ఏప్రిల్ 2020 ఎకానమీ

ఆంక్షలు కొనసాగితే - 0.9 శాతం: సీఐఐ
ఇదిలావుండగా, భారత పారిశ్రామిక వేదిక- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తాజాగా ఒక నివేదిక విడుదల చేస్తూ, లాక్డౌన్ సంబంధిత ఆంక్షలు మరింతకాలం పొడిగిస్తే, 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదవుతుందని పేర్కొంది. అయితే పరిస్థితులు వేగంగా మెరుగుపడితే 1.5 శాతం వృద్ధి నమోదయ్యే వీలుందని అంచనావేసింది.
భారత్లో ఫేస్బుక్ మెసెంజర్ కిడ్స
ఫేస్బుక్ తాజాగా భారత్లో మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్ కిడ్సను ఏప్రిల్ 23న ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్బుక్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21లో భారత్ వృద్ధి 0.8 శాతమే
ఎప్పుడు: ఏప్రిల్ 23
ఎవరు: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- ఫిచ్
ఎందుకు: కోవిడ్-19 ప్రభావాలు, అంతర్జాతీయంగా మాంద్యం వంటి అంశాల కారణంగా
ఆరు డెట్ స్కీమ్లను మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
కరోనా వైరస్ మహమ్మారి.. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్సను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్ 24న తెలిపింది.
మూతబడిన స్కీమ్లు ఇవే...
1. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్
2. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ ఎక్రువల్ ఫండ్
3. ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
4. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కం ప్లాన్
5. ఫ్రాంక్లిన్ ఇండియా అల్టా్ర షార్ట్ బాండ్ ఫండ్
6. ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కం ఆపర్చూనిటీస్ ఫండ్
మ్యూచువల్ ఫండ్స్ కు రూ.50,000 కోట్ల నిధులు
డెట్ మార్కెట్లో నిధుల లేమికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ఏప్రిల్ 27న ప్రకటించింది. డెట్ ఫండ్సకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ప్యాకేజీ ప్రకటించింది. దీంతో ఫండ్స సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది.
90 రోజుల కాల పరిమితితో..
మ్యూచువల్ ఫండ్స్ కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్) కింద ఆర్బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్ ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్డ్ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. 2020, ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స సంస్థల (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్సకు రుణాలను అందించడం, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
గతంలో...
మ్యూచువల్ ఫండ్స్ కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్ బ్రదర్స్ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్లోనూ ఆర్బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మ్యూచువల్ ఫండ్స్ కు రూ.50,000 కోట్ల నిధులు
ఎప్పుడు: ఏప్రిల్ 27
ఎవరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)
ఎందుకు: డెట్ మార్కెట్లో నిధుల కొరతను తగ్గించేందుకు
భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతం లోపే
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం దిగువనకు పడిపోతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్- భారత్ వ్యవహారాల ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనావేశాయి. ఆయా సంస్థల తాజా అంచనాలను పరిశీలిస్తే... భారత్ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతంగా నమోదవుతుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత్కు రూ.10 లక్షల కోట్లు లేదా ఒక వ్యక్తికి తలసరి రూ.7,000 నష్టం జరుగుతుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ఒక్క లాక్డౌన్తో సరిపెట్టుకోకుండా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 29 సంవత్సరాల కనిష్టానికి పడిపోయి, కేవలం 1.9 శాతంగా నమోదవుతుంది. అయితే మే 15వ తేదీ దాటిన తర్వాతా లాక్డౌన్ కొనసాగే పరిస్థితి ఉంటే, ఆర్థిక వ్యవస్థలో అసలు వద్ధిలేకపోగా -2.1 శాతం క్షీణించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు 4.4 నుంచి 6 శాతం వరకూ ఉండవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-2021 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతం లోపే
ఎప్పుడు: ఏప్రిల్ 27
ఎవరు: క్రిసిల్, ఇండియా రేటింగ్స అండ్ రీసెర్చ్
ఎందుకు: కరోనా నేపథ్యంలో
రూ. 68,607 కోట్ల రుణాలు రైటాఫ్: ఆర్బీఐ
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఏప్రిల్ 24న ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2019, సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. ఆ వివరాలను ఆర్బీఐ తాజాగా తెలిపింది.
