Daily Current Affairs in Telugu: మార్చి 13, 2023 కరెంట్ అఫైర్స్
Oscar 2023: సత్తా చాటిన 'RRR'.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్
విశ్వ వేదికపై తెలుగు సినిమా 'RRR' సత్తా చాటింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుపొందింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్ను వెనక్కి నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి. కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్, హోల్డ్ మై హాండ్(టాప్ గన్ మార్వెరిక్), టీజ్ ఇస్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు పోటీపడ్డాయి. వేదికపై గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డును అందుకున్నారు.
నాటు నాటు పాట విషయానికి వస్తే..
సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు. హీరోలు రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు స్టెప్టులేశారు. కీరవాణి ట్యూన్ సెట్ చేశారు. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.
Oscar Awards: ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎంత మందో తెలుసా.. అందుకే ఈ అవార్డులకు అంత క్రేజ్.!
Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'
అమెరికా లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో మార్చి 13న (సోమవారం) ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిమ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డు సాధించింది. ఈ మేరకు దర్శకురాలు కార్తీకి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న అవార్డులను అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్కు ఇదే తొలి ఆస్కార్. ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలిమ్ గతేడాది డిసెంబర్లో విడుదలైంది.
తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. ఈ సినిమా డైరక్టర్ కార్తికీ గొన్సాల్వేస్ వయసు 37 సంవత్సరాలు. ఆమె ఈ డాక్యురీమెంటరీ కోసం తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. 42 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది.
Oscar Awards 2023 Winners Details Telugu : అస్కార్ విజేతలు 2023 వీరే..
Oscars 2023: ఒకే సినిమాకు 7 ఆస్కార్ అవార్డులు
95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ హలీవుడ్ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ‘ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్కు వెళ్లిన ఈ సినిమా ఏడు అవార్డులను సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్ యో ఆస్కార్ అందకున్న తొలి ఆసియా మహిళగా నిలిచింది.
ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ సినిమాను డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ రచించి, డైరెక్ట్ చేశారు. మిచెల్ యో మెయిన్ లీడ్ రోల్లో నటించగా.. కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ ప్రధాన పాత్ర పోషించారు. మల్టీవర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
Padma Awards 2023 : ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు..
Professor Mrinalini: కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్గా మృణాళిని
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్గా ప్రొఫెసర్ మృణాళిని ఎన్నికయ్యారు. ఢిల్లీలోని రవీంద్రభవన్లో జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. తెలుగు భాష ఔన్నత్యానికి మృణాళిని చాలాకాలంగా సేవలందిస్తున్నారు. కథకురాలిగా, వ్యాసకర్తగా, పరిశోధకురాలిగా, పాత్రికేయురాలిగా ఆమె పలు కోణాల్లో భాష ఉన్నతి కోసం కృషి చేస్తూ వస్తున్నారు. మృణాళినితోపాటు రచయిత మందలపర్తి కిషోర్ ఆంధ్రప్రదేశ్ పక్షాన, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, కవి, పాత్రికేయుడు ప్రసేన్ తెలంగాణ పక్షాన తెలుగు విభాగం కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కన్వీనర్ పదవి కోసం మృణాళిని, ఎస్వీ సత్యనారాయణ పోటీ పడ్డారు. మృణాళినికి 33 ఓట్లు, సత్యనారాయణకు 28 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమె ఐదు ఓట్ల తేడాతో గెలిచారు. కన్వీనర్గా ఎన్నికైన మృణాళినిని, మిగతా ముగ్గురు మండలి సభ్యులను అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు అభినందించారు. గతంలో ఓ పర్యాయం మృణాళిని తెలుగు విభాగం కౌన్సిల్ సభ్యురాలిగా ఐదేళ్లపాటు పనిచేశారు. తెలుగు విభాగంలో ఆమె తొలి మహిళా కన్వీనర్. ఈ పదవిలో ఆమె ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.
దర్భశయనం శ్రీనివాసాచార్యకు ఇంద్రగంటి పురస్కారం
ప్రముఖకవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పేరిట ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’2022వ సంవత్సరానికిగాను విలక్షణకవి దర్భశయనం శ్రీనివాసాచార్యకు లభించింది. శ్రీకాంత శర్మ తనయుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వగృహంలో మార్చి 12న జరిగిన సభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీనివాసాచార్యను మెమెంటో, శాలువా, రూ.25 వేల నగదుతో సత్కరించారు.
