ఎంఎస్ఎంఈలకు రూ.1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ
Sakshi Education
సాక్షి, అమరావతి : కరోనా విపత్తు వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఊరట కల్పించారు.
వీటికి రూ.1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని మే 22న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాల్లో తొలి విడతగా రూ.450 కోట్లను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. రెండో విడతగా మిగిలిన బకాయిలను జూన్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల్లోని ఎంఎస్ఎంఈల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు 10 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయని.. నిరుద్యోగం పెరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు. మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు రద్దుచేశామని, తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేశామన్నారు. అంతేకాక.. దాదాపు రూ.10 లక్షల వరకు రుణాలను 6-8 శాతం తక్కువ వడ్డీకే ఇస్తామని, ఈ రుణాలపై ఆరు నెలల మారిటోరియమ్ ఉంటుందని కూడా సీఎం వివరించారు. దీంతో.. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడం, విద్యుత్ ఛార్జీల రద్దు నిర్ణయంపై ఎంఎస్ఎంఈల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Published date : 23 May 2020 05:37PM