Skip to main content

మే 2021 అంతర్జాతీయం

యుద్ధ విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ అంగీకారం
Current Affairs అమెరికా, ఈజిప్టుతోపాటు అంతర్జాతీయ మధ్యవర్తులు చేసిన సంధి ప్రయత్నాలు, ఒత్తిళ్లు ఫలించాయి. 11 రోజులుగా హోరా హోరీగా సాగుతున్న దాడులు, ప్రతిదాడులకు ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఎట్టకేలకు అంగీకరించాయి. కాల్పుల విమరణ మే 21 నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఘర్షణల్లో మొత్తం 240 మంది మరణించారు. 2014లో జరిగిన గాజా యుద్ధం తర్వాత ఇరు వర్గాల మధ్య ఇదే అతిపెద్ద పోరు. హింసను తక్షణమే ఆపాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి ఇజ్రాయెల్‌ తలొగ్గింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ను ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్‌–సిసీ ధన్యవాదాలు తెలియజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాడులు, ప్రతిదాడులకు ముగింపు పలికేందుకు అంగీకారం
ఎప్పుడు : మే 21
ఎవరు : పలికేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌
ఎక్కడ : ఇజ్రాయెల్, పాలస్తీనా

ఇటీవల దక్షిణాసియా దేశ పార్లమెంటు రద్దయింది?
దక్షిణాసియా దేశం నేపాల్ పార్లమెంటు(ఫెడరల్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్) రద్దయింది. పార్లమెంటును రద్దు చేయాలని నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదనకు అధ్యక్షురాలు భండారీ మే 22న ఆమోదం తెలిపారు. 275 మంది సభ్యులున్న ప్రస్తుత పార్లమెంట్ను రద్దుచేస్తున్నట్లు అధ్యక్షురాలు బిద్యాదేవి ప్రకటించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు నిమిత్తం నవంబర్‌ 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంకావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2021. మే 10న తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఓలీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కోలేనని తేల్చిచెప్పడంతో తాజా రాజకీయ సంక్షోభం తలెత్తింది. విపక్షాల కూటమి అభ్యర్థి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా కూడా ప్రభుత్వ ఏర్పాటు విఫలమయ్యారు. నేపాల్ పార్లమెంట్ రద్దు కావడం గత 5 నెలల్లో ఇది రెండోసారి. నేపాల్ పార్లమెంట్లో దిగువ సభను ప్రతినిధుల సభగా వ్యవహరిస్తారు. ఎగువ సభను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారు.
నేపాల్ రాజధాని: ఖాట్మండు; కరెన్సీ: నేపాలిస్ రుపీ
నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు: విద్యాదేవి భండారీ
నేపాల్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు: నంద కిశోర్ పున్
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాసియా దేశం నేపాల్ పార్లమెంటు(ఫెడరల్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్) రద్దు
ఎప్పుడు : మే 22
ఎవరు : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ
ఎందుకు : నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సిఫారసుల మేరకు

పాకిస్తాన్కు ఇకపైనా సాయం ఉండదు: అమెరికా
పాకిస్తాన్‌కు రక్షణ సహాయం (సెక్యూరిటీ అసిస్టెన్స్‌) విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాన్నే కొనసాగించాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు. అయితే, భవిష్యత్తులోనూ రక్షణ సాయం రద్దును ఇలాగే కొనసాగిస్తారా? లేక ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రక్షణ పేరిట పాకిస్తాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 2018 జనవరిలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌ నిలిపివేశారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో పాకిస్తాన్‌ పాత్ర, సహకారం పట్ల సంతృప్తి కలగడం లేదని, అందుకే రక్షణ సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

