Skip to main content

ఏప్రిల్ 2020 అంతర్జాతీయం

అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం
Current Affairs అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపైఏప్రిల్ 22న సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం
ఎప్పుడు: ఏప్రిల్ 22
ఎవరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం

యూకేలో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు ఏప్రిల్ 23న మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ నేతృత్వంలోని బందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఈమె ‘ఎబోలా’ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. తాజా కార్యక్రమానికి దాదాపు రూ.180 కోట్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది.

కోవిడ్‌పై చైనా, పాక్ ఉమ్మడి ప్రయోగాలు
కోవిడ్-19 టీకాపై ప్రయోగాల నిర్వహణకు సహకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ద్వారా పాక్‌లో కోవిడ్ టీకా ప్రయోగాలు నిర్వహించాలని చైనా సంస్థ సైనోఫార్మ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాక్ అంటోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు
ఎప్పుడు: ఏప్రిల్ 23
ఎవరు: కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు

డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.
చైనాలో 2.32 లక్షల కేసులు
చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
5జీ వల్ల కరోనా సోకదు
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి కొట్టి పారేసింది. మొబైల్ ప్రపంచంలో 5జీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీ ఓ విప్లవం లాంటిది. అయితే ఈ 5జీ టెక్నాలజీ కరోనా వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైరస్ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధికార ప్రతినిధి మోనికా గెనెర్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డబ్ల్యూహెచ్‌వోకు అదనపు గ్రాంట్
ఎప్పుడు: ఏప్రిల్ 23
ఎవరు: చైనా

అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న మూడో దేశంగా భారత్
ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
  • 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ.
  • మొత్తమ్మీద టాప్-5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది.
  • సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి.
  • ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న మూడో దేశంగా భారత్
ఎప్పుడు: ఏప్రిల్ 27
ఎవరు: స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రి)
ఎక్కడ: ప్రపంచంలో

సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మైనర్లకు మరణశిక్ష రద్దు
ఎప్పుడు: ఏప్రిల్ 27
ఎవరు: సౌదీ అరేబియా ప్రభుత్వం

వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకం ఎత్తివేత: డబ్ల్యూటీవో
2020 సంవత్సరానికి వివిధ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల కింద డబ్ల్యూటీవో(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాలు దాదాపు 84 శాతం వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశాయని డబ్ల్యూటీవో తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. తమ వైద్య పరికరాల ఎగుమతుల్లో చైనా 27 శాతం, ఇటలీ దాదాపు 75 శాతం తమతో ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలున్న సభ్య దేశాలకు చేస్తాయని నివేదికలో పేర్కొంది. 1995 నుంచి భారత్ డబ్ల్యూటీవో సభ్య దేశంగా ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం వెంటిలేటర్లు, మాస్క్‌లు తదితర వైద్య ఉపకరణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వైద్య ఉత్పత్తులను ఎగుమతి చేసే టాప్ 10 దేశాలు.. ఏదో ఒక ప్రాంతీయ వాణిజ్య ఒప్పంద పరిధిలోనే ఉన్నాయి.

ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు
దక్షిణాసియాలో కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతోంది. చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని ఏప్రిల్ 28న వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్‌ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు.
యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర..
యువత, శాంతిభద్రతలు అనే అంశంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి అయిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటై మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో పనిలేక తీవ్ర నిరాశ నిస్పహల్లో ఉన్న యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసాధారణ పరిస్థితులున్న ఈ తరుణంలో ఒక తరాన్ని పోగొట్టుకోలేమని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు
ఎప్పుడు: ఏప్రిల్ 28
ఎవరు: యూనిసెఫ్
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతున్నందున

వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మరణాలు
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్ అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మందిని బలితీసుకుంది. అమెరికాలో పదిలక్షలకుపైగా కోవిడ్ కేసులు ఉండగా, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. ఇది ఇరవై ఏళ్లపాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో మొదలైన వియత్నాం యుద్ధం 1975లో ముగియగా 58,220 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. పదిలక్షల కంటే ఎక్కువమంది కరోనా బాధితులున్న తొలిదేశంగానూ అమెరికా ఓ రికార్డు సష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 32 లక్షలకు చేరువలో ఉంది.
నిపుణుల బృందం ఏర్పాటు
లాక్‌డౌన్ ఎత్తివేత ఎలా జరగాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిపుణుల బందాన్ని ఏర్పాటు చేసింది. మాస్టర్‌కార్డ్ సీఈవో, భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా, టండన్ కేపిటల్ అసోసియేట్స్‌కు చెందిన చంద్రిక టండన్, హోటల్స్ అసోసియేషన్ సీఈవో విజయ్ దండపాణిలు ఈ బృందం సభ్యులుగా నియమితులయ్యారు.

