Skip to main content

మార్చి 2021 అవార్డ్స్

యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కార విజేత?
Current Affairs
ది ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్, తణుకు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం–2020 లభించింది. చక్కెర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లివ్యవసాయ పరిశోధనా క్షేత్రం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో మార్చి 25న జరిగిన కిసాన్‌ మేళా కార్యక్రమంలో నరేంద్రనాథ్‌ పురస్కారంతో పాటు గోల్డ్‌ మెడల్, మొమెంటోను అందుకున్నారు. ఇంతవరకు నరేంద్రనాథ్‌ 3 రాష్ట్ర అవార్డులు, 1 దక్షిణ భారతదేశ అవార్డు, 3 జాతీయ అవార్డులు, 3 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2020 ఏడాదికిగాను యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కార విజేత?
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ముళ్లపూడి నరేంద్రనాథ్‌
ఎక్కడ : అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా
ఎందుకు : చక్కెర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను

కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అవార్డులను ఏ పేరుతో ప్రకటించారు?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 13 కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో పాలన తీరు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలకు సహాయపడే కార్యక్రమాల అమలు తదితర అంశాలను పరిశీలించి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఏటా అవార్డులు ఇస్తుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్వస్థీకరణ పేరుతో అవార్డులను మార్చి 31న ప్రకటించింది.

పంచాయతీరాజ్‌ దినోత్సవం ఎప్పుడు?
పంచాయత్‌ స్వస్థీకరణ అవార్డుల్లో సాధారణ కేటగిరి జిల్లా స్థాయిలో గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లు అవార్డులను దక్కించుకున్నాయి. మండల స్థాయిలో సదుం (చిత్తూరు జిల్లా), కాకినాడ రూరల్‌ (తూర్పు గోదావరి), పెనుకొండ (అనంతపురం), విజయవాడ రూరల్‌ (కృష్ణా) అవార్డులు సాధించాయి. పంచాయతీ స్థాయిలో రేణిమాకులపల్లె (చిత్తూరు జిల్లా), పెద్ద లాబేడు (విశాఖ), గుళ్లపల్లి (గుంటూరు), వర్కూర్‌ (కర్నూలు) సాధారణ కేటగిరి అవార్డులను దక్కించుకున్నాయి. గ్రామస్థాయిలో ఈ గవర్నెన్స్‌ కేటగిరీలో తడకండ్రిగ, తల్లపాలెం (నెల్లూరు జిల్లా), కొండేపల్లి (ప్రకాశం) అవార్డులను గెల్చుకున్నాయి. ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.

గాంధీ శాంతి బహుమతి–2020ని ఎవరికి ప్రదానం చేయనున్నారు?
Current Affairs
ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి గాను బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌కు ప్రదానం చేయనున్నారు. అలాగే గాంధీ శాంతి బహుమతి–2019ను దివంగత ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ సయీద్‌ అల్‌ సయీద్‌కు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని మార్చి 22న కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఇండియా–ఒమన్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు గల్ఫ్‌ ప్రాంతంలో అహింస, శాంతి కోసం సాగించిన నిర్వరామ కృషిని గుర్తిస్తూ సుల్తాన్‌ ఖబూస్‌కు ఈ బహుమతిని ఇస్తున్నట్లు పేర్కొంది. రెహ్మాన్‌ బంగ్లాదేశీయులకే కాదు భారతీయులకు కూడా ఒక హీరో అని ప్రధాని మోదీ కొనియాడారు.
గాంధీ శాంతి బహుమతి...
భారత జాతిపిత మహాత్మగాంధీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. గాంధీ 125వ జయంతిని పురస్కరించుకొని 1995లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటుచేసింది. గాంధీ అనుసరించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో విశేష మార్పులకు కారణమైన వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దేశం, భాష, లింగం, జాతి తారతమ్యం లేకుండా ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే.
ఎంపిక...
భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ అవార్డు విజేతలను ఎంపిక చేస్తుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 1995లో మొదటిసారిగా ఈ అవార్డును టాంజానియా తొలి అధ్యక్షుడు జూలియస్‌ న్యెరేరేకు ప్రదానం చేశారు. అవార్డు కింద రూ. కోటి నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2019, 2020 ఏడాదికిగాను గాంధీ శాంతి బహుమతి విజేతలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : దివంగత ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ సయీద్‌ అల్‌ సయీద్‌(2019), బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌(2020)
ఎందుకు : గాంధీ అనుసరించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో విశేష మార్పులకు కారణమైనందున

