Skip to main content

మే 2020 అంతర్జాతీయం

చైనీస్ కంపెనీల డీలిస్టింగ్ బిల్లుకు ఆమోదం
Current Affairs
అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. తమ దేశ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఇందుకు సంబంధించి హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరుతో రూపొందించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ స్టాక్ ఎక్స్చేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు.
దాదాపు 170 చైనా కంపెనీలు..
అమెరికాలోని నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ స్టాక్ ఎక్స్చేంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు: మే 21
ఎవరు: అమెరికా సెనేట్
ఎందుకు: అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం
పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)కు చెందిన విమానం మే 22న కుప్పకూలింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు పాక్ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాద ప్రాణనష్టంపై స్పష్టత రాలేదు. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్ మీడియా సంస్థ వెల్లడించింది.

నిరుద్యోగ భృతికి 3.9 కోట్ల దరఖాస్తులు
కరోనా నేపథ్యంలో అమెరికాను నిరుద్యోగ సమస్య అతలాకుతలం చేస్తోంది. వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం లక్షలాది అమెరికన్లు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంకా, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని లేబర్ డిపార్ట్‌మెంట్ మే 21న ప్రకటించింది. ఇక కరోనా మహమ్మారితో లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

భారత్ కంటే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు అధికం
ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధుల్ని కేటాయించే చైనా 2020 ఏడాది మరింతగా బడ్జెట్‌ను పెంచింది. గత ఏడాది 177 బిలియన్ డాలర్లుగా ఉన్న బడ్జెట్‌ను 6.6 శాతం పెంచుతూ ఈసారి 179 బిలియన్ డాలర్లను కేటాయించింది. భారత్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. కోవిడ్-19 ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. కాగా, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరుబాట పట్టిన హాంకాంగ్‌పై మరింత పట్టుబిగిస్తూ జాతీయ భద్రతా ముసాయిదా బిల్లును చైనా ప్రభుత్వం మే 22న పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

ఒక్క డాలర్‌కే న్యూజిలాండ్ మీడియా సంస్థ అమ్మకం
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’ను కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్ మే 25న ప్రకటించింది. ఈ డీల్ మే నెలాఖరుకు పూర్తవుతుందని తెలియజేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒక్క డాలర్‌కే మీడియా సంస్థ స్టఫ్ అమ్మకం
ఎప్పుడు : మే 25
ఎవరు : నైన్ ఎంటర్‌టైన్‌మెంట్
ఎక్కడ : న్యూజిలాండ్
ఎందుకు : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడంతో

యుద్ధ సన్నద్ధతను పెంచుకోండి: జిన్‌పింగ్
యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలని సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశమిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), పీపుల్స్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్ ప్లీనరీ సమావేశానికి హాజరైన సందర్భంగా జిన్‌పింగ్ ఈ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని చైనా అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
వైమానిక స్థావరం విస్తరణ
భారత్‌లోని లదాఖ్ సరిహద్దుల్లో చైనా ఒక వైమానిక స్థావరాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మే 5న భారత్, చైనా మధ్య సైనికులు ఘర్షణ పడిన పాంగాంగ్ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్ బేస్ నిర్మాణ పనులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి చిత్రం 2020, ఏప్రిల్ 6న తీస్తే, రెండోది మే 21న తీశారు. హెలికాప్టర్లు దిగడానికి వీలుగా నిర్మించిన ట్రాక్ రెండో చిత్రంలో చూడొచ్చు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జే-11 లేదంటే జే-16 యుద్ధ విమానాలు నాలుగు వరసగా ఉండడం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కలవరాన్ని పెంచుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని సైన్యానికి పిలుపు
ఎప్పుడు : మే 25
ఎవరు : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌పై నిషేధం
కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మే 25న ప్రకటించింది. ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌పై నిషేధం
ఎప్పుడు : మే 25
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందని

భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది. లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్- చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 27న ప్రకటించారు. కశ్మీర్ అంశంలోనూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కశ్మీర్ విషయంలో మూడో జోక్యాన్ని అంగీకరించబోమని భారత్ తేల్చిచెప్పింది.
ప్రశాంతంగానే పరిస్థితి
భారత్‌తో సరిహద్దు వివాదం విషయంలో చైనా మే 27న కొంత సంయమన ధోరణిలో స్పందించింది. భారత్‌తో సరిహద్దుల వెంబడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘భారత్ సరిహద్దుల్లో మొత్తానికి పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన దౌత్య, సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తా
ఎప్పుడు: మే 27
ఎవరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్- చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో

డ్రాగన్ దేశంపై ఉమ్మడిగా పోరాడాలన్న అమెరికా
భారత్ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని మే 21న అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్ జలసంధి, భారత్ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచించిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సమర్పించింది. చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం.

భారత్‌కు ప్రపంచ బ్యాంకు వంద కోట్ల డాలర్ల ప్యాకేజీ
Current Affairs
కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది. దేశంలోని పట్టణ పేదలు,వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని అందించనుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని మే 15న ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. సోషల్ సెక్యూరిటీ టెక్నాలజీ ప్యాకేజీ కింద భారత్‌లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు ఈ వంద కోట్ల డాలర్లు ఉపయోగపడనున్నాయని బ్యాంకు పేర్కొంది. ‘గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదల పట్ల సామాజిక భద్రతను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం‘ అని ప్రపంచ బ్యాంక్ డెరైక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకం చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు.
కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్‌కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వనుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ కూడా రానుందని భావిస్తున్నారు. సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి:భారత్‌కు ప్రపంచ బ్యాంకు వంద కోట్ల డాలర్ల సహాయం
ఎప్పుడు:మే 15
ఎవరు: ప్రపంచ బ్యాంకు
ఎందుకు: పట్టణ పేదలు, వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా

అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్
కోవిడ్-19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్ కోవిడ్-19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాను కాదంటే పన్నుల మోత
అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలను ఎంపిక చేసుకుంటే వాటిపై పన్నుల మోత మోగుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా, తయారీలో కొంత వరకు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాలకు తరలించాలని అమెరికాతోపాటు ఇతర దేశాల కంపెనీలు యోచిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ తన తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలనుకుంటున్నట్టు న్యూయార్క్‌పోస్ట్ కథనం పేర్కొంది.
చైనా నుంచి భారత్‌కు లావా
చైనా నుంచి భారత్‌కు కార్యకలాపాలను తరలించనున్నట్లు దేశీయ మొబైల్ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రకటించింది. దేశంలో మొబైల్ ఫోన్ల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల విస్తరణ నిమిత్తం వచ్చే అయిదేళ్లలో రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే: ఆక్స్‌ఫర్డ్
కోవిడ్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచదేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి యూకేలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధన మీదే ఉంది. మందుల తయారీ కంపెనీ అ్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జెన్నర్ ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న ChAdOx1 nCoV&19 అనే ఈ వ్యాక్సిన్ కోతులపై సానుకూల ఫలితమివ్వడం తెల్సిందే. వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలన్నింటికీ అందుబాటులోకి తెస్తామని పరిశోధనల్లో పాల్గొంటున్న ఆక్స్‌ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ అడ్రియాన్ హిల్ చెప్పారు. మనుషులపై ప్రయోగాలు సక్సెస్ అయితే వ్యాక్సిన్ ధర ఎంతవరకు ఉంటుందన్న సందేహాలను ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హిల్ నివృత్తి చేశారు. అతి తక్కువ ధరలో అత్యధికులకి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని వెల్లడించారు.
ఏడు ఇనిస్టిట్యూట్‌లలో..
డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్ ఉండడం కోసం ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏడు ఇనిస్టిట్యూట్‌లలో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భారత్‌లోని పుణేలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ఉంది. యూరప్, చైనాలో వివిధ ఇనిస్టిట్యూట్‌లలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు. జూలై, ఆగస్టునాటికల్లా మానవులపై ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తేలిపోతుందని హిల్ వివరించారు.

చైనాలో కరోనా కేసులపై వెలుగులోకి కొత్త వివరాలు
చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. 2020, ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్‌కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి. ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి:కరోనా కేసులపై వెలుగులోకి కొత్త వివరాలు
ఎప్పుడు:మే 18
ఎవరు: ఫారిన్ పాలసీ మేగజీన్, 100 రిపోర్టర్స్
ఎక్కడ: చైనా

యూకే పార్లమెంట్‌కు కొత్త వీసా విధానం
బ్రెగ్జిట్ అనంతర వీసా విధానానికి సంబంధించిన బిల్లును మే 18న బ్రిటన్ పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టారు. ఏ దేశం వారనే ప్రాతిపదికన కాకుండా, నైపుణ్యాల ఆధారంగా, పాయింట్స్ కేటాయించి, తదనుగుణంగా వీసాలను జారీ చేయాలనే ప్రతిపాదనతో ఆ చరిత్రాత్మక బిల్లును రూపొందించారు. ఈ కొత్త విధానం 2021, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. బ్రిటన్‌లో ఉద్యోగం పొందేందుకు, అక్కడ ఉండేందుకు అనుమతి లభించాలంటే ఈ పాయింట్స్ విధానం ప్రకారం.. కనీసం 70 పాయింట్లు రావాలి. వృత్తిగత నైపుణ్యం, ఇంగ్లీష్ మాట్లాడగలిగే నైపుణ్యం, మంచి వేతనంతో స్థానిక సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ లెటర్.. మొదలైన వాటికి పాయింట్స్ ఉంటాయి.

కరోనాపై దర్యాప్తునకు డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో తీర్మానం
కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మే 18న నిర్వహించిన వర్చువల్ సదస్సులో 27 యూరోపియన్ దేశాలు తీర్మానం ప్రవేశపెట్టాయి. చైనా పేరు ప్రస్తావించకుండా రూపొందించిన ఈ తీర్మానంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతత్వంలో అన్నిదేశాల ప్రాతినిధ్యంతో శాస్త్రీయమైన విచారణ జరగాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మేలైన పద్ధతులు అందుబాటులోకి వస్తాయని ప్రతిపాదించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌లపై ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని 50 దేశాలు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, ఖతార్, రష్యా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో పాల్గొన్నారు. మరోవైపు వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాల తీరుతెన్నులను సమీక్షించాలని దాదాపు 120 దేశాలు ఒక తీర్మానం చేశాయి.

డబ్ల్యూహెచ్‌ఓకు రూ.15 వేల కోట్లు: జిన్‌పింగ్
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు ఇచ్చామని, కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించేందుకు దాదాపు రూ.15 వేల కోట్లిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. విపత్తును ఎదుర్కొనేందుకు రెండేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ విషయమై డబ్ల్యూహెచ్‌ఓ మే 18న నిర్వహించిన వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ ఈ మేరకు వెల్లడించారు. కరోనాపై ప్రపంచం స్పందించిన తీరుపై సమగ్ర దర్యాప్తునకూ చైనా మద్దతిస్తుందని... ఈ విచారణ అనేది శాస్త్రీయపద్ధతిలో జరగాలని ఆయన తెలిపారు. ఈయూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఝావ్ బీజింగ్‌లో చెప్పారు. భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మరోవైపు, కరోనా వైరస్ పుట్టకతోపాటు ఈ అంశంపై ప్రపంచదేశాల స్పందనపై వీలైనంత తొందరగా స్వతంత్ర విచారణ చేపడతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి:డబ్ల్యూహెచ్‌ఓకు రూ.15 వేల కోట్లు
ఎప్పుడు:మే 18
ఎవరు: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
ఎందుకు: కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించేందుకు

కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందనపై దర్యాప్తు
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు ఆ సంస్థ సభ్యులు ఆమోదం తెలిపారు. చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ సక్రమంగా వ్యవహరించలేదని, వైరస్ వ్యాప్తి, వ్యాధి తీవ్రతలపై సమాచారాన్ని ఆలస్యంగా అందించిందని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సదస్సులో మే 19న స్వతంత్ర దర్యాప్తునకు సుమారు 122 సభ్యదేశాలు చేసిన ప్రతిపాదనకు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి:కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు ఆమోదం
ఎప్పుడు: మే 19
ఎవరు: డబ్ల్యూహెచ్‌ఓ సభ్యులు

