Skip to main content

ఎంఎస్‌ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు

కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది.
Current Affairs

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ(స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం)కి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 13న వెల్లడించారు.


ఎంఎస్‌ఎంఈలకు రూ. 3
లక్షల కోట్లు
చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది.

ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్...

ఎంఎస్‌ఎంఈల కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది.
వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్‌ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది.

ఎన్‌బీఎఫ్‌సీలకు మొత్తంగా రూ. 75,000
కోట్లు
తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్‌ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్‌ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది.

టీడీఎస్ రేటు 25
శాతం మేర తగ్గింపు
వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌), టీసీఎస్‌ (ట్యాక్స్‌ కలెక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్‌ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.

మంత్రి తెలిపిన ఇత‌ర వివ‌రాలు..
  • డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్‌లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి.
  • భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్‌ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్‌ఎంఈల నిర్వచనం స‌వ‌ర‌ణ‌. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.
  • దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది.
  • పీఎఫ్‌ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు అంటే 2020, ఆగస్టు దాకా కొనసాగింపు.
  • చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి.
  • దాతృత్వ సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, నాన్‌ కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్‌షిప్‌ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్‌ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించ‌నుంది.
Published date : 14 May 2020 07:34PM

Photo Stories