Skip to main content

Mining Reforms: మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో గనుల రంగాన్ని కీలకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సూక్ష్మ ఖనిజాల పాలసీ–2025ను విడుదల చేసింది.
Andhra Pradesh Cabinet Approves Draft Minor Mineral Policy 2025

ఈ కొత్త పాలసీ ద్వారా అధిక ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. గత పాలసీలో ఉన్న పరిమితులను సవరించి, పారదర్శకత, సమర్థత ఆధారంగా ఈ పాలసీ రూపొందించబడింది. ముఖ్యంగా, 2022 మార్చి 13వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు లీజులు మంజూరు చేయనున్నట్లు పేర్కొనడం గమనార్హం.

లీజు విధానం – న్యాయమైన, పారదర్శక మార్గదర్శకాలు
ఈ పాలసీలో భాగంగా, గ్రానైట్, మార్బుల్ వంటి ఖనిజాలు ఉన్న భూములను 30 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వనున్నారు. అలాగే, దరఖాస్తుదారులు 3 నెలల్లోగా యాన్యువల్ డెడ్‌రెంట్ (ADR) చెల్లించాలి. 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ అమలు చేయనున్నారు. ఎవరెవరు ముందుగా దరఖాస్తు చేసారో వారికే ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌’ పద్ధతిలో అవకాశాలు కల్పించనున్నారు. లెటర్ ఆఫ్ ఇండెంట్ (LOI) కేవలం 1 సంవత్సరానికి మాత్రమే వర్తించనుండి, దీనిపై ప్రత్యేక షరతులు వర్తించనున్నాయి.

వేలం విధానానికి బదులు దరఖాస్తు విధానం
గతంలో తీసుకువచ్చిన వేలం విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం కొత్త పాలసీలో దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఇకపై పట్టా, డీకేటీ, అటవీ భూముల్లో మైనర్ మినరల్స్ కోసం లీజులు దరఖాస్తు పద్ధతిలోనే మంజూరవుతాయి. అలాగే, గ్రానైట్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్స్ వంటి నిర్మాణానికి ఉపయోగించే ఖనిజాలు నివాసాలు, మౌలిక వసతుల అవసరాలను తీర్చేందుకు దరఖాస్తు విధానంలో లభిస్తాయి. సిలికా శాండ్, క్వార్ట్జ్, డోలమైట్ వంటి పారిశ్రామిక ఖనిజాలు మాత్రం వేలం విధానంలో ప్రీమియంతో ఇవ్వనున్నారు. అయితే వన్ టైమ్ ప్రీమియం బదులు సీనరేజీ ఫీజు శాతాన్ని ప్రామాణికంగా అమలు చేస్తారు.

Ration Card: రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా.. లేదా..? చెక్ చేసుకోండిలా..

రాష్ట్రవ్యాప్తంగా సీనరేజీ కాంట్రాక్టు విధానం
ప్రస్తుతం ఏడే ఉమ్మడి జిల్లాల్లో అమలులో ఉన్న సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్ విధానాన్ని ఇకపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే విధానాన్ని అమలు చేయడం వల్ల ఆదాయం స్థిరంగా ఉండే అవకాశముంది. కొత్త టెండర్లతో 13 జిల్లాలకు కాంట్రాక్టు సంస్థలు ఎంపిక చేయనున్నారు. ఇకపై ఫీజుల వసూళ్లలో గనుల శాఖ అధికారుల పెత్తనం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

డెడ్‌రెంట్, ఫీజుల తగ్గింపుతో లీజుదారులకు ఊరట
పాత పాలసీలో లీజుదారులపై అధికంగా విధించిన ఫీజుల భారం ఈ పాలసీలో గణనీయంగా తగ్గింది. 10 రెట్ల డెడ్‌రెంట్‌ను 5 రెట్లకు తగ్గించి, 2–3 ఏళ్లలో వాయిదాలుగా చెల్లించుకునే అవకాశం కల్పించారు. లైమ్‌స్టోన్ శ్లాబ్స్పై ప్రీమియంను 3 రెట్ల డెడ్‌రెంట్‌కు తగ్గించారు. ఇక రెన్యువల్స్‌కి సంబంధించి ప్రీమియం 5 రెట్ల నుంచి 1-2 రెట్ల వరకు తగ్గించడం జరిగింది. తప్పులపై విధించే జరిమానాలను కూడా గణనీయంగా తగ్గించారు – 10 రెట్ల నుంచి 2 రెట్లు, 5 రెట్ల నుంచి 1 రెట్టు వరకూ పరిమితి చేశారు.

పరిమితుల లేకుండా అనుమతులు, బదిలీలలో సౌలభ్యం
లీజుదారులు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అనుమతులు పొందేందుకు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ ఏర్పాటుచేస్తారు. లీజును బదిలీ చేయాలంటే ఇప్పటివరకు భారీగా ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల పేరిట బదిలీలపై ఫీజును పూర్తిగా మాఫీ చేశారు.

లీజు కాలంలో గణనీయమైన పెంపు
కొత్త పాలసీలో మైనింగ్ లీజుల కాలపరిమితిని గణనీయంగా పెంచారు. గ్రానైట్‌ లీజు కాలం 20 నుండి 30 ఏళ్లకు, రోడ్ మెటల్‌ యూనిట్ లీజు కాలం 15 నుండి 30 ఏళ్లకు, ఇతర మైనర్ మినరల్స్ లీజు కాలం 5 నుండి 10 ఏళ్లకు పెంచారు. అదేవిధంగా, 2021లో కోవిడ్ ఖర్చుల కోసం వసూలు చేసిన కన్సిడరేషన్ అమౌంట్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై టన్నేజ్ ఆధారిత సీనరేజ్ ఫీజు విధానం అమలులోకి రానుంది.

APSRTC: ఆంధ్రప్రదేశ్‌కి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు.. ఈ న‌గ‌రాల్లోనే..

Published date : 19 Apr 2025 11:15AM

Photo Stories