టాప్-10 ఎగవేతదారులు..
సంస్థ | రూ. కోట్లలో |
గీతాంజలి జెమ్స్ | 5,492 |
ఆర్ఈఐ ఆగ్రో | 4,314 |
విన్సమ్ డైమండ్స్ | 4,076 |
రోటోమాక్ గ్లోబల్ | 2,950 |
కుడోస్ కెమీ | 2,326 |
రుచి సోయా | 2,212 |
జూమ్ డెవలపర్స్ | 2,012 |
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ | 1,943 |
ఫరెవర్ ప్రెషియస్ | 1,962 |
డెక్కన్ క్రానికల్ | 1,915 |
2020లో ఆసియా వృద్ధి జీరో: ఐఎంఎఫ్
కోవిడ్-19 నేపథ్యంలో 2020లో ఆసియా వృద్ధిరేటు ‘జీరో’గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. దాదాపు 60 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇదని పేర్కొంది. అయితే ఆర్థిక క్రియాశీలత విషయంలో ఇతర ఖండాలతో పోల్చితే ఆసియా పరిస్థితి మెరుగ్గానే ఉండే వీలుందని కూడా ఐఎంఎఫ్ పేర్కొంది. ‘‘కోవిడ్-19 మహమ్మారి- ఆసియా-పసిఫిక్ ప్రాంతం’ అన్న శీర్షికతో ఒక బ్లాక్లో ఐఎంఎఫ్ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా వైరస్ ప్రభావం ఆసియాలో తీవ్రంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 1997 ఆసియన్ ఫైనాన్షియల్ సంక్షోభంలో వృద్ధి ఆసియా వృద్ధి 1.3 శాతంగా ఉంటే, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు 4.7 శాతంగా ఉన్న విషయాన్ని ఐఎంఎఫ్ ప్రస్తావించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020లో ఆసియా వృద్ధి జీరో
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు: కోవిడ్-19 నేపథ్యంలో
ఆర్థిక వృద్ధికి ఆర్బీఐ రెండో ప్యాకేజీ
దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకొన్న నెలరోజుల్లోపే ఏప్రిల్ 17న మరో ప్యాకేజీని అందించింది. ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు.
ఎన్పీఏల వర్గీకరణకు 180 రోజులు
రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్డౌన్ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. 2020, మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మారటోరియం వెసులుబాటు ఎన్పీఏలకు దారితీయకూడదని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రివర్స్ రెపో పావు శాతం కోత
రివర్స్ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్మార్క్ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఎల్సీఆర్ కోత
లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్సీఆర్) 100 శాతం నుంచి 80 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఎల్సీఆర్ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. 2020 అక్టోబర్ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, 2021, ఏప్రిల్ 1కి 100 శాతానికి తీసుకొస్తామని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
రాష్ట్రాలకు మరిన్ని నిధులు..
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం 2020, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్.
ఆర్థిక సంస్థలకు మరో రూ.50వేల కోట్లు
జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్హెచ్బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్ అందించనుంది.
వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నగదు
మార్చి 1 - ఏప్రిల్ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల నగదును విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది.
మరికొన్ని నిర్ణయాలు..
- ఎన్బీఎఫ్సీ, మైక్రో ఫైనాన్స్ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం లక్ష్యిత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్బీఐ అందించనుంది.
- అన్ని వాణిజ్య, కో-ఆపరేటివ్ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్ చెల్లింపులు చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని ఆర్బీఐ అంచనా. 2019-20లో 1.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది.
జియోలో ఫేస్బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు
దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్లో భాగమైన జియో ప్లాట్ఫామ్స్లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ ఏప్రిల్ 22న వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్ కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్బుక్కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం.
డీల్ ఇలా..
తాజా ఒప్పందం ప్రకారం జియో ప్లాట్ఫామ్స్.. ఫేస్బుక్కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్లో జియో ప్లాట్ఫామ్స్ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్-ఎక్స్క్లూజివ్ డీల్గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్కు పోటీగా జియోమార్ట్..
