New Rules From May 1: మే 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్, రైల్వే, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు..!

బ్యాంకు ఖాతా నిబంధనల నుంచి ఏటీఎం లావాదేవీలు, వంటగ్యాస్ ధరల వరకు చాలా విషయాల్లో మార్పులు రానున్నాయి. ఈ కొత్త నియమాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఏటీఎం ఛార్జీల పెంపు
మే 1వ తేదీ నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. బ్యాంకులు అందిస్తున్న ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ప్రతి సారి నగదు ఉపసంహరణ (withdrawal) కోసం వినియోగదారులు రూ.19 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ.17గా ఉంది. అంతేకాకుండా, బ్యాలెన్స్ చెక్ చేసుకునే ప్రతి సారి రూ.7 ఫీజు వసూలు చేయనున్నారు. ఇది గతంలో రూ.6 మాత్రమే ఉండేది. దీని వల్ల ATM వినియోగదారులు మరింత జాగ్రత్తగా లావాదేవీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు
ఇండియన్ రైల్వేలు మే 1వ తేదీ నుంచి టికెట్ బుకింగ్కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కేవలం జనరల్ కోచ్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. స్లీపర్ కోచ్లకు వెయిటింగ్ టికెట్లతో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. అదనంగా, అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు, అంటే ప్రయాణికులు వారి టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇది రైల్వే ప్రయాణ ప్రణాళికలో మార్పులకు దారి తీస్తుంది.
Banks Merged: మే 1వ తేదీ నుంచి ఈ 15 బ్యాంకులు విలీనం
'ఒకే దేశం.. ఒకే ఆర్ఆర్బీ' పథకం అమలు
మే 1 నుంచి దేశంలోని 11 రాష్ట్రాల్లో 'ఒకే దేశం.. ఒకే ఆర్ఆర్బీ' పథకం అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపి ఒక్క పెద్ద ఆర్ఆర్బీగా మారుస్తారు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలవుతుంది. దీని వల్ల బ్యాంకింగ్ సేవల ప్రాప్తత పెరిగి, వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది.
ఎల్పీజీ సిలిండర్ ధరలు
ప్రతి నెల మొదటి తేదీ లాగానే, మే 1న కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలపై సమీక్ష జరగనుంది. ఈ సమీక్ష ఆధారంగా సిలిండర్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. పెరిగితే, వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
ఎఫ్డీ, సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు
మే 1 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు (FD), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లలో మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సార్లు రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో, చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని ప్రభావంగా కొత్త డిపాజిట్లు పెట్టే వారికి తక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉంది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)