చైనా నుంచి భారత్‌కు వాన్‌వెలక్స్
కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో చైనా నుంచి దిగ్గజ కంపెనీలు తరలిపోతున్నాయి. తాజాగా వాన్‌వెలక్స్ బ్రాండ్ పేరుతో సౌఖ్యవంతమైన పాదరక్షలు తయారు చేసే జర్మనీకి చెందిన కాసా ఎవర్జ్ జీఎమ్‌బీహెచ్ ఈ జాబితాలో చేరింది. ఏడాదికి 30 లక్షల పాదరక్షల తయారీని ఈ కంపెనీ చైనా నుంచి భారత్‌కు తరలిస్తోంది. ఆరంభంలో ఈ కంపెనీ రూ.110 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నదని లాట్రిక్ ఇండస్ట్రీస్ డెరైక్టర్, సీఈఓ ఆశీష్ జైన్ తెలిపారు. వాన్‌వెలక్స్ బ్రాండ్‌కు భారత్‌లో లెసైన్సీ సంస్థగా లాట్రిక్ ఇండస్ట్రీస్ వ్యవహరిస్తోంది. లాట్రిక్ సంస్థ ఏడాదికి 10 లక్షల పాదరక్షలను కాసా ఎవర్జ్‌కు తయారు చేస్తోంది.
రెండేళ్లలో ఏర్పాటు...: ఏడాదికి 30 లక్షలకు పైగా పాదరక్షలు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రెండేళ్లలో ఏర్పాటు చేయనున్నామని ఆశీష్ జైన్ వెల్లడించారు. పాదరక్షల తయారీలో కార్మికులు, ముడి పదార్థాలు కీలకమన్నారు. ఈ రెండు అంశాల్లో భారత్ ఆకర్షణీయంగా ఉండటంతో చైనా నుంచి భారత్‌కు తన ప్లాంట్‌ను కాసా ఎవర్జ్ కంపెనీ తరలిస్తోందని పేర్కొన్నారు.
80 దేశాల్లో విక్రయాలు...: కాసా ఎవర్జ్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18 ప్లాంట్లు ఉన్నాయి. 12 లెసైన్సీ సంస్థలతో 80 దేశాల్లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో 2019లో ఈ బ్రాండ్ పాదరక్షల విక్రయాలు మొదలయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి:చైనా నుంచి భారత్‌కు వాన్‌వెలక్స్
ఎప్పుడు:మే 19
ఎవరు: కాసా ఎవర్జ్ జీఎమ్‌బీహెచ్
ఎందుకు: కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో

ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కరోనా కేసులు
చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసి ఆరు నెలలైంది. ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య మే 20నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 213 దేశాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో కరోనాతో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజంభిస్తోంది.
భారత్‌లో..
భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసులు 1,06,750కి, మొత్తం మరణాలు 3,303కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 61,149. ఈ వైరస్ బారినపడిన వారిలో 42,298 మంది చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 39.62 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అమెరికాకి తగ్గని కోవిడ్ దడ
కోవిడ్-19తో అమెరికా ఇంకా వణుకుతూనే ఉంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాలదిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది.
రష్యాలో విజృంభణ
ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 కేసుల్లో రష్యా రెండోస్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే మతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. వైరస్ సోకిన వారిలో ఒక్కశాతం మాత్రమే మత్యువాత పడుతున్నారు.
యూకేలో ఎల్ టైప్ వైరస్
యూరప్‌లో కోవిడ్-19 వణికిస్తున్న దేశాల్లో యూకే ప్రధానమైనది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాపై పోరాటం చేసి కోలుకున్నప్పటికీ ఆ దేశంలో కేసుల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదైతే, 35 వేల మంది కంటే ఎక్కువే మృతి చెందారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. మొదట్లో ఎస్ టైప్ వైరస్ స్టెర్యిన్స్ వస్తే, ఇప్పుడు ఎల్ టైప్ స్టెర్యిన్స్ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. ఈ ఎల్ తరహా వైరస్ కేసుల సంఖ్యని త్వరితగతిన పెంచేస్తోంది.
బ్రెజిల్ బెంబేలు
లాటిన్ అమెరికా దేశాల్లోని బ్రెజిల్‌లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి నాలుగో స్థానంలోకి చేరుకుంది. కేసులు 2 లక్షల 70 వేలు దాటితే, 18 వేల మంది వరకు మరణించారు. దేశంలో ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరిగిపోయి ఆస్పత్రి సౌకర్యాలు లేక రోగులకు చికిత్స అందివ్వడమే కష్టంగా మారింది. దీంతో మతుల రేటు 6 శాతం నమోదవుతోంది.

అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మోదీ
Current Affairs
భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో మే 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని దాదాపు అన్ని బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లుంబిని వనం(నేపాల్), మహాబోధి ఆలయం(బోధి గయ, బిహార్), ముల్గంధ కుటి విహార(సారనాథ్, ఉత్తరప్రదేశ్), పరినిర్వాణ స్థూప(కుషినగర్, ఉత్తరప్రదేశ్), అనురాధపుర స్థూప(శ్రీలంక) తదితర పవిత్ర బౌద్ధ ప్రదేశాల్లో జరిగిన ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. సాయం కోరిన ప్రతీ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ప్రయత్నించిందని తెలిపారు. ‘బుద్ధ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక పవిత్ర భావన. స్థల, కాల పరిస్థితులు మారినా ఆయన బోధనలు మనలో ప్రవహిస్తూనే ఉంటాయి’అని కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమం
ఎప్పుడు: మే 7
ఎవరు: భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య
ఎందుకు: కరోనావైరస్ బాధితులు, ఆ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా

ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే వూహాన్ ల్యాబ్ నిర్మాణం
వూహాన్‌లోని పీ4 వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే నిర్మించామని సిబ్బంది మొత్తం అక్కడే శిక్షణ పొందారని మే 7న చైనా వెల్లడించింది. ల్యాబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని, నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిపింది. పెర్ల్ హార్బర్ దాడి కంటే కరోనా వైరస్ దాడి చాలా పెద్దదని ట్రంప్ చెబుతున్నారని, అయితే అమెరికా శత్రువు కరోనా వైరస్ అవుతుంది గానీ చైనా కాదని పేర్కొంది. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థను వ్యతిరేకిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని, వైరస్ పుట్టుకపై పారదర్శకంగానే ఆ సంస్థకు సహకారం అందిస్తున్నామని వివరించింది.
వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్
కరోనా వైరస్ వూహాన్‌లోని పరిశోధనశాల నుంచే విడుదలైందని తమవద్ద ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. సాక్ష్యాలను తాను స్వయంగా చూశానని ‘ఫాక్స్ న్యూస్’తో చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే వూహాన్ ల్యాబ్ నిర్మాణం
ఎప్పుడు: మే 7
ఎవరు: చైనా

సౌదీ అరేబియాలో పన్నులు మూడురెట్లు పెంపు
కరోనా మహమ్మారి ప్రభావం, చమురు ధరలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిత్యావసర వస్తువులపై పన్నులను ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న పన్ను రేట్లను 2020, జూలై నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం మే 11న ప్రకటించింది. పౌరులకు ఇస్తున్న జీవన వ్యయ భత్యాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పలు ప్రాజెక్టులను వాయిదా వేయడంతోపాటు ప్రధాన ప్రాజెక్టులపై వ్యయాన్ని 2600 కోట్ల డాలర్ల మేర తగ్గించినట్లు పేర్కొంది. తాజా నిర్ణయం ద్వారా రూ.1.97 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని సౌదీ సర్కారు భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:నిత్యావసర వస్తువులపై పన్నులు మూడురెట్లు పెంపు
ఎప్పుడు: మే 11
ఎవరు: సౌదీ అరేబియా ప్రభుత్వం
ఎందుకు: కరోనా మహమ్మారి ప్రభావం, చమురు ధరలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో

కొరియాల సరిహద్దుల్లో కాల్పులు
Current Affairs
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత రాజేసే కీలక పరిణామం మే 3న చోటుచేసుకుంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉ.కొరియా సైనికులు తమ సరిహద్దు లోపలి గార్డు పోస్టుపైకి రెండు విడతలుగా తుపాకీ కాల్పులు జరపగా, తాము 20 రౌండ్ల వరకు ‘హెచ్చరిక’కాల్పులు జరిపినట్లు దక్షిణకొరియా బలగాల సంయుక్త అధిపతి వెల్లడించారు. ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. తమ బలగాలు ఉ.కొరియా సరిహద్దు లోపలి నిర్మానుష్య ప్రాంతంపైకి కాల్పులు జరిపినందున ఆ వైపున కూడా నష్టం వాటిల్లేందుకు అవకాశం లేదన్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్‌లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మే1న జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

నామ్ దేశాల నేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో మే 4న ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నామ్ దేశాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్
ఎప్పుడు: మే 4
ఎవరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు: కోవిడ్-19తో పరిస్థితులపై చర్చించేందుకు

12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ తెలిపారు. వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని పేర్కొన్నారు.
ఏడాది చివరికల్లా టీకా
కోవిడ్-19 టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 4న ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
ఎప్పుడు: మే 4
ఎవరు: డాక్టర్ ఆండ్రూ పోలార్డ్
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు

నిమిషానికి 5వేల ప్రకటనలు తొలగింపు
నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 2019లో మొత్తం 270 కోట్ల తప్పుడు ప్రకటనలను (నిమిషానికి 5,000 పైచిలుకు) తొలగించడం లేదా బ్లాక్ చేసినట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అలాగే దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. యూజర్లు.. తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ మే 4న తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఫేస్ మాస్క్‌లు వంటి వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2019లో నిమిషానికి 5వేల ప్రకటనలు తొలగింపు
ఎప్పుడు: మే 4
ఎవరు: గూగుల్
ఎందుకు: నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను

కోవిడ్‌పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ
కరోనా వైరస్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీబాడీ తయారీలో విజయం సాధించారు. ఈ అంశంపై పేటెంట్లు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని, త్వరలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇజ్రాఝెల్ రక్షణ శాఖ మంత్రి నఫ్టాలీ బెన్నెట్ మే 5న తెలిపారు. ఇజ్రాఝెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోవిడ్ టీకా అభివృద్ధి బాధ్యతలు అప్పగించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు సమాచారం.
యూరప్ శాస్త్రవేత్తలు కూడా..
కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని యూరప్ శాస్త్రవేత్తలూ గుర్తించారు. 47డీ11 అని పిలుస్తున్న ఈ యాంటీబాడీ వైరస్ కొమ్మును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. 2003 నాటి సార్స్ వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీల్లో ఒకటైన 47డీ11 తాజా వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని వీరు గుర్తించారు. ఇప్పటివరకూ వైరస్ సోకని వ్యక్తులకు ఈ యాంటీబాడీ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
టీకా తయారీలో ఇటలీ పురోగతి
కరోనా వైరస్ టీకా తయారీలో ఇటలీ గణనీయ ప్రగతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు ఇటలీ ప్రకటించింది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు ‘అరబ్ న్యూస్’ తెలిపింది.

అత్యధికంగా భారత్‌లోనే నిరాశ్రయులు: యూనిసెఫ్
2019 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో సుమారు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) వెల్లడించింది. ఈ మేరకు ‘లాస్ట్ ఎట్ హోమ్’ పేరుతో మే 5న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019లో భారత్ తర్వాత ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో అత్యధికంగా నిరాశ్రయులయ్యారు. 2019లో 50,37,000 మంది భారతీయులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. వీరిలో వీరిలో 50,18,000 మంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా, 19 వేల మంది ఘర్షణలు, హింస కారణంగా నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వివరించింది. మరోవైపు 2019లో ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు. వీరిలో 1.2 కోట్ల మంది చిన్నారులే ఉన్నారు.
2019లో నిరాశ్రయులైన వారు

దేశం

నిరాశ్రయుల సంఖ్య

భారత్

50,37,000

ఫిలిప్పీన్స్

42,70,000

బంగ్లాదేశ్

40,80,000

చైనా

40,03,000

క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యధికంగా భారత్‌లోనే నిరాశ్రయులు
ఎప్పుడు: మే 5
ఎవరు: యూనిసెఫ్

Published date : 23 May 2020 12:45PM

Photo Stories