Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 23, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 23rd 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 23rd 2023 Current Affairs

Padma Awards 2023: ఘ‌నంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం..  

పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 106 మందికి జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. మార్చి 22న తొలి విడత ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా పలువురికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందజేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణకు పద్మవిభూషణ్‌ అందజేశారు. కుమార మంగళం బిర్లా (ట్రేడ్‌ ఇండస్ట్రీ), సుమన్‌ కల్యాణ్‌పూర్‌ (ఆర్ట్‌), కపిల్‌ కపూర్‌ (లిటరేచర్, ఎడ్యుకేషన్‌), ధ్యాన గురువు కమలేష్‌ డి పటేల్‌ (ఆధ్యాత్మికం) పద్మభూషణ్‌ అందుకున్నారు. 
పద్మశ్రీ విభాగంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్‌ మోదదుగు విజయగుప్త(సైన్స్, ఇంజనీరింగ్, తెలంగాణ) పుసుపులేటి హనుమంతరావు(చికిత్స పీడియాట్రిక్స్, తెలంగాణ), బండి రామకృష్ణారెడ్డి (లిటరేచర్, ఎడ్యుకేషన్‌–తెలంగాణ), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సమాజసేవ, ఆంధ్రప్రదేశ్‌), చింతపాటి వెంకటపతి రాజు (కళ, ఆంధ్రప్రదేశ్‌), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ, హరికథ– ఆంధ్రప్రదేశ్‌), ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ చంద్ర సూద్‌ (సాహిత్యం– ఆంధ్రప్రదేశ్‌) పద్మశ్రీ అందుకున్నారు. 

Padma Awards 2023 : పద్మ పురస్కారాల పూర్తి జాబితా

Suryakumar Yadav: మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్ పేరిట‌ అత్యంత చెత్త రికార్డు.. 
ఆకాశమే హద్దుగా చెలరేగే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి బంతికే మిస్టర్ 360 సూర్య గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన సూర్య.. అష్టన్ అగర్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు. 

అత్యంత చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన  సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే.  ఇక ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా  సూర్య నిలిచాడు.
అంతకుముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్‌లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్‌ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా అత్యధిక డకౌట్‌లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

ITU Area Office: ఐటీయూ ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్ ప్రారంభం
దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్‌ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను మార్చి 22న‌ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ దేశంలోకి 5జీ సేవలు మొదలైన 6 నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధన మొదలవుతోంది. ఇది భారత ఆత్మవిశ్వాసానికి దర్పణం పడుతోంది. 4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్‌ కేవలం ఒక యూజర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించింది. 

New Districts: రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు

ఇది భారత సాంకేతిక దశాబ్దం 
‘సమ్మిళిత సాంకేతికత వల్లే డిజిటల్‌ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్, ఆధార్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు సాధ్యమయ్యాయి. టెలికం టెక్నాలజీ భారత్‌లో కేవలం శక్తి మాధ్యమం మాత్రమేకాదు సాధికారతకు సోపానం. ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్‌ ఫైబర్‌ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతికదశాబ్దం(టెక్‌ఏడ్‌)’ అని మోదీ అభివర్ణించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

Coronavirus: పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌.. అప్రమత్తతే ముఖ్యమ‌న్న మోదీ 
కరోనా పాజిటివ్, ఇన్‌ఫ్లూయెంజా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ పట్ల అప్రమత్తత అత్యవసరమని ప్రధాని మోదీ సూచించారు. కోవిడ్‌ తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ మార్చి 22న‌ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘కోవిడ్‌ ఇంకా ముగిసిపోలేదు. జన్యుక్రమ విశ్లేషణ కొనసాగించండి. కోవిడ్‌ నిబంధనావళిని తప్పక పాటించండి. తీవ్ర శ్వాస సంబంధ కేసులు, ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌–కోవ్‌2 పరీక్షలు పెంచండి’ అని ఉన్నతాధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో పడకలు, మానవ వనరుల అందుబాటు తదితర సన్నద్ధతలనూ మోదీ సమీక్షించారు. 2020లో జనతా కర్ఫ్యూ పెట్టిన సరిగ్గా మూడేళ్ల తర్వాత అదేరోజు ప్రధాని కోవిడ్‌ సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం. ఎక్కువవుతున్న కోవిడ్‌ కేసులు, కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తే ప్రజారోగ్య వ్యవస్థ ఏ మేరకు సంసిద్ధంగా ఉందనే వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ దేశంలో కోవిడ్‌ తాజా పరిస్థితిపై మోదీకి ఒక ప్రజెంటేషన్‌ చూపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1,134 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