జాతీయ చలన చిత్ర పురస్కారాలు–2019
ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేసింది. 2021, మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహర్షి ఎంపిక కాగా, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలిచింది. రాజు సుందరం(మహర్షి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, నవీన్‌ నూలి(జెర్సీ) ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్‌ (చిత్రం ‘అసురన్‌’) – హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు.
మలయాళ సినిమాకు 11 అవార్డులు...
2019 జాతీయ సినిమా అవార్డుల్లో మలయాళ సినిమాకు మొత్తం 11 పురస్కారాలు దక్కాయి. ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్‌–ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 అవార్డులను మలయాళ సినిమా గెలుచుకుంది.
ఒకటికి రెండు...
67వ చలన చిత్ర అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్‌...’కు 3, మలయాళ ‘హెలెన్‌’కు 2, తమిళ ‘అసురన్‌’, ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్‌’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు వచ్చాయి. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.
అవార్డులు–విజేతలు...
ఉత్తమ చిత్రం: ‘మరక్కర్‌: ది అరేబియ¯న్‌ కడలింటె సింహం’ (మలయాళం)
ఉత్తమ నటుడు: ధనుష్‌ (‘అసుర¯న్‌’), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’),
ఉత్తమ నటి: కంగనా రనౌత్‌ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్‌ ఝాన్సీ, పంగా)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (తమిళ ‘సూపర్‌ డీలక్స్‌’)
ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’)
ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్‌ (తమిళ చిత్రం – ‘కె.డి’)
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరణ్‌ సింగ్‌ చౌహాన్‌(హిందీ ‘బహత్తర్‌ హూరేన్‌’)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’
ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’
ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్‌ (తమిళ చిత్రం ‘విశ్వాసం’)
ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్‌ (హిందీ ‘కేసరి’)
ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్‌ గంగాధరన్‌ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌: విక్రమ్‌ మోర్‌ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: సిద్ధార్థ్‌ ప్రియదర్శన్‌ (మలయాళ ‘మరక్కర్‌: ది అరేబియ¯న్‌’)
ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సుజిత్‌ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్‌...’)
ఉత్తమ తమిళ చిత్రం: ‘అసుర¯న్‌’
ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్‌’
ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’
ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్‌’ (మరాఠీ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’ (తమిళం)

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తెలుగు కవి?
Current Affairs
2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే వార్షిక సాహిత్య అకాడమీ పురస్కారాల వివరాలను అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మార్చి 12న ప్రకటించారు. మొత్తం 20 భాషల్లో కవిత్వానికి సంబంధించి 7 రచనలు, 4 నవలలు, ఐదు సంక్షిప్త కథల పుస్తకాలు, రెండు నాటికలు, స్మృతులు, ఇతిహాస కవిత్వానికి సంబంధించి ఒక్కో రచనకు సాహిత్య పురస్కారాలు దక్కాయి. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో సత్కరిస్తారు.
తెలుగు భాషలో నిఖిలేశ్వర్‌కు...
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్‌కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2015–17 మధ్య ఆయన రాసిన ‘‘అగ్నిశ్వాస’’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారం లభించింది.
ఎండ్లూరి మానసకు యువ పురస్కార్‌...
2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం 18 భాషల్లో రచనలకు యువ పురస్కాలను ప్రకటించింది. 10 కవిత్వ రచనలు, 3 సంక్షిప్త కథల పుస్తకాలు, రెండు వ్యాస సంకలనాలు, ఒక స్మృతి రచన, ఒక విమర్శనాత్మక రచన, ఒక ట్రావెలాగ్‌ రచన ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ‘మిళింద’ సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎండ్లూరి మానసకు యువ పురస్కార్‌–2020 దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందజేస్తారు.
కన్నెగంటి అనసూయకు బాలసాహిత్య పురస్కారం...
2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ... వివిధ భాషల్లో 21 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు బాల సాహిత్య పురస్కారం లభించింది. 2018లో ఆమె రచించిన ‘స్నేహితులు’ అనే 15 సంక్షిప్త కథల సంకలనానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు.
కలం పేరు నిఖిలేశ్వర్‌..
అకాడమీ అవార్డుకు ఎంపికైన నిఖిలేశ్వర్‌ ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ పలు రచనలు, అనువాదాలు చేశారు. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్‌ అనేది ఆయన కలం పేరు. 1938 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని వీరవెల్లిలో ఆయన జన్మించారు. దిగంబర కవిత్వం మూడు కవితా సంపుటాలను వెలువరించిన నిఖిలేశ్వర్‌... మండుతున్న తరం, అగ్నిశ్వాస, ఈనాటికీ, ఎవరిదీ ప్రజాస్వామ్యం వంటి రచనలు చేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు–2020కు ఎంపికైన తెలుగు కవి?
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : నిఖిలేశ్వర్‌(కుంభం యాదవరెడ్డి)
ఎందుకు : అగ్నిశ్వాస కవితా సంపుటిని రచించినందుకుగాను

సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచయిత్రి?
2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి అందుకున్నారు. మార్చి 13న ఢిల్లీలో జరిగిన అనువాద పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబారా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50వేల నగదును అందజేశారు.
ఒక హిజ్రా ఆత్మకథకు...
ఎ.రేవతి ఆంగ్ల రచన ‘ద ట్రూత్‌ అబౌట్‌ మి: ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ (ఆటోబయోగ్రఫీ)’ని ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా సత్యవతి తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద పుస్తకాన్ని అకాడమీ అవార్డుకు ఎంపికచేశారు.
పదో తరగతిలో పాఠ్యాంశంగా...
గుంటూరు జిల్లా కొలుకలూరులో 1938లో జన్మించిన సత్యవతి ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. 1970 లో సాహిత్యరంగంలో ప్రవేశించి ఇప్పటివరకు అనేక రచనలు చేశారు. ఇల్లలకగానే, మంత్రనగరి, సత్యవతి కథలు 2, రాగం భూపాళం సహా పలు రచనలు, అనువాదాలు చేశారు. సత్యవతి రాసిన ‘వాటిజ్‌ మై నేమ్‌’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్‌ హీ కమ్‌ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2019 ఏడాది సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్న రచయిత్రి?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఎ.రేవతి ఆంగ్ల రచన ‘ద ట్రూత్‌ అబౌట్‌ మి: ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ (ఆటోబయోగ్రఫీ)’ని ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా తెలుగులోకి అనువదించినందుకు

శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం కవితను ఎవరు రచించారు?
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌’ సందర్భంగా మార్చి 12న ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్‌కు ఇంగ్లిష్‌లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఎ ట్రావెలర్‌’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది.
మొయిలీ, అరుంధతి కాకుండా నిఖిలేశ్వర్‌(తెలుగు), ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్‌ఎస్‌ భాస్కర్‌(కొంకణి), హరీశ్‌ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్‌ దేవన్‌(మణిపుర్‌), రూప్‌ చంద్‌ హన్స్‌దా(సంతాలి), నందకిషోర్‌(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్‌(సంస్కృతం), హుస్సేన్‌ ఉల్‌ హక్‌(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా(అస్సామీ), దివంగత హిదయ్‌ కౌల్‌ భారతి(కశ్మీరీ), ధరనింధర్‌ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు.

‘గ్రామీ’ అవార్డుల విజేతలు...ఈ సారి ఎక్కువగా వీరికే..
సాధారణంగా గ్రామీ అవార్డుల్లో పురుష గాయకుల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఈసారి మాత్రం గాయనీమణులు సత్తా చాటారు. 63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ పాటిస్తూ కన్నుల పండువగా జరిగింది. మేగన్‌ థీ స్టాలియన్, హ్యారీ స్టైల్స్‌ మొదటిసారిగా గ్రామీని అందుకున్నారు. బెస్ట్‌ మ్యూజిక్‌ వీడియో అవార్డ్‌సహా మొత్తం నాలుగు గ్రామీలను ప్రముఖ గాయని బియాన్స్‌ సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా ఆమె ఖాతాలో 28 గ్రామీ పురస్కారాలు చేరాయి. అత్యధిక గ్రామీ అవార్డులు దక్కించుకున్న గాయనిగా బియాన్స్‌ సరికొత్త రికార్డు సృష్టించారు.
కొన్ని ముఖ్య విభాగాలు..విజేతలు