30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం: ఐఎల్‌ఓ
కరోనా వైరస్ కారణంగా 2020 ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. లాక్‌డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని పేర్కొంది.. లాక్‌డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
చైనా పార్లమెంట్ సమావేశాలు
కరోనా నేపథ్యంలో రద్దయిన పార్లమెంటు సమావేశాలను 2020, మే 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మూడో సమావేశాలను మార్చిలో నిర్వహించాల్సి ఉండగా కరోనాతో వాయిదాపడ్డాయి. వైరస్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో వీటిని మే 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారిక వార్తా పత్రిక షిన్‌హువా ఒక కథనాన్ని ప్రచురించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020 ఏడాది 30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం
ఎప్పుడు: ఏప్రిల్ 29
ఎవరు: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా

దక్షిణ కొరియాలో అధికార పార్టీ విజయం
Current Affairs
సియోల్: కరోనా కట్టడిలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆధ్వర్యంలో అధికార డెమొక్రాటిక్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్ నేతృత్వంలో లెఫ్ట్ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ యునెటైడ్ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది. 1987 తర్వాత దక్షిణ కొరియాలో ఏ పార్టీకి ఈ స్థాయి విజయం దక్కలేదు. కరోనాని అరికట్టడంలో అధ్యక్షుడు చూపించిన పనితీరుకే ప్రజలు మూన్‌కే మళ్లీ పట్టం కట్టారు.
టీకా ఒక్కటే మార్గం..
కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు.
ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ 2020 ఏడాది ఆఫ్రికా ఖండంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.
దక్షిణాఫ్రికాకు భారత్ సహకారం: మోదీ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తక్షణమే సరఫరా చేస్తామని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో కోవిడ్ మహమ్మారిపై చర్చించినట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్‌సీసీతోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభం గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు.

కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న ప్రకటించారు.
వూహాన్ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా ?
కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది.
ల్యాబ్‌లో భద్రత కరువు?
వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది.
ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు?
వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ
ఎప్పుడు:ఏప్రిల్ 18
ఎవరు:అమెరికా
ఎందుకు: అమెరికా మీడియా కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి

వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్
చైనాలోని వూహాన్‌లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కోవిడ్-19(కరోనా వైరస్) బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డెరైక్టర్ యాన్ జిమింగ్ ఏప్రిల్ 19న మీడియాకి ఇంటర్వూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. మరోవైపు వూహాన్‌లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
కోవిడ్-19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్‌ర నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్‌ఎన్‌ఏ కిట్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది.

అమెరికా విచారణకు చైనా నిరాకరణ
కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని ఏప్రిల్ 20న తెలిపింది. కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. ‘వైరస్ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు.

భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నేపథ్యంలో చైనా సహా పొరుగుదేశాలు ’ఆవకాశవాద టేకోవర్’లకు పాల్పడకుండా భారత్ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధరలు
అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ‘నెగిటివ్’(మైనస్)లోకి జారిపోయాయి. అమెరికాలో నిల్వ సామర్థ్యం లేకపోవడం, కరోనా వైరస్ కల్లోలంతో పలు దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో డిమాండ్ బాగా తగ్గడం, లాక్‌డౌన్ ముగిసి డిమాండ్ ఎప్పుడు పుంజుకుంటుందో స్పష్టత లేకపోవడం, ట్రేడర్లు చమురు డెలివరీలకు ఇష్టపడకపోవడంతో ధరలు ఈ రేంజ్‌లో పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్) ఏప్రిల్ 17న ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 20న ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్‌లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మాత్రం 22.25 బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతోంది. మే, జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధరలు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎక్కడ:అమెరికా మార్కెట్
ఎందుకు: కరోనా వైరస్ కల్లోలంతో

కరోనాతో ఆకలికేకలు రెట్టింపు: ఐరాస
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య కోవిడ్-19 కారణంగా రెట్టింపు కానుందని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక నివేదికను సమర్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక రంగం అంతర్జాతీయంగా ఆకలికేకలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఈ నివేదికలో వెల్లడైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తోంటే, కోవిడ్ ప్రభావంతో 2020 యేడాదికి ఈ సంఖ్య మరో 13 కోట్లు పెరిగి, 26.5 కోట్లకు చేరుతుందని ఆ రిపోర్టు అంచనా వేసింది. 50 దేశాలకు చెందిన 2019 ఏడాది రిపోర్టులను 2020 ఏడాదితో పోల్చి చూస్తే ఆహార సంక్షోభం 12.3 కోట్లకు అంటే పది శాతం పెరిగింది.
158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు ఆటంకం
కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య రెట్టింపు
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం
ఎక్కడ:ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: కోవిడ్-19 కారణంగా

కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ
కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని, ల్యాబ్‌లో వైరస్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అన్నిరకాల ఆధారాలు కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని రుజువు చేస్తున్నాయని ఏప్రిల్ 21న తెలిపింది. కోవిడ్-19 లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసింది. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు కనుగొనాల్సి ఉందని పేర్కొంది.
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌వో వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా జంతువుల నుంచే పుట్టింది
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు: కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో

ఇమిగ్రేషన్ వీసాలపై నిషేధం: ట్రంప్
అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 20న ట్వీట్ చేశారు.
హెచ్1బీ పైనా ప్రభావం
ట్రంప్ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్‌లో ప్రస్తావించినందువల్ల నాన్- ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : అమెరికా డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు

కోవిడ్-19 ఫండ్‌కు పాక్ 3 మిలియన్ డాలర్ల విరాళం
Current Affairs
సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మూడు మిలియన్ డాలర్లు(రూ.22.81కోట్లు) విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నిధులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సార్క్ కార్యదర్శి నియంత్రణలోనే ఉండాలని తెలిపింది. అలాగే, నిధుల వినియోగం విషయంలో అన్ని సభ్యదేశాలను సంప్రదించి.. విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరింది. కరోనాపై పోరుకు సార్క్ దేశాలు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కోవిడ్-19 ఫండ్‌కు 3 మిలియన్ డాలర్ల విరాళం
ఎప్పుడు: ఏప్రిల్ 9
ఎవరు: పాకిస్తాన్ ప్రభుత్వం
ఎందుకు: కరోనాపై పోరుకు

చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు అంగీకారం
రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్, భాగస్వామ్య దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ ఏప్రిల్ 10న వెల్లడించింది. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు తాజా నిర్ణయం తీసుకున్నాయని... ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం.. 2020, జులై వరకు రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు, ఆ తర్వాత నుంచి ఏడాది చివరి వరకు రోజుకు 8 మిలియన్ బ్యారెళ్లు, 2021 ప్రారంభం నుంచి 16 నెలల వరకు రోజుకు 6 మిలియన్ బ్యారెళ్లు చొప్పున ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకారం
ఎప్పుడు: ఏప్రిల్ 10
ఎవరు: ఒపెక్, భాగస్వామ్య దేశాలు
ఎందుకు: చమురు ఉత్పత్తుల డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో

కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత సూచీలో భారత్‌కు అగ్రస్థానం
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికా, బ్రిటన్ తదితర అగ్ర రాజ్యాల కంటే భారత్ ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వపరంగా సన్నద్ధత సూచీలో మన దేశం ఆగ్రస్థానంలో నిలిచిందని ‘ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్ (ఓఎక్స్‌సీ జీఆర్‌టీ) నివేదిక పేర్కొంది. ఆ నివేదికను ఏప్రిల్ 11న విడుదల చేశారు.
నివేదిక ప్రకారం...

  • కరోనా సన్నద్ధత సూచీలో మార్చి 9న 47.6 పాయింట్ల వద్ద ఉన్న భారత్ ఏప్రిల్ 10 నాటికి 100 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
  • స్పెయిన్, ఇటలీ 95.20 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. 80.90పాయింట్లతో జర్మనీ మూడో స్థానం, 71.40 పాయింట్లతో బ్రిటన్ నాలుగో స్థానం, 66.70పాయింట్లతో అమెరికా ఐదో స్థానంలో ఉన్నాయి.

