Daily Current Affairs in Telugu: మార్చి 14, 2023 కరెంట్ అఫైర్స్
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు. తొలిసారి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని, వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు.
► రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
► ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్
► ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు
► జడ్పీ ఛైర్మన్ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
► 137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
► 15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
► ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్
► వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది.
► స్వచ్ఛసర్వేక్షణ్లో ఏపీ ముందంజలో ఉంది
► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు
► గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది
► మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది
► పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది.
► వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు
► పీహెచ్సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు
► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు
► ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక
► వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ
► 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు
► మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
తెలుసుకోండి: Telangana Budget 2023-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023-24
► నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం
► 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ
► జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు
► వైఎస్సార్ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం
► విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్
► విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్ల పంపిణీ
► జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్లు
► 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు
► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్
► జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి
► జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు
► ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు
► కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం
► కడపలో డా.వైఎస్సార్ ఆర్కిటైక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ
► అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం
► 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం
► అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు.
► కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.
► వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం.
► 11.43 శాతం గ్రోత్ రేటును సాధించాం.
► ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.
► మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు.
తెలుసుకోండి: Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్ 2023–24
RRR Natu Natu Song: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఫలితం ఆస్కార్ అవార్డు
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. కావునా ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్లో ప్రతి రోజూ 150 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200 మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు.
ఇక ఈ పాటలో ‘హుక్ స్టెప్’ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. దాదాపు 80 రకాల స్టెప్స్ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్చరణ్లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది.
దాదాపు రూ.15 కోట్లు ఖర్చు..
ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Oscar Awards: ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎంత మందో తెలుసా.. అందుకే ఈ అవార్డులకు అంత క్రేజ్.!
Oscar Winner List 2023: ఆస్కార్ అవార్డుల విజేతల జాబితా ఇదే.. భారత్కు రెండు ఆస్కార్లు
లాస్ ఏంజిల్స్ వేదికగా మార్చి 13న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్తో ‘నాటు నాటు’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’కు చోటు దక్కింది. ‘నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.
ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే..
ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్)
ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్
(ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా
ఫరెవర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2)
బెస్ట్ సౌండ్: టాప్గన్: మ్యావరిక్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్)
H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్..
దేశంలో ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ముగ్గురు మరణించినట్లు సమాచారం. H3N2 వైరస్ కారణంగా హర్యానా, కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు రోగులు మరణించగా, తాజాగా గుజరాత్లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వైరస్తో బాధపడేవారిలో జలుబు, ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు.. అయితే ఆ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వైరస్తో బాధపడుతున్న రోగులకు సకాలంలో వైద్యం అందకపోతే.. బాధితులు ప్రాణాలు కోల్పొయే ప్రమాదం ఉందని, సరైన సమయంలో చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇన్ఫ్లూయెంజా ప్రభావం వీరిపై అధికం..
ఫ్లూ వ్యాక్సిన్ H3N2 వైరస్ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీకా శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది. సీజనల్ ఇన్ ఫ్లూయెంజా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజుల పాటు ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
H3N2 Influenza: హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు.. ఎలా వ్యాపిస్తుంది ?
Influenza Cases: చైనాలో ఇన్ఫ్లూయెంజా పంజా
ఇన్ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చైనాలో వారం రోజుల వ్యవధిలో ఫ్లూ పాజిటివ్ కేసుల రేటు 41.6 శాతం పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మునుపటి వారంతో పోలిస్తే 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు తెలియజేసింది. షాంగ్జీ ప్రావిన్స్లోని జియాన్ నగరంలో ఇన్ఫ్లూయెంజా కేసుల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. హాంకాంగ్ వైరస్గా పిలిచే హెచ్3ఎన్2 వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణాలు సైతం నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గింది.
H3N2 Influenza: కాన్సూర్లో భారీగా H3N2 వైరస్ కేసులు
భారీ సైనిక విన్యాసాలు.. అణుక్షిపణుల ప్రయోగం
కొరియా ద్వీపకల్పం వేడెక్కుతోంది. ఒకవైపు అమెరికా–దక్షిణకొరియా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభం కాగా, వీటిని సవాల్ చేస్తూ జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యమున్న క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దక్షిణకొరియా, అమెరికా సైనిక బలగాలు మార్చి 13 నుంచి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. 2018 తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఉమ్మడి విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే, దక్షిణకొరియా, అమెరికాల చర్యలు తమ దేశ దురాక్రమణకు రిహార్సల్ వంటివని ఆరోపిస్తున్న ఉత్తరకొరియా దీనికి నిరసనగా మార్చి 12న జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులు వ్యూహాత్మక ఆయుధాలని అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ అభివర్ణించింది. దేశ అణు సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని తెలిపింది. ఇవి రెండు గంటలపాటు గాలిలోనే ఉన్నాయని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. అయితే, ఉత్తరకొరియా జలాంతర్గామి నుంచి అణు వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల పరిజ్ఞానాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
‘స్వలింగ వివాహం’పై ధర్మాసనం: సుప్రీం
స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 13న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే.
‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి. ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై మార్చి 13న పార్లమెంట్కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది.
North Korea: చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220
2022 మార్చికి చలామణిలో రూ.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ: కేంద్రం
గత సంవత్సరం మార్చి నెలనాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో చలామణిలో రూ.13 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా గత మార్చికి ఇంతటి భారీ స్థాయికి పెరిగిందని మార్చి 13న లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 ఏడాది మార్చిలో డీజీపీలో 11.6 శాతంగా ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల వాటా 2022 మార్చి 25వ తేదీకల్లా 13.7 శాతానికి పెరిగింది. 2016 మార్చి నెలలో రూ.16.63 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా 2017 మార్చినాటికి కరెన్సీ చలామణి రూ.13.35 లక్షల కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ చలామణిలో ఉన్న కరెన్సీ పెరుగుతూ పోయింది. చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 2018 మార్చికి రూ.18.29 లక్షల కోట్లకు, 2019 మార్చినాటికి రూ.21.36 లక్షల కోట్లకు, 2020 మార్చినాటికి రూ.24.47 లక్షల కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.28.53 లక్షల కోట్లకు, 2022 మార్చి నాటికి రూ.31.33 లక్షల కోట్లకు ఎగబాకింది. నల్ల ధనం చలామణికి చరమగీతం పాడటంతోపాటు డిజిటల్ ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులువేసిందని మంత్రి ఉద్ఘాటించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మనదే.. డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను టీంఇండియా 2-1తో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. స్పిన్తో భారత్కు సిరీస్ విజయాన్నిచ్చిన బౌలింగ్ ద్వయం అశ్విన్, రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది.
మరో మ్యాచ్ మిగిలుంది.. అదే ఫైనల్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి.. డబ్ల్యూటీసీ ఫైనల్. ఇక్కడ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్లో ప్రపంచ టెస్టు చాంపియన్ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్లో 7 నుంచి 11 వరకు లండన్లోని ది ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
• సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్ సిరీస్ విజయం.
• మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్గా కోహ్లి ఘనత.
• భారత్ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. కెరీర్లో 12 టెస్టులు ఆడిన అక్షర్ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్ సవరించాడు.
• టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 37 సిరీస్లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (62 సిరీస్లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా.. జాక్వస్ కలిస్ (61 సిరీస్లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నెం.1 బౌలర్గా అశ్విన్