విభాగం

విజేత

రికార్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌

బిల్లీ ఎలీష్‌ (ఎవ్రీ థింగ్‌ ఐ వాంటెడ్‌)

ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌

టేలర్‌ స్విఫ్ట్‌ (ఫోక్‌ లోర్‌)

సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌

డెర్నెస్ట్‌ ఎమిలీ, టియారా థామర్‌ (ఐ కాంట్‌ బ్రీత్‌)

బెస్ట్‌ పాప్‌ సోలో పెర్ఫార్మెన్స్‌

హ్యారీ స్టైల్స్‌ (వాటర్‌ మెలన్‌)

బెస్ట్‌ పాప్‌ గ్రూప్‌ పెర్ఫార్మెన్స్‌

లేడీ గాగా, అరియానా గ్రాండీ (రెయిన్‌ ఆన్‌ మీ)

బెస్ట్‌ న్యూ ఆర్టిస్టు

మేగన్‌ థీ స్టాలియన్‌

బెస్ట్‌ మ్యూజిక్‌ వీడియో

బియాన్స్‌ (బ్రౌన్‌ స్కిన్‌ గర్ల్‌)

బెస్ట్‌ రాక్‌ సాంగ్‌

బ్రిటనీ హోవార్డ్‌ (స్టే హై)


ఆస్కార్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే...
ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్‌. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్కార్‌ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్‌ల‌ను లండ‌న్‌ లో ప్రియాంక– నిక్‌ జోనాస్‌ దంపతులు 2021 ఆస్కార్‌ నామినేషన్‌ చిత్రాల జాబితాను మార్చి 15వ తేదీన ప్రకటించారు.
భారత్‌ నుంచి...
2018లో వచ్చిన బ్లాక్‌ ఫాంథర్‌ సినిమాతో చాడ్విక్‌ బోస్మాన్‌ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్‌ రేసులో ఉంది. కాగా, బోస్మాన్‌ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్‌ నొలన్‌ దర్శకత్వం వహించిన టెనెట్‌ ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్‌ నుంచి ఆస్కార్‌కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్‌ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్‌–19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి.
2021 ఆస్కార్‌ నామినేషన్లు – పూర్తి జాబితా ఇలా...
ఉత్తమ చిత్రం కేటగిరీ :
  1. ది ఫాదర్‌
  2. జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెసయ్య
  3. మాంక్‌
  4. మినారి
  5. నోమాడ్‌ ల్యాండ్‌
  6. ప్రామిసింగ్‌ యంగ్‌ వుమన్
  7. సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
  8. ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7
ఉత్తమ దర్శకుడు కేటగిరీ :
  1. థామస్‌ వింటర్‌బర్గ్, (అనదర్‌ రౌండ్‌)
  2. డేవిడ్‌ ఫించర్, (మాంక్‌)
  3. లీ ఐజాక్‌ చుంగ్, (మినారి)
  4. క్లోస్‌ జావో, (నోమాడ్లాండ్‌)
  5. ఎమరాల్డ్‌ ఫెన్నెల్, (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
ఉత్తమ నటుడు కేటగిరీ :
  1. రిజ్‌ అహ్మద్, (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)
  2. చాడ్విక్‌ బోస్మాన్, (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
  3. ఆంథోనీ హాప్కిన్, (ది ఫాదర్‌)
  4. గ్యారీ ఓల్డ్మన్, (మాంక్‌)
  5. స్టీవెన్‌ యూన్, (మినారి)
ఉత్తమ నటి కేటగిరీ :
  1. వియోలా డేవిస్, (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
  2. ఆండ్రా డే, (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బిల్లీ హాలిడే)
  3. వెనెస్సా కిర్బీ, (పీసెస్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌)
  4. ఫ్రాన్సిస్‌ మెక్‌డోర్మాండ్, (నోమాడ్‌ల్యాండ్‌)
  5. కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ :
  1. సాచా బారన్‌ కోహెన్, (ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7)
  2. డేనియల్‌ కలుయా, (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెసయ్య)
  3. లెస్లీ ఓడోమ్‌ జూనియర్, (వన్‌ నైట్‌ ఇన్ మయామి)
  4. పాల్‌ రాసి, (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)
  5. లాకీత్‌ స్టాన్ఫీల్డ్, (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెసయ్య)
ఉత్తమ సహాయ నటి కేటగిరీ :
  1. మరియా బకలోవా, (బోరాట్‌ సబ్‌సీక్వెంట్‌ మూవీఫిల్మ్‌)
  2. గ్లెన్‌ క్లోజ్, (హిల్‌బిల్లీ ఎలిజీ)
  3. ఒలివియా కోల్మన్, (ది ఫాదర్‌)
  4. అమండా సెయ్‌ ఫ్రిడ్, (మాంక్‌)
  5. యుహ్‌–జంగ్‌ యూన్, (మినారి)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే కేటగిరీ :
  1. విల్‌ బెర్సన్‌ – షాకా కింగ్, (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెసయ్య)
  2. లీ ఐజాక్‌ చుంగ్, (మినారి)
  3. ఎమరాల్డ్‌ ఫెన్నెల్, (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
  4. డారియస్‌ మార్డర్‌ – అబ్రహం మార్డర్, (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)
  5. ఆరోన్‌ సోర్కిన్, (ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీ :
  1. లవ్‌ అండ్‌ మాన్స్టర్స్‌
  2. మిడ్నైట్‌ స్కై
  3. ములన్‌
  4. ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌
  5. టెనెట్‌
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీ :
  1. ఆన్ వర్డ్‌
  2. ఓవర్‌ ద మూన్
  3. ఎ షాన్‌ ది షీప్‌ మూవీ: ఫార్మగెడాన్‌
  4. సౌల్‌
  5. వోల్ఫ్‌ వాకర్స్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
ఆస్కార్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన చిత్రాలు
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : లండన్
ఎందుకు : చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు

