Skip to main content

మే 2019 జాతీయం

మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తర్వాత.. మోదీనే..
Current Affairs మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత లోక్‌సభలో మెజార్టీతో.. రెండోసారి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. మే 23వ తేదీన వెలువడిన 17వ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ 272 మార్కును సునాయాసంగా దాటింది. 2014 ఎన్నికల్లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించింది. 1951-52 మొదటి లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ నాలుగింట మూడొంతుల స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1957, 1962 ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. 1951-52 ఎన్నిక ల్లో 489 స్థానాలకు 364 సీట్లు కాంగ్రెస్ సాధించింది. 1962 ఎన్నికల్లో నెహ్రూ 494 లోక్‌సభ సీట్లకు 361 సీట్లతో భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు. మోదీ 2014 ఎన్నికల్లో 282 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తర్వాత లోక్‌సభలో అత్యంత మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నరేంద్ర మోదీ
ఎప్పుడు: మే 29
ఎవరు: నరేంద్ర మోదీ
ఎక్కడ: భారతదేశం

పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04%
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్-ఆఫ్-ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే...
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04%
ఎందుకు: పైన తెలిపిన వారిలో ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్-ఆఫ్-ది ఎబవ్) అని తేల్చి చెప్పడం కోసం

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం
తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయి్యంది. పార్టీలవారీగా చూస్తే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచాయి. డీఎంకే 23, వైఎస్సార్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు 22 చొప్పున, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యధికంగా 3,60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి ఈసీ ఎన్నికలను నిర్వహించలేదు.
2019 తీర్పు :

బీజేపీ

303

కాంగ్రెస్

52

ఎన్‌డీఏ

352

యూపీఏ

91

ఇతరులు

99

తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు గెలుపొందిన సీట్లు, ఓట్ల శాతం
ఆంధ్రప్రదేశ్ - మొత్తం సీట్లు 25

పార్టీ

సీట్లు

ఓట్ల శాతం

వైఎస్సార్‌సీపీ

22

49.15

తెలుగు దేశం

3

39.59

బీజేపీ

-

0.96

బీఎస్పీ

-

0.26

సీపీఐ

-

0.08

సీపీఎం

-

0.12

కాంగ్రెస్

-

1.29

నోటా

-

1.49

ఇతరులు

-

7.03

తెలంగాణ-మొత్తం సీట్లు 17

పార్టీ

సీట్లు

ఓట్ల శాతం

టీఆర్‌ఎస్

9

41.29

బీజేపీ

4

19.45

కాంగ్రెస్

3

29.48

ఎంఐఎం

1

2.78

నోటా

-

1.02

ఇతరులు

-

5.98

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://results.eci.gov.in/

ఒడిశాలో బీజేడీ ఘనవిజయం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) హవా సాగుతోంది. అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న 146 స్థానాల్లో 105 చోట్ల బీజేడీ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 74 స్థానాలు అవసరం కాగా తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేడీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేడీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ 26 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 14, సీపీఎం 1 స్థానంలోనూ ఆధిక్యంతో ఉన్నాయి. బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోటీ చేసిన బిజేపూర్, హింజిలి అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గత 19 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఓటమి ఎరుగని నేత..
మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ తదనంతరం నవీన్ పట్నాయక్ సారథ్యంలో బిజూ జనతా దళ్ ఏర్పాటైంది. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేడీ 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. బీజేపీతో కలిసి నవీన్ పట్నాయక్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు ఓటమి ఎరుగరు. 2004 ఎన్నికల్లో 61, 2009 ఎన్నికల్లో 103 స్థానాలు, 2014 ఎన్నికల్లో 117 స్థానాలు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కూడా మరోసారి ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
ఒడిశా లోక్‌సభ సీట్లు :

పార్టీ

2014

2019

బీజేడీ

20

13

బీజేపీ

01

8

కాంగ్రెస్

00

0

క్విక్ రివ్యూ:
ఏమిటి: ఒడిశా అసెంబ్లీ ఎన్నికలో బిజూ జనతాదళ్(బీజేడీ) విజయం
ఎప్పుడు: మే 23
ఎవరు: నవీన్ పట్నాయక్
ఎక్కడ: ఒడిశా

అరుణాచల్’లో కమల వికాసం
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 60 స్థానాలకు గానూ బీజేపీ 28 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, మిత్రపక్షం జేడీయూ ఆరు స్థానాల్లో గెలుపొందింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరమైన నేపథ్యంలో మిత్రపక్షం బీజేపీకి మద్దతు ఇస్తామని జేడీయూ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు లాఛనంకానుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు పార్టీ విజయం కోసం కృషిచేసిన బీజేపీ కార్యకర్తలను మోదీ అభినందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా
ఎప్పుడు: మే 23
ఎక్కడ: అరుణాచల్ ప్రదేశ్