తాజా డీల్ సందర్భంగా జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జియో ప్లాట్ఫామ్స్లో 9.99 శాతం వాటాలు కొనుగోలు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్
ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ ఏర్పాటు
కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోవిడ్చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ ఏర్పాటు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు: కేంద్ర కేబినెట్
ఎందుకు: కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం
మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం: ఐఎంఎఫ్ చీఫ్
ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వద్ధి మైనస్లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్లో ఏప్రిల్ 9న జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది’’ అని జార్జీవా పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయి
ఎప్పుడు: ఏప్రిల్ 9
ఎవరు: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా
ఎందుకు: కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణ కారణంగా
50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీ
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్ బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. మరోవైపు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఏప్రిల్ 10 నాటికి 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు.
అమెరికా-చైనా మధ్య మళ్లీ చిచ్చు
కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్ను ఎఫ్సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికా తాజా చర్యలను చైనా వ్యతిరేకించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీ
ఎప్పుడు: ఏప్రిల్ 10
ఎవరు: ఈయూ ఆర్థిక మంత్రులు
ఎక్కడ: యూరోపియన్ యూనియన్
ఎందుకు: కోవిడ్-19 కారణంగా
భారత్కు ఏడీబీ నుంచి రూ.16,500 కోట్లు
కరోనా మహమ్మారిపై పోరుకు భారత్కు తోడ్పాటునందించేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.16,500 కోట్లు (220 కోట్ల డాలర్లు) ప్యాకేజీని ఇవ్వనుంది. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సు అసకవ తెలిపారు. నిర్మలా సీతారామన్తో ఆయన ఏప్రిల్ 10న ఫోన్లో మాట్లాడారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోందని ఆయన ప్రశంసించారు.
ఆరోగ్యరంగానికి తక్షణ సాయం...
భారత అత్యవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఏడీబీ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి తక్షణ సాయంగా రూ.16,500 కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, కరోనా కల్లోలంతో కష్టాలు పడుతున్న పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు, ఆర్థిక రంగానికి కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తక్షణ సాయం, విధానపరమైన రుణాలివ్వడం, బడ్జెట్ తోడ్పాటునందించడం... పలు అంశాలపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్కు తక్షణ సాయంగా రూ.16,500 కోట్ల ప్యాకేజీ
ఎప్పుడు: ఏప్రిల్ 10
ఎవరు: ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు: కరోనా మహమ్మారిపై పోరుకు భారత్కు తోడ్పాటునందించేందుకు
భారత వృద్ధి రేటు 1.5 శాతమే: ప్రపంచ బ్యాంకు
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వద్ధి రేటు గణనీయంగా మందగించనుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2020-21లో ఇది 1.5-2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8-5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21లో భారత వృద్ధి రేటు 1.5-2.8 శాతం స్థాయిలో ఉండొచ్చు
ఎప్పుడు: ఏప్రిల్ 12
ఎవరు: ప్రపంచ బ్యాంకు
ఎందుకు: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో
సభ్య దేశాలకు ఏడీబీ 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
సంక్షోభ సమయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) భారీ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల (1.52 లక్షల కోట్లు సుమారు) సాయాన్ని అందించనుంది. నెల రోజుల క్రితం ప్రకటించిన ప్యాకేజీ కంటే ఇది మూడు రెట్లు అధికం. మార్చి 18న 6.5 బిలియన్ డాలర్లు (రూ.49 వేల కోట్లు) ఇవ్వాలని ప్రతిపాదించగా, పరిస్థితి తీవ్రత దష్ట్యా దానిని మూడింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాల్లో లౌక్డౌన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సంక్షోభ తీవ్రత నేపథ్యంలో సాయాన్ని ఏడీబీ పెంచుతున్నట్టు బ్యాంకు ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా ఏప్రిల్ 13న తన ప్రకటనలో తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఎప్పుడు: ఏప్రిల్ 13
ఎవరు: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను
భారత్ వృద్ధి రేటు 1.9 శాతామే: ఐఎంఎఫ్
కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికే పరిమితమవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది.
అగ్రదేశాల్లో నెగెటివ్ వృద్ధి రేటు..
