Micro Irrigation Scheme: సూక్ష్మ సాగునీటి పథకం కింద సబ్సిడీలు ఖరారు.. ఈ రైతులకు 100 శాతం సబ్సిడీ
Sakshi Education
కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)–పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) స్కీమ్లో భాగంగా అమలు చేస్తోన్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి.

ఈ మేరకు ఫిబ్రవరి 17వ తేదీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు.
- ఎస్సీ, ఎస్టీ యేతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షలు) ఉంటుంది.
- రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షలు) ఇవ్వనున్నారు.
- కోస్తా జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం (రూ.3.10 లక్షలు), 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం (రూ.4 లక్షలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
- ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19 వేలు), 12.5 ఎకరాల్లోపు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా 50 శాతం (రూ.19 వేలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
Published date : 19 Feb 2025 10:23AM