సరిహద్దుపై ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు: చైనా
Sakshi Education
భారత్-చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను చైనా తిరస్కరించింది.

భారత్-చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ మే 29న మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్-చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ఉద్రిక్తతలపై చర్చించుకోలేదు
తూర్పు లడఖ్లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్-మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్-మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని పేర్కొన్నాయి.
Published date : 30 May 2020 05:58PM