్ 18.37 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. భారతదేశంలో జన్మించిన మిస్త్రీకి ఐరిష్ పౌరసత్వం కూడా ఉంది. దక్షిణ ముంబైలోని నివాసంలో రాత్రి ఒంటిగంటకు ఆయన నిద్రలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దక్షిణ ముంబైలోని కెంప్స్ కార్నర్లోని టవర్ ఆఫ్ సైలెన్స్ వద్ద పార్సీ సంప్రదాయాల ప్రకారం ‘ఉత్తమ్నా’ ఆచారంతో పల్లోంజీ మిస్త్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
Also read: HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
1929లో జన్మించిన మిస్త్రీ నిర్మాణరంగంతో సహా టెక్స్టైల్స్, షిప్పింగ్, గృహోపకరణాల వంటి పలు ఇతర వ్యాపారాలలో విస్తరించిన ఎస్పీ గ్రూప్నకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు. 29 బిలియన్ డాలర్లకుపైగా నెట్వర్త్ కలిగిన ఆయన, 2016లో భారత్ మూడవ అత్యున్నత స్థాయి పౌర పురస్కారం పద్మ భూషన్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. వీరిలో ఒకరైన సైరస్ మిస్త్రీ, రతన్ టాటాకు వారసునిగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 2016లో హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను చైర్మన్ పదవి నుండి బోర్డ్ తొలగించిన సంగతి తెలిసిందే.