సిక్కింలో
చామ్లింగ్’ శకానికి తెర
మరోవైపు సిక్కింకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) అధినేత పవన్ చామ్లింగ్ శకం ముగిసింది. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(సీఎస్‌ఎం) 17 స్థానాలతో విజయదుందుభి మోగించగా, పవన్ చామ్లింగ్‌కు చెందిన ఎస్డీఎఫ్ 15 సీట్లకు పరిమితమైంది. సిక్కింలో ప్రభుత్వం ఏర్పాటుకు 16 సీట్లు అవసరమైన నేపథ్యంలో సిక్కిం క్రాంతికారీ మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. చామ్లింగ్ గత 24 సంవత్సరాలుగా సిక్కింకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సిక్కిం క్రాంతికారీ మోర్చా(సీఎస్‌ఎం) 17 స్థానాలతో విజయం
ఎప్పుడు: మే 23
ఎక్కడ: సిక్కిం

16వ లోక్‌సభను రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు
16వ లోక్‌సభ రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. ఈ మేరకు మే 24న ప్రధాని నరేంద్ర మోదీ, మిగతా కేంద్రమంత్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలసి రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరారు. 2019, జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 16వ లోక్‌సభను రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు
ఎప్పుడు : మే 24
ఎవరు : కేంద్ర కేబినెట్

ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ఒప్పందం
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి మే 24న విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా ప్రాతిపదికన నిర్మించే ఈ జలాంతర్గాములను దేశ రక్షణ అవసరాల కోసం వినియోగించనున్నారు. భారత్‌లో తయారీ నినాదంలో భాగంగా యూ-75(1) పేరిట ఈ జలాంతర్గాములను హిందుస్థాన్ షిప్‌యార్డు, భారత్ హెవీ ఎలక్టిక్రల్స్ లిమిటెడ్ (భెల్), మిశ్రదాతు నిగమ్ లిమెటెడ్ (మిథాని) సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ఒప్పందం
ఎప్పుడు : మే 24
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ

జమాతుల్ ముజాహిదీన్‌పై నిషేధం
బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), జమాతుల్ ముజాహిదీన్ హిందుస్థాన్‌లపై భారత్ నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం వీటిని నిషేధిస్తున్నట్లు మే 24న ప్రభుత్వం తెలిపింది. 2014 అక్టోబరు 2న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్, 2018 జనవరి 19వతేదీన బుద్ధగయలో జరిగిన పేలుళ్ల వెనుక జమాతుల్ ముజాహిదీన్ హస్తముందని తేలింది. 2016వ సంవత్సరంలో ఢాకాలోని ఓ కేఫ్‌లో 22 మందిని జేఎంబీ సభ్యులు కాల్చి చంపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌పై (జేఎంబీ) నిషేధం
ఎప్పుడు : మే 24
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : చట్టవ్యతిరేక కార్యకలాపాల కు పాల్పడుతున్నందుకు

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు మే 25న కోవింద్‌ను కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా అందజేత
ఎప్పుడు : మే 25
ఎవరు : ఎన్నికల కమిషన్ (ఈసీ)

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల కమిషన్ (ఈసీ) మే 26న ఎత్తివేసింది. ఈ మేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత
ఎప్పుడు : మే 26
ఎవరు : ఎన్నికల కమిషన్ (ఈసీ)

జూన్ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు
17వ లోక్‌సభ తొలిసమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. మే 31న ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. మే 30న ప్రధానిగా నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రుల చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగుతాయి. సమావేశాల్లో భాగంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లు విడుదల
2019 సంవత్సరానికి గానూ ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలతో రూపొందించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మే 26న విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు చోటు లభించింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి టైమ్స్ సంస్థ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు మొదటి ర్యాంకు లభించగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి రెండో ర్యాంకు దక్కింది.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో దేశంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కి మొదటి ర్యాంకు లభించగా.. తర్వాతి స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251-300 ర్యాంకు దక్కింది. 351-400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401-500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601-800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801-1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి.
వరల్డ్ ర్యాంకులు ఇవీ..
  • 251-300 ర్యాంకులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
  • 351-400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ
  • 401-500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ
  • 501-600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ
  • 601-800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ
  • 801-1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్‌ఈఆర్ కోల్‌కతా, ఎన్‌ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లు-2019 విడుదల
ఎప్పుడు : మే 26
ఎవరు : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్

మోదీ ప్రమాణానికి బిమ్స్‌టెక్ నేతలు
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిమ్స్‌టెక్ దేశాల అధినేతలను ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌ను కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. బిమ్స్‌టెక్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. 2014లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు.