6 దేశాలు.. 33 రోజులు

  • కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ప్రభుత్వాల సన్నద్ధత, తీసుకున్న చర్యలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం జరిపింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
  • వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న మార్చి 9 నుంచి ఏప్రిల్ 10 వరకూ ప్రభుత్వాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు.
  • 12 అంశాల ప్రాతిపదికగా అధ్యయనం చేశారు. ఈ 12 అంశాల్లో లాక్‌డౌన్ అమలు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను చేపట్టడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తక్షణ చర్యలు, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం, వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యవసర నిధుల కేటాయింపు, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వైరస్ సోకినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించడం వంటివి ఉన్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత సూచీలో భారత్‌కు అగ్రస్థానం
ఎప్పుడు: ఏప్రిల్ 11
ఎవరు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా

అమెరికాలో అత్యవసర పరిస్థితి విధింపు
కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్ మతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం ఏప్రిల్ 12న మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది.

అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు
కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ ఏప్రిల్ 11న న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు.

స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు డేంజర్: డబ్ల్యూహెచ్‌వో
స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ కంటే కరోనా వైరస్ 10 రెట్లు అధిక ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా అనేది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని ఏప్రిల్ 13న తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలను ఒకేసారి కాకుండా, దశల వారీగా ఎత్తివేయడమే సరైందని సూచించింది. కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే శక్తివంతమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో చీఫ్ గా టెడ్రోస్ అధనామ్ ఉన్నారు.

డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం: ట్రంప్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 15న వెల్లడించారు. ‘‘కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదు. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఏడాదికి 400 నుంచి 500 మిలియన్ డాలర్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవలం 40 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాలని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమే’’అని ట్రంప్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం
ఎప్పుడు: ఏప్రిల్ 14
ఎవరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: కరోనా వైరస్(కోవిడ్-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని

భారత్ నిర్ణయం భేష్ : డబ్ల్యూహెచ్‌ఓ
లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ‘భారత్‌లో కరోనా కేసులు ఎంతవరకు తగ్గుముఖం పడతాయో ఇప్పట్నుంచో చెప్పలేంగానీ దేశం ఆరువారాల పాటు లాక్‌డౌన్‌లో ఉండడం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తారని, దీని వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చు’అని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజనల్ డెరైక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రాపాల్ సింగ్ ఏప్రిల్ 14న అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తోందని ఆమె కొనియాడారు.

హాకీ చాంపియన్‌షిప్‌లు వాయిదా..
కోవిడ్-19 లాక్‌డౌన్ పొడిగింపుతో హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి జాతీయ చాంపియన్‌షిప్‌లన్నీ నిరవధికంగా వాయిదా వేసింది. ప్లేయర్లు, కోచ్‌లు, నిర్వాహకుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఐ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.

ఏప్రిల్ 24 నుంచి ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
వైరస్‌లు, అంటురోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడే వ్యాక్సిన్ విలువ వెలకట్టలేనిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. ఈ వారోత్సవాల్లో మానవ శరీరాన్ని రోగనిరోధకంగా మార్చేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలను మానవాళికి తెలపాలని సూచించింది. ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్’ నినాదంతో ముందుకెళ్లాలని, ప్రపంచంలో అందుబాటులోకి రావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ప్రజలకు తెలపాలని పిలుపునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
ఎప్పుడు: ఏప్రిల్ 15
ఎవరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని

కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష అమలు
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ షెడ్యూల్ ప్రకటించిన కువైట్.. భారత్‌కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను ఏప్రిల్ 20 నుంచి మొదలుపెట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యవసర క్షమాభిక్ష అమలు
ఎప్పుడు: ఏప్రిల్ 15
ఎవరు: కువైట్ ప్రభుత్వం
ఎక్కడ: కువైట్
ఎందుకు: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని

కరోనా కాలంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికల్లో గతమూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ ప్రబలిన తరువాత ప్రపంచంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం దక్షిణ కొరియానే. కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణాచర్యల మధ్య ఓటింగ్ జరిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతికి గ్లౌజ్ పెట్టుకొని ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి అత్యధికంగా 66.2 శాతం పోలింగ్ నమోదు అయినట్టు జాతీయ ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 15న వెల్లడించింది. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో 300 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా మూన్ జే ఇన్ ఉన్నారు.