భారత్లో గుర్తించిన కరోనా వేరియంట్ ప్రస్తుతం ఎన్ని దేశాల్లో కనిపిస్తోంది?
తొలిసారిగా భారత్‌లో గుర్తించిన బి.1.617 కరోనా వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచంలో 53 దేశాల్లో కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మే 25న వెల్లడించింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని పేర్కొంది. మొట్టమొదటిసారిగా ఇండియాలో గుర్తించినట్లు చెబుతున్న బి.1.617 కరోనా వేరియంట్‌లో మూడు విభాగాలు ఉన్నట్లు తేల్చారు. అవి. బి.1.617.1, బి.1.617.2, బి.1.617.3. ఇందులో బి.1.617.1 రకం 41 దేశాల్లో, బి.1.617.2 రకం 53 దేశాల్లో, బి.1.617.3 రకం ఆరు దేశాల్లో వ్యాప్తిలో ఉన్నట్లు వెల్లడించింది. బి.1.617 వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది.
భారత్లో ఇండోనేసియా రాయబారి మృతి
భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్‌ పయ్‌ మే 25న కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన ఇండోనేసియాలోని జకార్తా సిటీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడింది : ఐరాస
ఇటీవల ఇజ్రాయెల్‌కు, గాజాలోని హమాస్‌ మిలటరీకి మధ్య జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం చీఫ్ మిషెల్ బాచ్లెట్ చెప్పారు. దీన్ని బయటకు తేవాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని మే 27న జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. అంతేగాక ఇజ్రాయెల్‌–పాలస్తీనా మూల సమస్యను పరిష్కరించపోతే శాంతి కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వేలాది రాకెట్లను ప్రయోగించిన హమాస్‌ సైతం యుద్ధ నేరాలకు పాల్పడిందని స్పష్టం చేశారు. 11 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో గాజాలో 248 మంది మరణించగా, ఇజ్రాయెల్‌లో 12 మంది మరణించారు.
మిలటరీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రజావాసాలపై దాడులు జరిపితే దాన్ని యుద్ధనేరంగా పరిగణిస్తారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా విషయంపై పలు ముస్లి దేశాలు ఐరాసలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. అది ఆమోదం పొందితే, ఆ ప్రాంతంలోని మానవహక్కుల ఉల్లంఘనలపై విచారణకు ఓ శాశ్వత కమిషన్‌ ఏర్పాటవుతుంది.

