Skip to main content

ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూత

ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్)(72) మే 11న ముంబైలో కన్నుమూశారు.
1947, ఫిబ్రవరి 4న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించిన దేవేశ్వర్ ఐఐటీ ఢిల్లీలో చదివారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ విభాగంలో పట్టా పొందారు. 1968లో ఐటీసీ ఉద్యోగిగా చేరిన ఆయన 1984లో కంపెనీ బోర్డులో చేరారు. 1996లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన తర్వాత గౌరవ చైర్మన్ బాధ్యత చేపట్టారు. ఐటీసీని ఇతర వ్యాపారాల్లో బలమైన కంపెనీగా నిలిపే ప్రణాళికలను దేవేశ్వర్ అమల్లో పెట్టారు. ఫలితంగా ఎఫ్‌ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డు పరిశ్రమల్లోనూ ఐటీసీ బ్రాండ్ అగ్రగామిగా ఎదిగింది. పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, లగ్జరీ, హోటళ్లు, వంటి ఎన్నో వ్యాపార విభాగాలు ఐటీసీ కింద ఉన్నాయి. భారత ప్రభుత్వం కోరిక మేరకు 1991-94 మధ్య కాలంలో ఐటీసీ నుంచి విరామం తీసుకున్న దేవేశ్వర్ ఎయిర్ ఇండియా చైర్మన్ , మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్‌బీఐ సెంట్రల్‌బోర్డు డెరైక్టర్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ సభ్యునిగానూ సేవలు అందించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ప్రపంచంలోనే ఏడో అత్యుత్తమ పనితీరు చూపిన సీఈవోగా దేవేశ్వర్‌ను 2012లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గుర్తించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీ ఛైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : మే 12
ఎవరు : యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్)(72)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 13 May 2019 05:50PM

Photo Stories