వందే భారత్ ప్రయాణం లక్ష కి.మీ.
Current Affairs వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు మూడు నెలల్లో నిరంతరాయంగా ప్రయాణించి మే 15న కాన్పూర్ సమీపంలో కొచ్చే సమయానికి లక్ష కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దేశంలో అత్యంత వేగం ప్రయాణించే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీలో 2019, ఫిబ్రవరి 15న ప్రారంభించారు. బుల్లెట్ రైలు తరహాలో ఉండే ఈ రైలులో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్ష కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకున్న రైలు
ఎప్పుడు : మే 15
ఎవరు : వందే భారత్ ఎక్స్‌ప్రెస్

అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా తషిగానగ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని తషిగానగ్ రికార్డు నెలకొల్పింది. సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తషిగానగ్ ఉంది. తాజాగా ఇక్కడి పోలింగ్ కేంద్రం మరో ఘనతను సాధించింది. తషిగానగ్‌లో మే 19న ఎన్నికల సందర్భంగా 132 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఊరిలో మొత్తం 49 మంది ఓటర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు వచ్చిన అధికారులు తషిగానగ్‌లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడంతో మొత్తం 65 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ 132 శాతానికి చేరుకున్నట్లయింది.

యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవర్
ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో కైలాస్ మానస సరోవర్‌కు సంబంధించిన భారత భాగాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు యునెస్కో అంగీకరించిందని భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మే 19న తెలిపింది. 2019, ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో మానస సరోవర్
ఎప్పుడు : మే 19
ఎవరు : భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ

రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి తెలిపారు. అందులో భాగంగానే శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు నివేదించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషుల విడుదల నిర్ణయం గవర్నర్‌కు ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని తమిళ సంఘాలు దోషుల విడుదలకు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి ఘటనలో నష్టపోయిన బాధితుల కుటుంబాలు మాత్రం దీనికి అడ్డుపడుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల కు కట్టుబడి ఉన్నాం
ఎప్పుడు : మే 20
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి

పర్యాటక స్థలాల్లో స్తన్యగృహాలు
పాలిచ్చే తల్లుల సదుపాయం కోసం పర్యాటక స్థలాల్లో ‘స్తన్యగృహాలు’ ఏర్పాటుచేయనున్నట్లు భారత పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఎ.ఎస్.ఐ) ప్రకటించింది. తొలి విడతగా తాజ్ మహల్, ఆగ్రాఫోర్ట్, ఫతేపూర్ సిక్రీలలో ఈ స్తన్యగృహాల నిర్మాణం జరుగుతుందని తెలిపింది. చారిత్రక సందర్శన స్థలాల్లో ఎ.ఎస్.ఐ. ఇలా స్తన్యగృహాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. లైట్, ఫ్యాను, కుర్చీ, టేబులు వంటి కనీస సదుపాయాలు స్తన్యగృహాల్లో ఉంటాయి. నిరంతరం మనుషులు మసులుతుండే చారిత్రక కట్టడాల్లో బిడ్డకు స్తన్యమివ్వడానికి ‘చాటు’ కోసం వెతుక్కోవడం, పొదల వెనుకకు వెళ్లడం వంటి ఇబ్బందులను తల్లులు ఎదుర్కొంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక స్థలాల్లో స్తన్యగృహాలు
ఎప్పుడు : మే 21
ఎవరు : భారత పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఎ.ఎస్.ఐ)
ఎందుకు : పాలిచ్చే తల్లుల సదుపాయం కోసం

అరుణాచల్‌లో ఉగ్రవాదుల కాల్పులు
అరుణాచల్ ప్రదేశ్‌లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్) ఉగ్రవాదులు మే 21న కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యే సహా పదిమంది మృతి చెందారు. ఖోన్సా వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే తిరోంగ్ అబోహ్(41)(నేషనల్ పీపుల్స్ పార్టీ-ఎన్‌సీపీ అభ్యర్థి) మే 21న ఉదయం అస్సాం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి వాహనంలో వస్తుండగా తిరాప్ జిల్లాలో నాగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే తిరోంగ్, ఆయన కొడుకు, భద్రతా సిబ్బంది ఒకరు సహా మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రవాదుల కాల్పులు
ఎప్పుడు : మే 21
ఎవరు : నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్)
ఎక్కడ : తిరాప్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్

