Skip to main content

లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి

కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మే 15న వెల్లడించారు. వ్యవసాయ, సాగు అనుబంధ రంగాలకు సంబంధించి రూ. 1.63 లక్షల కోట్లతో పలు కార్యక్రమాలను ఆమె ప్రకటించారు.
Current Affairs

నిత్యావసర వస్తువుల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌
పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి తొలగిస్తూ నిత్యావసర వస్తువుల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని మంత్రి నిర్మల‌ ప్రక‌టించారు. జాతీయ విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహాయిస్తే.. వాటి ధరలు, నిల్వలపై నియంత్రణ ఉండబోదన్నారు. అలాగే, ప్రాసెసింగ్‌ కార్యకలాపాల్లో ఉన్నవారికి, సరఫరా వ్యవస్థలో ఉన్నవారికి, ఎగుమతిదారులకు, కొన్ని నిబంధనలకు లోబడి, ఎలాంటి నిల్వ పరిమితి ఉండబోదన్నారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయకుండా, ధరలను కృత్రిమంగా పెంచకుండా నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ యాక్ట్‌) 1955లో అమల్లోకి తీసుకువచ్చారు.


ఆన్‌లైన్‌లో అమ్మకాలు..

రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా.. అంతర్రాష్ట్ర పరిమితులను తొలగిస్తూ ఒక చట్టాన్ని రూపొందిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లోనూ అమ్మేలా ఈ– ట్రేడింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.


లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్ ఏర్పాటు ‌

లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌)’ని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. పంట చేతికి వచ్చిన తరువాత ఆ వ్యవసాయ ఉత్పత్తులను సమర్థంగా వినియోగించేందుకు ఉద్దేశించిన ఫామ్‌ గేట్, అగ్రిగేషన్‌ తదితర వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ రంగంలోని ప్రాజెక్టులకు ఆ నిధి ద్వారా రుణాలందజేస్తామన్నారు.


నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు..

  • ఔషధ, సేంద్రియ, బలవర్ధక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సుమారు రెండు లక్షల ఎంఎఫ్‌ఈలకు ఆర్థికంగా సాయమందించేందుకు రూ. 10 వేల కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం.
  • రూ. 20 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ను ప్రారంభిస్తున్నాం. సముద్ర, నదీ మత్స్య సంపద అభివృద్ధికి, ఆ రంగంలో సుమారు 55 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, ఎగుమతులను రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది.
  • పశు సంపద సంరక్షణకు రూ. 13,343 కోట్లను కేటాయించాం. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ నివారణకు 100 శాతం టీకా కార్యక్రమం చేపడతాం.
  • రూ. 15 వేల కోట్లతో ఎనిమల్‌ హస్బండరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా డైరీ ప్రాసెసింగ్, పశుదాణా నిర్వహణల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాం.
  • 10 లక్షల హెక్టార్లలో ఔషధ మొక్కలను సాగును ప్రోత్సహించేందుకు రూ. 4 వేల కోట్లను, తేనెటీగల పెంపకం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం.
  • టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకే కాకుండా అన్ని పళ్లు, కూరగాయలకు ‘ఆపరేషన్‌ గ్రీన్స్‌’ను విస్తరించాం. ఇందుకు రూ. 500 కోట్లను అదనంగా కేటాయించాం. ఈ మొత్తాన్ని దిగుబడి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆయా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులో రాయితీ కల్పించేందుకు, అలాగే, కోల్డ్‌ స్టోరేజ్‌లు సహా ఇతర స్టోరేజ్‌ల్లో నిల్వ ఖర్చులో రాయితీకి ఉపయోగించవచ్చు.


క్విక్ రివ్యూ:

ఏమిటి : లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌)’ ఏర్పాటు
ఎప్పుడు : మే 15
ఎవరు : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా

Published date : 16 May 2020 08:39PM

Photo Stories