చైనా రహస్య పత్రం ఏం చెబుతోంది..? ఆ పేపర్‌లో ఏముంది?
Current Affairs
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా మార్చి వదిలారా? అన్నదానిపై మొదటి నుంచీ సందేహాలు ఉన్నాయి. అన్ని అనుమానాలూ చైనాపైనే ఉన్నాయి. ఈ సందేహాలను బలోపేతం చేసేలా.. చైనా మిలటరీ సైంటిస్టులకు చెందిన పరిశోధనా పత్రం లీకైంది. ఈ వివరాలతో ది ఆస్ట్రేలియన్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలివి..
వూ హాన్‌లో ఏం జరిగింది?
కోవిడ్‌–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పరిశోధన చేస్తున్న అమెరికన్‌ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పరిశోధనా పత్రం దొరికింది. మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం (ది అన్‌నాచురల్‌ ఆరిజిన్‌ ఆఫ్‌ సార్స్‌ అండ్‌ న్యూ స్పీషీస్‌ ఆఫ్‌ మ్యాన్‌మేడ్‌ వైరసెస్‌ యాజ్‌ జెనెటిక్‌ బయో వెపన్స్‌) అనే శీర్షికతో చైనా మిలటరీ సైంటిస్టులు, ఉన్నతాధికారులు రాసిన పత్రం అది. కరోనా ప్రబలడానికి ఐదేళ్ల ముందే అంటే 2015లోనే ఈ పత్రాన్ని రాయడం గమనార్హం. దీనికి సంబంధించి ది ఆస్ట్రేలియన్‌ పత్రిక వాస్తవంగా వూ హాన్‌లో జరిగిందేమిటి? అనే పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
ఆ పేపర్‌లో ఏముంది?
సరికొత్త జెనెటిక్‌ ఆయుధాల శకంలో సార్స్‌ కరోనా వైరస్‌లు ఓ భాగం. మనుషులకు వ్యాధులు కలిగించే వైరస్‌లుగా వాటిలో కృత్రిమంగా మార్పులు చేయవచ్చు. తర్వాత బయో ఆయుధాలుగా మార్చి ప్రయోగించవచ్చు. చైనాకు చెందిన ఈ రహస్య పత్రాలను సిద్ధం చేసిన 18 మందిలో ఆ దేశ ఆర్మీ (పీఎల్‌ఏ) శాస్త్రవేత్తలు, ఆయుధ నిపుణులు, పబ్లిక్‌ హెల్త్‌ ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి.
జీవాయుధాలతోనే మూడో ప్రపంచ యుద్ధం..
మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే జీవాయుధాలతోనే జరుగుతుందని చైనా రహస్య పత్రంలో పేర్కొన్నారు. జీవాయుధాలను ప్రయోగించడం ద్వారా శత్రుదేశ వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా ఆర్మీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
సార్స్‌ కూడా జీవాయుధమే!
2003లో చైనాను, మరికొన్ని దేశాలను వణికించిన సార్స్‌ (సీవర్‌ ఆక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వైరస్‌ కచ్చితంగా మనుషులు తయారు చేసిన జీవాయుధమే అయి ఉంటుందని రహస్య పత్రంలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు దానిని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు.
ల్యాబ్‌ నుంచి లీకైందా.. కావాలనే వదిలారా?
వూ హాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకైందని మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. అయితే ల్యాబ్‌ నుంచి లీకైందని గానీ, ఉద్దేశపూర్వకంగానే వదిలారని గానీ కచ్చితమైన ఆధారాలు ఏమీ ఇప్పటివరకు లభించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ కూడా వూహాన్‌ ల్యాబ్‌ లీకేజీ అంశాన్ని కొట్టిపారేయలేదు. ఆ కోణంలో మ రింత పరిశీలన జరగాల్సి ఉందని అన్నారు.
ఎన్నో ఆందోళనలు..
చైనా కొన్నేళ్లుగా వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోంది. వేగంగా విస్తరించి, వేగంగా చంపేయగల సామర్థ్యం ఉన్న వైరస్‌లను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. లీకైన రహస్య పత్రాన్ని బట్టి జీవాయుధాల పట్ల చైనా తీరు ఏమిటో స్పష్టమవుతోందని, అందరూ దృష్టిసారించాల్సిన అంశం ఇది అని బ్రిటన్‌ ఎంపీ టామ్‌ టుగెండాట్‌ ఇటీవలే విమర్శించారు.
మరెన్నో సందేహాలు..
కరోనా వైరస్‌ మూలాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా ఎందుకు విముఖత చూపుతోందనే దానికి.. ఇప్పుడు బయటపడ్డ రహస్య పత్రమే సమాధానం చెప్తోందని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీటర్‌ జెన్నింగ్స్‌ అన్నారు. రహస్య పత్రంలోని అంశాలు చైనాపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని బ్రిటన్‌ ఎంపీ టామ్, ఆస్ట్రేలియా రాజకీయ నాయకుడు జేమ్స్‌ పీటర్సన్‌ స్పష్టం చేస్తున్నారు.
ఆ రిపోర్టు తప్పు: చైనా
ది ఆస్ట్రేలియన్‌ ప్రచురించిన ఆర్టికల్‌ను చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ తప్పుపట్టింది. కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టేందుకు వాస్తవాలను వక్రీకరించారు. అదొక కుట్ర సిద్ధాంతం అని పేర్కొంది.

ఆఫ్రికా దేశం ట్యునీషియా దేశ రాజధాని నగరం పేరు?
ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో అందులోని సుమారు 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని సమీపంలోని చమురు సంస్థ సిబ్బంది కాపాడారు. ఎస్‌ఫాక్స్‌ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ట్యునీషియా రక్షణ శాఖ మే 18న తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది. లిబియాలోని జవారా రేవు నుంచి ఈ పడవ బయలుదేరింది. యూరప్‌ వెళ్లాలనుకునే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన ఈ మధ్యదరా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ట్యునీషియా రాజధాని: ట్యునిస్‌; కరెన్సీ: ట్యునీషియన్ దినార్
ట్యునీషియా అధికార భాష: అరబిక్
ట్యునీషియా ప్రస్తుత అధ్యక్షుడు: కైస్ సయీద్
ట్యునీషియా ప్రస్తుత ప్రధాని: హిచెం మెచిచి
Published date : 29 Jun 2021 02:40PM

Photo Stories