లిపులేఖ్, కాలాపానీలు మావే: నేపాల్
Sakshi Education
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది.
ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్కు ఆ దేశ కేబినెట్ మే 19న ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఓలీ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘నేపాల్కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం‘ అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్ను డిమాండ్ చేస్తూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. కాలాపానీ, లిపులేఖ్లు తమవేనంటూ 2019, అక్టోబర్లో భారత్ మ్యాప్ విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది.

Published date : 20 May 2020 04:22PM