Skip to main content

Shinkansen Trains: భారత్‌కు రెండు హైస్పీడ్ షింకన్సెన్‌ రైళ్లు

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వేగం పుంజుకుంటోంది.
Japan To Give India Shinkansen Trains For Free For Mumbai-Ahmedabad Bullet Train Testing

భారత్‌లో హైస్పీడ్‌ రైలు ప్రయాణాల కలను సాకారం చేసేందుకు జపాన్‌ వినూత్నమైన మద్దతుతో ముందుకు వస్తోంది. ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం వేగంగా కొనసాగుతున్న ఈ సమయంలో, జపాన్‌ రెండు ఐకానిక్‌ షింకన్సెన్‌ రైళ్లను ట్రయల్ రన్‌ కోసం భారత ప్రభుత్వానికి కానుకగా అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి E5 సిరీస్‌కు, మరొకటి E3 సిరీస్‌కు చెందినవిగా తెలుస్తోంది.

ట్రయల్‌ రన్‌ కోసం శింకన్సెన్‌ రైళ్లు
ఈ రైళ్లను 2026 ప్రారంభంలో భారత్‌కు డెలివరీ చేయనున్నారు. ట్రయల్స్‌ కోసం వీటిని ప్రత్యేకంగా తయారు చేసి, భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. వీటిలో ధూళి, అధిక ఉష్ణోగ్రతల, డ్రైవింగ్‌ పరిస్థితులపై గణనీయమైన డేటాను సేకరించాలనే లక్ష్యం ఉంది. అవసరమైన తనిఖీ పరికరాలు అమర్చిన తర్వాతే భారత్‌కు అప్పగించనున్నారు.

ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ కారిడార్‌
ఈ ప్రాజెక్టు పూర్తయితే, భారతదేశంలో తొలి హైస్పీడ్‌ రైలు మార్గంగా గుర్తింపు పొందనుంది. గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ రైళ్లకు ఉంది. ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (NHSRCL) నిర్మిస్తోంది.

Underwater Train: ముంబై టూ దుబాయ్‌.. రెండు గంటల్లో ప్రయాణం.. సముద్రంలోనే..!

హైస్పీడ్ టెక్నాలజీ & మేక్ ఇన్ ఇండియా
జపాన్‌కు చెందిన షింకన్సెన్‌ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైస్పీడ్ రైల్వే వ్యవస్థ. తాజాగా భారత్ E10 సిరీస్‌ అనే నెక్స్ట్‌ జనరేషన్‌ షింకన్సెన్‌ మోడల్‌ను 2030 నాటికి ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

భారతదేశంలో ఈ రైళ్లను తయారుచేయడానికి ‘మేక్ ఇన్ ఇండియా’ కింద, 2016లో ప్రధాని మోదీ – మాజీ జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, షింకన్సెన్‌ సంబంధిత టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేయనుంది.

భారత్‌లో ఇప్పటికే ఉన్న సెమీ హైస్పీడ్‌ రైళ్లు
ప్రస్తుతం ఆర్‌ఆర్టీఎస్‌, వందే భారత్‌ వంటి సెమీ హైస్పీడ్‌ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే, షింకన్సెన్‌ రైళ్లు వీటికి మించి ఉన్న అధునాతన గమనాన్ని అందిస్తాయి. తొలుత E5 సిరీస్‌ షింకన్సెన్‌ రైళ్లను హైస్పీడ్ కారిడార్‌లో ప్రవేశపెట్టాలనుకున్నా, అధిక ఖర్చులు, జాప్యం వల్ల ఆ ప్రతిపాదనలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ద్వైపాక్షిక సహకారం – రైల్వే రంగంలో మలుపు
జపాన్‌ ఇప్పుడు ముందుకొచ్చి, E10 మోడల్‌ రైళ్లను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రయల్స్‌కు అవసరమైన E5, E3 సిరీస్‌లను ఉచితంగా ఇవ్వనుంది. త్వరలో ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో ఈ ఒప్పందంపై అధికారికంగా సమ్మతం ఇవ్వనున్నట్లు సమాచారం.

3D Printed Train Station: అరుదైన రికార్డు.. 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ నిర్మాణం!

Published date : 19 Apr 2025 01:23PM

Photo Stories