Elon Musk: సొంత పట్టణం నిర్మించనున్న ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ సొంతంగా ఒక పట్టణాన్నే నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆయన కంపెనీలు, అనుబంధ సంస్థలు టెక్సాస్లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆస్టిన్కు సమీపంలోని బస్ట్రోప్ కౌంటీలోసుమారు 3,500 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. స్నెయిల్ బ్రూక్ అనే పేరుతో సొంత పట్టణాన్ని నిర్మించే పనుల్లో ఎలాన్ మస్క్ నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మస్క్కు చెందిన బోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థలకు ఆస్టిన్ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కొత్త పట్టణంలో మార్కెట్ ధర కంటే చౌకగానే ఆఫీసులను ఏర్పాటు చేయనున్నాయి. ఉద్యోగుల నివాసాలు కూడా ఇందులోనే ఉంటాయి. నూతనంగా రూపుదాల్చే స్నెయిల్ బ్రూక్లో 100కు పైగా భవనాలను నిర్మిస్తారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల వంటి ఏర్పాట్లూ ఉంటాయి. టెస్లా ప్రధాన కార్యాలయంతోపాటు తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మారుస్తానని గతంలోనే మస్క్ ప్రకటించారని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం గుర్తు చేసింది.
Elon Musk: మరోసారి నంబర్ 1 స్థానానికి చేరుకున్న మస్క్... అదానీ స్థానం ఎక్కడో తెలుసా..?
Same Sex Marriage: స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే!
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడం అనేది వ్యక్తిగత చట్టాలు, ఆమోదయోగ్యమైన సామాజిక విలువల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తుందని వెల్లడించింది. అందుకే చట్టబద్ధత కల్పించలేమని వివరించింది. స్వలింగ వివాహాలు ముమ్మాటికీ చట్టవిరుద్ధమేనని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 13న విచారణ చేపట్టనుంది. ఐపీసీ సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చినప్పటికీ.. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడాన్ని ప్రాథమిక హక్కుగా పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది. స్త్రీ–పురుషుడి సంబంధాలు, వేర్వేరు వ్యక్తుల నడుమ వ్యక్తిగత అవగాహనతో ఏర్పడే సంబంధాలు చట్టవ్యతిరేకం కాదని అఫిడవిట్లో కేంద్రం వెల్లడించింది.
స్వలింగ సంపర్కుల సహజీవనం నేరం కాదు
ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల నడుమ జరిగిన పెళ్లికి వ్యక్తిగత చట్టాలు లేదా రాజ్యాంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం, గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదని వెల్లడించింది. కానీ, దీన్ని భార్య, భర్త, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్తో పోల్చలేమని కేంద్రం అభిప్రాయపడింది. ఒక వేళ స్వలింగ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే అది ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలను, నోటిఫైడ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వివరించింది.
Tedros Adhanom: కరోనా మూలాల్ని తేల్చాలి.. డబ్ల్యూహెచ్ఓ
కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసెస్ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్ కోవిడ్తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు. కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్లో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకిందని నివేదిక సమర్పించింది.
మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వయిజరీ గ్రూప్ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది.
Zombie Drug: జాంబీ డ్రగ్.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!
Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ జాతికి అంకితం
ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను ప్రధాని మార్చి 12న జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్ఘాట్ రైల్వే సెక్షన్ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
10 లేన్ల ఎక్స్ప్రెస్ రహదారి ప్రారంభం
కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12న ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ITF Women Tennis Tournament: రన్నరప్ అంకితా రైనా
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో భారత నంబర్వన్ అంకితా రైనా రన్నరప్గా నిలిచింది. బెంగళూరులో మార్చి 12న జరిగిన సింగిల్స్ ఫైనల్లో 241వ ర్యాంకర్, 30 ఏళ్ల అంకిత 2 గంటల 19 నిమిషాల్లో 6–0, 4–6, 0–6తో చెక్ రిపబ్లిక్కు చెందిన 15 ఏళ్ల బ్రెండా ఫ్రువిర్తోవా చేతిలో పరాజయం పాలైంది. అంకిత తొలి సెట్ను గెలిచి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
Li Keqiang: చైనా ప్రధానిగా కియాంగ్
చైనా ప్రధానిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత నమ్మకస్తుడైన లీ కియాంగ్ (63) నియమితులయ్యారు. పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) తీసుకున్న ఈ నిర్ణయానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈ మేరకు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. లీ పేరును జిన్పింగ్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం విశేషం. మొత్తం 2,936 మంది ఎన్పీసీ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటేయగా మరో 8 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అనంతరం లీ నియామక ఉత్తర్వులపై జిన్పింగ్ సంతకం చేశారు. ఆ వెంటనే ప్రస్తుత ప్రధాని లీ కీ కియాంగ్ నుంచి లీ బాధ్యతలను స్వీకరించారు. లీకి వ్యాపారవేత్తల పక్షాన నిలుస్తారని పేరుంది. తాజా మాజీ ప్రధాని లీ కి కియాంగ్కు కొన్నేళ్లుగా జిన్పింగ్తో దూరం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు అధ్యక్ష పీఠానికి పోటీదారుగా నిలిచిన ఆయన ప్రధానిగా తన అధికారాలకు జిన్పింగ్ పూర్తిగా కోత పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారు. పదవి నుంచి వైదొలగిన ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
New Air Force One: నయా ఎయిర్ఫోర్స్వన్
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ఫోర్స్వన్ విమానం సరికొత్తగా, సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. ఎయిర్ఫోర్స్వన్గా ప్రస్తుతం 747–200 రకం బోయింగ్లను వాడుతున్నారు. ఇవి 1989–1993 మధ్య అధ్యక్షునిగా చేసిన జార్జి హెచ్.డబ్ల్యూ.బుష్ హయాంవి. వీటి స్థానంలో ఆధునీకరించిన రెండు 747–800 రకం విమానాలను ఎయిర్ఫోర్స్వన్ కోసం బోయింగ్ సంస్థ సిద్ధం చేయనుంది. సరికొత్త హంగులతో తొలి విమానం 2027లో, రెండోది 2028కల్లా అందుతాయి. విమానం వెలుపలి భాగం రంగులను అలాగే ఉంచాలని తాజాగా నిర్ణయించారు. అయితే అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ప్రస్తుత రాబిన్ ఎగ్ బ్లూ బదులుగా బ్లూ, వైట్ రంగులు వాడతారు. సకల సౌకర్యాలు, ప్రపంచంలోనే అత్యంత హెచ్చు భద్రతతో కూడిన ఎయిర్ఫోర్స్వన్ విమానాలను బోయింగ్ సంస్థే తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుత విమానాలను మార్చి కొత్తవి తీసుకోవాలని ట్రంప్ హయాంలోనే నిర్ణయించారు. వాటికి రెడ్–వైట్–బ్లూ రంగులు వేయాలని అప్పట్లో ట్రంప్ ఆదేశించారు. ఇది ఆయన వ్యక్తిగత విమానం డిజైనే! ఈ ముదురు రంగుల వాడకంతో ఖర్చు పెరగడంతోపాటు డెలివరీ ఆలస్యమవుతుందని బోయింగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగు మార్పు వద్దని బైడెన్ నిర్ణయించారు.
Indian-Americans: ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు కీలక పదవులు
మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
North Korea: చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220
Diabetes: ఇలా చేస్తే.. గర్భిణుల్లో మధుమేహానికి చెక్
గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్వెస్టర్న్ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ తెలిపారు. ‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు!
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
Net Direct Tax: పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లు
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మార్చి 11న వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి. ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్తో కలిపి పర్సనల్ ఇన్కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి.
India-Pakistan: ఇకపై కవ్వింపులకు దిగితే.. పాక్తో సమరమే!?
అడవిలోకి రెండు చీతాలు విడుదల
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉన్న చీతాల్లో రెండింటిని అటవీ ప్రాంతంలోకి వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 2022 సెప్టెంబర్లో ఇక్కడికి చేరుకున్న 8 చీతాలను మొదటగా ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలోకి, అనంతరం హంటింగ్ ఎన్క్లోజర్లలోకి తరలించారు. మార్చి 11న మొదట మగ చీతా ఒబన్ను, కొన్ని గంటల తర్వాత ఆషా అనే ఆడ చీతాను అడవిలోకి వదిలామని ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ చెప్పారు. మిగిలిన వాటిని కూడా నిరీ్ణత సమయాల్లో అడవిలోకి విడిచిపెడతామన్నారు. మొన్న ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకువచి్చన విషయం తెలిసిందే.
Manik Saha: రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
PM Vishwakarma Kaushal Samman: పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యం ఇదే..
బడ్జెట్ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11న మాట్లాడారు. వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు. గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యమని చెప్పారు.
సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్ సాయం, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )