India and Pakistan: ఇండస్ వాటర్ ట్రీటీ (1960) – పూర్తి వివరణ

ఈ ఒప్పందం లక్ష్యం నదీ జలాల న్యాయమైన పంపిణీని నిర్ధారించడం మరియు ఇరుదేశాల మధ్య శాంతియుత సహకారాన్ని ఏర్పరచడమే.
మొహమ్మద్ అయూబ్ ఖాన్ (పాకిస్తాన్), జవహర్లాల్ నెహ్రూ (భారత ప్రధాని) మరియు W.A.B. Iliff (ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి) ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇది 1960, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.
లక్ష్యాలు
- భారత్కు తూర్పు నదుల (Beas, Ravi, Sutlej) నీటి హక్కులు.
- పాకిస్తాన్కు పశ్చిమ నదుల (Indus, Jhelum, Chenab) నీటి హక్కులు.
- ఈ ఒప్పందం, వాదోపవాదాల మధ్య ఉన్నప్పటికీ, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలలో ఎందుకు
కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయం తీసుకున్నది. తుది నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది.
![]() ![]() |
![]() ![]() |
భారత్–పాకిస్తాన్ మధ్య నదీజలాలపై కొనసాగుతున్న వివాదాలు
ప్రపంచంలో అత్యంత స్థిరమైన జలాల పంచాయితీ ఒప్పందాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty – IWT) కూడా వివాదాలకు లోనైంది. గత ఆరు దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా ఈ ఒప్పందం నిరాటంకంగా అమలవుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో డ్యాములు, నీటి వినియోగం, ఒప్పందంలోని నిబంధనల అమలు విషయంలో వివాదాలు ముదురుతున్నాయి.
ప్రధాన వివాదాలు: పశ్చిమ నదులపై హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులు
జమ్మూకశ్మీర్లో జీలం, చినాబ్ నదులపై భారత్ నిర్మిస్తున్న హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒప్పందం ప్రకారం ఈ నదులపై భారత్కు పరిమిత సాగునీటి వినియోగం మరియు జలవిద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఉంది. అయినా, ఈ ప్రాజెక్టులు వివాదాలకు దారితీశాయి:
- కిషన్గంగ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
- రాట్లే హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించి, మధ్యవర్తిత్వ కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. ఒప్పందం ప్రకారం, ఇలాంటి వివాదాల పరిష్కారం కోసం తటస్థ నిపుణుడిని నియమించాలి. దాన్ని అనుసరించి ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ నిపుణుడిని నియమించింది.
ఒప్పంద సవరణలపై భారత్ డిమాండ్
- భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం పునః సమీక్ష అవసరం ఉందని పలుమార్లు డిమాండ్ చేసింది. 1960లో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటి వరకు:
- జనాభా మరియు నీటి అవసరాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి
- పర్యావరణ, భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి
- రాజకీయ, భద్రతాపరమైన అంశాల పరంగా సవాళ్లు పెరిగాయి
ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టంచేస్తోంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఒప్పందంలో ఎలాంటి మార్పులు వద్దని స్థిరంగా చెబుతోంది.
పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయం
తాజాగా పహల్గాం (జమ్మూకశ్మీర్)లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు చేయదని ప్రకటించింది. ఇది భారత్ తీసుకున్న కీలక మరియు కఠిన నిర్ణయంగా భావించబడుతోంది. ఇది ఈ ఒప్పందంపై భారత్ దృఢమైన వైఖరిని సూచిస్తోంది.
ఒకప్పుడు ప్రశాంత జల సహకారానికి నిదర్శనంగా గుర్తింపు పొందిన సింధు ఒప్పందం, ఇప్పుడు జల ప్రాజెక్టులపై వివాదాలు, ఒప్పంద పునఃసమీక్ష డిమాండ్లతో సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్–పాకిస్తాన్ జల దౌత్యం, భవిష్యత్లో ప్రాంతీయ స్థిరత్వం కోసం కీలక పాత్ర పోషించనుంది.