XBB1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌

Bilkis Bano Case: బిల్కిస్‌ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం
గోధ్రా అల్లర్ల బాధితురాలు బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న 11 మందిని ముందస్తుగా విడుదల చేసిన అంశాన్ని విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది. బాధితురాలిని గ్యాంగ్‌రేప్‌ చేసి ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని హత్య చేసిన దోషులకు వర్తింపజేసిన రెమిషన్‌(ముందస్తు విడుదల)ను వ్యతిరేకిస్తూ బిల్కిస్‌ తరఫున శోభా గుప్తా సుప్రీంకోర్టులో మార్చి 22న‌ కేసును వాదించారు. ఈ కేసును  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్ధివాలాల ధర్మాసనం విచారించింది. ‘ఈ అంశాన్ని విచారించేందుకు ప్రత్యేకంగా బెంచ్‌ను ఏర్పాటుచేస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్‌ గుప్తాకు హామీ ఇచ్చారు. 
ఈ కేసును వీలైనంత త్వరగా విచారించాలని ఫిబ్రవరి ఏడో తేదీనే బిల్కిస్‌ న్యాయవాది కోర్టును కోరగా అప్పటి నుంచీ ఈ కేసు కనీసం విచారణకు నోచుకోలేదు. ఫిబ్రవరి 24వ తేదీన విచారణకు వచ్చినా అదే బెంచ్‌లోని జడ్జీలు అనాయాస మరణానికి సంబంధించిన వేరే కేసును విచారించే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉండటంతో ఈ విచారణ వీలుకాలేదు. యావజ్జీవ ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుజరాత్‌ రాష్ట్ర సర్కార్‌ చెప్పడంతో అందుకు అనుమతిస్తూ కోర్టు సమ్మతి తెలపడంతో ఆ ఖైదీలు గత ఏడాది విడుదలయ్యారు.  

Mehul Choksi: మెహుల్‌ చోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ ఎత్తివేత !

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా 
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. మార్చి 22  తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్‌ నుంచి జపాన్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్‌పై రష్యా మిస్సైల్‌ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రాజధాని కీవ్‌ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్‌ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు.
రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్‌స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని మార్చి 22న స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్‌ ప్రధాని కిషిదా ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు చేరుకున్నారు.   

International Criminal Court: పుతిన్‌ను బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా.. అస‌లు పుతిన్‌పై ఉన్న ఆరోపణలేంటి?

Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ విదేశీ నిధులపై ఆరా.. భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ను ప్రశ్నించిన పోలీసులు!
ఖలీస్తాన్‌ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల్ని పంజాబ్‌ పోలీసులు ప్రశ్నించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్, ఆయన తండ్రి తర్సేమ్‌ సింగ్, తల్లిని మార్చి 22న‌ పోలీసులు విచారించారు. అమృత్‌పాల్‌కు అందుతున్న విదేశీ నిధులపై ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 
ఎవరీ కిరణ్‌ దీప్‌ ?  
యూకేలో ఎన్నారై అయిన కిరణ్‌ దీప్‌ కౌర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమృత్‌పాల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన వెంటనే పంజాబ్‌కు వచ్చిన కిరణ్‌దీప్‌ ప్రస్తుతం తమ పూర్వీకుల గ్రామం జల్లూపూర్‌ ఖేదాలో ఉంటున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌ ఆమె స్వగ్రామం. వారిస్‌ పంజాబ్‌ దే వారిస్‌ సంస్థ బాధ్యతల్ని అమృత్‌పాల్‌ తీసుకున్న కొద్ది నెలలకే కిరణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. రివర్స్‌ మైగ్రేషన్‌ జరగాలని, వివిధ దేశాల్లో భారతీయుల్ని తిరిగి మాతృదేశానికి రప్పించడమే తన ధ్యేయమని, అందుకే ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని అమృత్‌పాల్‌ అప్పట్లో చెప్పారు.  అమృత్‌పాల్‌ సింగ్, కిరణ్‌దీప్, ఇతర కుటుంబ సభ్యుల బ్యాంక్‌ అకౌంట్లను పోలీసులు ఇప్పుడు తరచి చూస్తున్నారు. ఆ అకౌంట్లలోకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నారు.  
రూ.35 కోట్ల విదేశీ నిధులు 
అమృత్‌పాల్‌కు విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా  దాదాపుగా రూ.35 కోట్లు అందినట్టుగా ఆయన అనుచరుడు దిల్‌జిత్‌ కల్సిని విచారించగా వెల్లడైంది. ఆ డబ్బులతోనే తనకు, తన అనుచరులకు అమృత్‌పాల్‌ వాహనాలు కొన్నాడు. అక్రమ ఆయుధాలతో పాటు 35 బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కొన్నారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో కూడా అమృత్‌పాల్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు చెబుతున్నారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

Earthquake: పాకిస్తాన్‌ భూకంపంలో.. 12 మంది బలి 
రిక్టర్‌ స్కేల్‌పై 6.8గా నమోదైన భారీ భూకంపం పాకిస్తాన్‌ను వణికించింది. భూప్రకంపనల ధాటికి 12 మంది మరణించారు. అఫ్గాన్‌–పాక్‌ సరిహద్దులోరి ఖైబర్‌ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో 9 మంది, ఇస్లామాబాద్‌లో ఇద్దరు, అబోతాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్‌లో ముగ్గురు మరణించారు. భూకంపం వల్ల అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లో దాదాపు 200 మంది గాయపడ్డారని అధికారులు మార్చి 12న‌ ప్రకటించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

ICC Rankings:  సిరాజ్‌ చేజారిన ‘టాప్‌’ ర్యాంక్‌.. 
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆ్రస్టేలియాతో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్లు తీసిన సిరాజ్, రెండో వన్డేలో మాత్రం 3 ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. ఈ ప్రదర్శనే సిరాజ్‌ ర్యాంక్‌పై ప్రభావం చూపింది. సిరాజ్‌ ఖాతాలో 702 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా పేసర్‌ హాజల్‌వుడ్‌ 713 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌కు చేరుకోగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌) 708 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.   

Mega Textiles Park: తెలంగాణ‌లో టెక్స్‌టైల్‌ పార్కు.. దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు

టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 
అమెరికాలో జూలైలో జరగనున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) టి20 టోర్నీలో పాల్గొనే టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వ్యవహరిస్తాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు ఫ్లెమింగ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. ఫ్లెమింగ్‌ శిక్షణలో సీఎస్‌కే నాలుగుసార్లు   ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఎంఎల్‌సీలో ఆరు జట్లు బరిలో ఉండగా, నాలుగు జట్లను ఐపీఎల్‌ యాజమాన్యాలే కొనుగోలు చేశాయి.   



Top 10 Billionaires: అంబానీ.. టాప్‌–10 సంపన్నుల్లో ఏకైక భారతీయుడు.. 23వ స్థానంలో అదానీ
హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్‌ 10 కుబేరుల్లో భారత్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఒక్కరే చోటు ద‌క్కించుకున్నారు. 82 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్‌ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్‌ సంస్థ హురున్, రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్‌ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్‌ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.  

Reliance Industries: విలువలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నంబర్‌వ‌న్‌
క్షీణతలో బెజోస్‌ టాప్‌.. 
ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్‌ డాలర్లు పడిపోయి 118 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్‌ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్‌ డాలర్ల మేర (రోజుకు రూ.3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల తదనంతర పరిణామాలతో  గౌతమ్‌ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

Published date : 23 Mar 2023 06:28PM

Photo Stories