భారత్ అనుమతినిచ్చింది: మలేషియా
ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)ను కట్టడి చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు విక్రయించేందుకు భారత్ అంగీకరించిందని మలేషియా మంత్రి కౌముర్దీన్ జాఫర్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 14న మలేషియాకు 89,100 టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతినిచ్చింది. మరిన్ని టాబ్లెట్లు తెప్పించునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. హైడ్రాక్సీక్లోరోక్విన్ లభ్యతపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’అని రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కరోనా కట్టడిలో సత్పలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాల్సిందిగా మలేషియా భారత్‌ను అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్, మాల్దీవులు తదితర దేశాలకు భారత్ ఈ టాబ్లెట్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే.

అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
Current Affairs
కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా చైనాలోని షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసంపై శాశ్వత నిషేధం విధించింది. 2020, మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని షెన్‌జెన్ నగర అధికారులు వెల్లడించారు. ’ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం’ అని ప్రకటించారు. దీంతో పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్‌జెన్ అవతరించింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో 2019, డిసెంబరులో మొట్టమొదట మొట్టమొదట కరోనా వైరస్‌ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్‌జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
ఎప్పుడు: ఏప్రిల్ 2
ఎవరు: షెన్‌జెన్
ఎందుకు: కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా

భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ అత్యవసర సాయం
మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. ఈ మేరకు భారత్ చేసిన అభ్యర్థనపై వరల్డ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న జరిగిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు వరల్డ్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలకు తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. స్కీన్రింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించనున్నారు.
పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు..
అభివద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 నిర్మూలనకు నిధులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియాలో భారత్ తర్వాత.. పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెలల్లో 160 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికలు వేస్తున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేదలను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని పేర్కొంది. భారత్‌లో ఇప్పటివరకు 2500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది చనిపోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం
ఎప్పుడు: ఏప్రిల్ 2
ఎవరు: ప్రపంచ బ్యాంకు
ఎందుకు: మహమ్మారి కరోనాపై పోరుకు

కరోనా కట్టడిపై ఐక్యరాజ్యసమితి తొలిసారి తీర్మానం
కరోనా వైరస్‌పై పోరులో సభ్య దేశాలకు సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేరకు ‘‘కోవిడ్-19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన తీర్మానాన్ని ఐరాస సర్వ ప్రతినిధి సభ ఏప్రిల్ 3న ఆమోదించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్-19పై యూఎన్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. మహమ్మారిపై పోరులో ఆయా ఆదేశాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని ఐరాస అందించనుంది. ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది.
గాలి ద్వారా వ్యాపించదు
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో వెల్లడించింది.
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత: అంతర్జాతీయ కార్మిక సంస్థ
కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని పేర్కొంది.
ఐఎల్‌ఒ నివేదికలోని అంశాలు..

  • అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
  • యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27 శాతం సిబ్బందిని తగ్గించారు.
  • స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది.
  • చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా.
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్టియ్రాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది.
  • థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
ఎప్పుడు: ఏప్రిల్ 4
ఎవరు: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే

జపాన్‌లో అత్యవసర పరిస్థితి విధింపు
కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నెల రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఏప్రిల్ 7న ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చామని తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కరోనాపై పోరుకు 993బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు వివరించారు.

భారత్‌లో కోవిడ్-19 పరీక్షలు విస్తృతంగా జరగాలి
భారత్‌లో కరోనా వ్యాప్తి, తద్వారా సమాజం, ఆర్థిక రంగాలపై పడే ప్రభావంపై కచ్చితంగా ఒక అంచనాకు రావాలంటే కనీసం 10 లక్షల మందికై నా కరోనా పరీక్షలు జరగాలని బ్రిటన్‌కు చెందిన ఏసీఏఎల్‌ఎమ్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కరోనా పరీక్షలు విస్తతంగా జరగాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ సిఫారసు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అత్యవసర పరిస్థితి విధింపు
ఎప్పుడు: ఏప్రిల్ 7
ఎవరు: జపాన్ ప్రధానమంత్రి షింజో అబె
ఎక్కడ : జపాన్
ఎందుకు: కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో

వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత
కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్ నగరంలో 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. కరోనా వైరస్ విజంభణ నేపథ్యంలో వూహాన్‌లో జనవరి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. తాజాగా లాక్‌డౌన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడంతో వూహాన్ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు.

Published date : 06 May 2020 10:02PM

Photo Stories