శంషాబాద్ విమానాశ్రయానికి 8వ స్థానం
Current Affairs ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 8వ స్థానం లభించింది. 2019 సంవత్సరానికి రూపొందించిన విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ మే 10న విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానం, గీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించి ఈ జాబితా ఎయిర్‌హెల్ప్ రూపొందించింది.
ఎయిర్‌హెల్ప్ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా-2019

ర్యాంకు

విమానాశ్రయం పేరు

దేశం

1

హమద్ ఎయిర్‌పోర్ట్

ఖతార్

2

టోక్యో ఎయిర్‌పోర్ట్

జపాన్

3

ఏథెన్స్ ఎయిర్‌పోర్ట్

గ్రీస్

4

అఫోన్సో పెనా

బ్రెజిల్

5

గాన్స్ లెచ్ వలేసా

పోలాండ్

6

షెరెమెటేవో ఎయిర్‌పోర్ట్

రష్యా

7

షాంఘి ఎయిర్‌పోర్టు

సింగపూర్

8

రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్

భారత్

9

టెనెరిఫె నార్త్

స్పెయిన్

10

విరాకోపస్/కాంపినస్

బ్రెజిల్

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానం
ఎప్పుడు : మే 11
ఎవరు : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు
అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరగా దీనికి కోర్టు అంగీకరించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ కలీఫుల్లా ఉండగా సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవాది శీరాం పంచూ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరినందుకు

టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్ లో 49 భారతీయ సంస్థలు
Current Affairs ఆసియాలోని విశ్వవిద్యాలయాలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఇచ్చే ర్యాంకింగ్స్ లో 49 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు మే 2న టీహెచ్‌ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఈసారి కూడా 29వ ర్యాంకును పొందింది. అలాగే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు సాధించాయి.
2018లో భారత్‌కు చెందిన 42 విద్యా సంస్థలు టీహెచ్‌ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, ఈసారి ఆ సంఖ్య 49కి పెరిగింది. దీంతో 2019 ఏడాదిలో జపాన్ (103), చైనా (72) తర్వాత ఎక్కువ సంస్థలతో ప్రాతినిధ్యమున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్ లో 49 భారతీయ సంస్థలు
ఎప్పుడు : మే 2
ఎవరు : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ)
ఎక్కడ : ఆసియా

వేదాంత దేశికులు స్మారక తపాలా బిళ్ల విడుదల
వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 2న ఢి ల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... భారతీయ వాజ్ఞ్మయాన్ని అవపోసన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంత దేశికులని, ఆయన ఆధ్యాత్మిక గురువే కాదని, అంతకు మించిన దార్శనికుడని కొనియాడారు. మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చిన తత్వవేత్తల్లో ప్రముఖులని పేర్కొన్నారు. 20ఏళ్ల వయసులోనే వేదవేదాంగాలు, దివ్య ప్రబంధాలు, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, యోగ, సంఖ్యా, వ్యాకరణాలను ఆయన అవపోసన పట్టారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వేదాంత దేశికులు స్మారక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : మే 2
ఎవరు : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా

ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి
గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో మే 2. ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ-5 రకం బంగాళదుంపలను పండించారు. అయితే ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేసింది. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది.

పూరీ సమీపంలో తీరం దాటిన ఫొని
ఒడిశాలోని పూరీ సమీపంలో మే 3న ఫొని తుపాను తీరం దాటింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ఫొని తీరం దాటే సమయంలో గంటకు 175-205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుపాను కారణంగా ఎనిమిది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ మే 4 నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.
పెనుగాలులు.. కుండపోత వర్షాలు..
ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసం కాగా వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందస్తు చర్యగా 11 లక్షల మంది బాధితులను ఒడిశా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫొని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. ఫొని తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫొని తుపాను పేరును బంగ్లాదేశ్ సూచించగా, ఫొని అనే పదానికి పాము పడగ అని అర్థం వస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తీరం దాటిన ఫొని తుపాను
ఎప్పుడు : మే 3
ఎక్కడ : పూరీ సమీపం, ఒడిశా

సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణలపై నివేదిక
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై 14 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ మే 5న తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణలపై నివేదిక
ఎప్పుడు : మే 5
ఎవరు : సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర మే 7న ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్-నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు. మే 7న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవగా మే 9న కేదార్‌నాథ్ ఆలయాన్ని, మే 10న బద్రీనాథ్ ఆలయాన్ని 10న తెరవనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : మే 7
ఎక్కడ : ఉత్తరాఖండ్
ఎందుకు : యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాల సందర్శనకోసం

విపక్షాల రివ్యూ పిటిషన్ తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మే 7న విచారించింది.

Published date : 17 May 2019 05:00PM

Photo Stories