2020-21 ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతామే
ఎప్పుడు: ఏప్రిల్ 14
ఎవరు: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్
ఎందుకు: కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో
లాక్డౌన్తో రూ.17 లక్షల కోట్లు నష్టం: బార్క్లేస్
దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనావేసింది. తొలి మూడు వారాల లాక్డౌన్ వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్క్లేస్ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్డౌన్ పొడిగింపు వల్ల ఈ అంచనాలను 234.4 బిలియన్ డాలర్లకు పెంచింది. వెరసి 2020 క్యాలెండర్ ఇయర్లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధి రేటు స్వల్పంగా 0.8 శాతం ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్డౌన్ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్ ఇయర్లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసిన బ్రోకరేజ్ సంస్థ, 2020-21లో వృద్ధ్ధి 3.5 శాతం ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ తగ్గించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లాక్డౌన్తో రూ.17 లక్షల కోట్లు నష్టం
ఎప్పుడు: ఏప్రిల్ 14
ఎవరు: బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్
ఎక్కడ: భారత్
ఎందుకు: లాక్డౌన్ వల్ల
ఎస్డీఆర్ఎంఎఫ్ కింద రాష్ట్రాలకు 11 వేల కోట్లు
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎంఎఫ్) కింద రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఎస్డీఆర్ఎంఎఫ్కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ 3న హోంశాఖ పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లునిధులు విడుదల
ఎప్పుడు: ఏప్రిల్ 3
ఎవరు: కేంద్ర హోంశాఖ మంత్రి
ఎందుకు: ఎస్డీఆర్ఎంఎఫ్ కింద
రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల
మహమ్మారి కరోనా వైరస్పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ. 17,287 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3న విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ. 6195 కోట్లు కూడా కలిపి ఉన్నాయి. ఆదాయ లోటు గ్రాంట్ను ఏపీ, అసోం, హిమచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఇక కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్డీఆర్ఎమ్ఎఫ్ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రాష్ట్రాలకు రూ. 17,287 కోట్లు విడుదల
ఎప్పుడు: ఏప్రిల్ 3
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: మహమ్మారి కరోనా వైరస్పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు
30 ఏళ్ల కనిష్టానికి భారత్ వృద్ధి రేటు: ఫిచ్
భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020-21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా 2 శాతానికి తగ్గించింది. లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్పైనా గణనీయంగా ఉండబోతున్నాయని ఏప్రిల్ 3న వివరించింది.
3.6శాతమే: ఇండియా రేటింగ్స్
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ ఇటీవలే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 30 ఏళ్ల కనిష్టానికి భారత్ వృద్ధి రేటు
ఎప్పుడు: ఏప్రిల్ 3
ఎవరు: రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
ఎందుకు: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా
ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం: ఏడీబీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3-4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ (ఏడీవో) నివేదికను విడుదల చేసింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
భారత వృద్ధి రేటు 4 శాతం..
అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏడీబీ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని తెలిపింది. ప్రస్తుతం ఏడీబీ ప్రెసిడెంట్గా మసాత్సుగు అసకావా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం
ఎప్పుడు: ఏప్రిల్ 3
ఎవరు: ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు: కరోనా మహమ్మారి కారణంగా
సిడ్బి నుంచి అత్యవసర రుణాలు
చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. కోటి వరకు మూలధన రుణాలుగా అందిస్తున్నట్టు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ఏప్రిల్ 7న ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా అత్యవసర పరిస్థితులకు స్పందనగా 48 గంటల్లోనే ఈ రుణాన్ని అందిస్తామని, ఇందుకు ఎటువంటి తనఖా లేదా హామీ అవసరం లేదని సిడ్బి తెలిపింది. అలాగే, ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాన్ని రూ.2 కోట్ల వరకు పెంచినట్టు పేర్కొంది.
భారత్ వృద్ధి రేటు 2 శాతమే: ఇక్రా
కరోనా ప్రభావంలో 2020-21లో భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్స అంచనావేసింది. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారత్ జీడీపీలో వద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020-21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది.
కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2-2.5 శాతం లేదా రూ.4-5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి కాకుండా ఆర్బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)ను సవరించాలని గార్గ్ సూచించారు.