WAVES Summit: ముంబైలో అంతర్జాతీయ సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభరోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి 30 మంది ఆర్కెస్ట్రాతో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ వేదిక ముఖ్య ఉద్దేశం.. భారత మీడియా, వినోద రంగాలను ఒక అంతర్జాతీయ ప్రమాణానికి తీసుకెళ్లడం. సినిమాలు, OTT, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలను ఒకే వేదికపై సమీకరిస్తూ, సృజనాత్మకతకు కేంద్రంగా "కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్" అనే ట్యాగ్లైన్తో సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, స్టార్ట్అప్ల ప్రతినిధులు, వినోద రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
PM Modi: ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలు అందజేత
1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు
ఈ సదస్సు ద్వారా 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, 90కి పైగా దేశాల నుంచి వచ్చిన పదివేల మందికిపైగా పాల్గొనబోతున్నారు. అలాగే 300కి పైగా ప్రముఖ కంపెనీలు, 350కిపైగా స్టార్ట్అప్లు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సదస్సులో ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, ఎం.ఎం. కీరవాణి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నారు.
తొలిసారి ఆతిథ్యం
ఈ సమ్మిట్లో ఒక విశిష్టత ఏమిటంటే, భారతదేశం తొలిసారిగా ‘గ్లోబల్ మీడియా డైలాగ్ (GMD)’కి ఆతిథ్యం ఇస్తోంది. ఇది 25 దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో జరగనున్న అంతర్జాతీయ చర్చా వేదిక. ఇందులో సినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ తదితర విభాగాలపై లోతైన చర్చలు జరుగుతాయి.