ఇండియన్‌ సిమెంట్‌ రివ్యూ అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ (నాగార్జున సిమెంట్‌) తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ సిమెంట్‌ రివ్యూ పురస్కారాన్ని గెలుచుకుంది. దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సిమెంటు కంపెనీ (స్మాల్‌ విభాగం)గా అవార్డును కైవసం చేసుకుంది. ముంబైలో మార్చి 17న వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ కె. రవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గడిచిన ఆరేళ్లుగా ఆర్థిక పనితీరు, వృద్ధి తదితర అంశాల ప్రాతిపదికన ఎన్‌సీఎల్‌ ఈ అవార్డును దక్కించుకుంది.
ఐసీడీఆర్‌ఐ–2021లో ప్రధాని మోదీ...
డిజాస్టర్‌ రిసైలియెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే అంశంపై మార్చి 17న జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్‌ఐ–2021) ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సిమెంటు కంపెనీ (స్మాల్‌ విభాగం)గా ఇండియన్‌ సిమెంట్‌ రివ్యూ పురస్కారాన్ని గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ (నాగార్జున సిమెంట్‌)
ఎందుకు : ఆర్థిక పనితీరు, వృద్ధిలో ఉత్తమ ప్రతిభ కనబరినందుకు

గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పురస్కారానికి ఎంపికైన గవర్నర్‌?
Current Affairs
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకుగాను తమిళిసైను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యూఎస్‌ కాంగ్రెస్‌ మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది. తమిళిసైతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవ పురస్కారం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్‌ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా 2021, మార్చి 7న అమెరికా నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
ఎందుకు : సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకుగాను

సెరావీక్‌ గ్లోబల్‌ ఎనర్జీ అవార్డును ఏ దేశ ప్రధానికి ప్రదానం చేశారు?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంబ్రిడ్జ్‌ ఎనర్జీ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ వీక్‌ (సెరావీక్‌) గ్లోబల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డు–2021 వరించింది. ఇంధన సుస్థిరత, పర్యావరణానికి సంబంధించిన నిబద్ధతకు గుర్తింపుగా మోదీకి ఈ అవార్డు దక్కింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సెరావీక్‌ సదస్సు–2021లో భాగంగా మార్చి 5న మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు.
2016 నుంచి...
ప్రపంచ ఇంధన, పర్యావరణ రంగాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న సవాళ్లకు పరిష్కారాలు, అనువైన విధానాల అమలుకు కృషి చేసే నాయకులకు 2016 నుంచి సెరావీక్‌ ఈ అవార్డును అందజేస్తోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సెరావీక్‌ గ్లోబల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డు–2021 విజేత?
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్‌ విధానంలో
ఎందుకు : ప్రపంచ ఇంధన, పర్యావరణ రంగాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న సవాళ్లకు పరిష్కారాలు, అనువైన విధానాల అమలుకు కృషి చేస్తున్నందుకు

పవర్‌ విమెన్‌ అవార్డు అందుకున్న మహిళ?

క్లిమామ్‌ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డిని ‘పవర్‌ విమెన్‌’అవార్డు వరించింది. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కగేరి, పరిశ్రమలశాఖ మంత్రి జగదీశ్‌ షెట్టార్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని టౌన్‌హాల్‌లో లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
కలాం ఆధ్వర్యంలో...
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డులు అందజేస్తోంది. ఆవుల సంరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం కోసం దివ్యారెడ్డి అయిదేళ్ల క్రితం హైదరాబాద్‌లో క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫార్మస్‌ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు పలు సేవలను అందిస్తున్నారు.
గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా పుస్తకావిష్కరణ...
మహిళా ఐఎఫ్‌ఎస్‌ అధికారుల వివరాలతో కూడిన ‘గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా – నేషన్స్‌ ప్రైడ్‌’అనే పుస్తకాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఢిల్లీలో వర్చువల్‌ విధానం ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పవర్‌ విమెన్‌ అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : క్లిమామ్‌ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు పలు సేవలు చేస్తున్నందుకు

ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు విజేత

భారత చెస్‌ స్టార్, ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. బీబీసీ వార్షిక అవార్డుల్లో హంపి ‘ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్, స్ప్రింటర్‌ ద్యుతీ చంద్, షూటర్‌ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. అభిమానుల ఓటింగ్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. అవార్డుల ప్రకటన కార్యక్రమాన్ని మార్చి 8న ‘వర్చువల్‌’గా బీబీసీ నిర్వహించింది.
అంజూకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌...
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్‌ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు... షూటర్‌ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించాయి.
2019లో ప్రారంభం...
భారత క్రీడారంగంలోని అత్యుత్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019 ఏడాదిలో వార్షిక అవార్డులను బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కోనేరు హంపి
ఎందుకు : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు

ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన రాష్ట్రం?
Current Affairs
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికైంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌.... స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తరపున ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్‌కు స్కోచ్‌ అవార్డును అందజేశారు. 2016లోనూ కేటీఆర్‌ ఈ అవార్డును అందుకున్నారు. దీంతో స్కోచ్‌ అవార్డును రెండు సార్లు అందుకున్న మంత్రిగా కేటీఆర్‌ నిలిచారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్కోచ్‌: ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన రాష్ట్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకుగాను

సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికైన 14వ పండితుడు?
సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు విశిష్ట పండితుడు, రచయిత, అనువాదకులు ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన... సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ 92వ సమావేశంలో వేల్చేరు పేరును ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఫిబ్రవరి 26న తెలిపారు. దీంతో గౌరవ ఫెలోషిప్‌కు ఎన్నికైన 14వ పండితుడిగా వేల్చేరు గుర్తింపు పొందారు.
ఏలూరు టు అమెరికా...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన వేల్చేరు నారాయణరావు 1933లో శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఏలూరు సీఆర్‌ఆర్‌లోనే అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు.
దక్షిణ భారత సాహిత్యాన్ని...
వేల్చేరు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. దక్షిణ భారత సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రాసిన కొన్ని ఆంగ్ల పుస్తకాలు...
  • గరల్స్‌ ఫర్‌ సేల్‌ : కన్యాశుల్కం
  • ఏ ప్లే ఫ్రమ్‌ కొలొనియల్‌ ఇండియా
  • గాడ్‌ ఆన్‌ హిల్‌ : టెంపుల్‌ సాంగ్స్‌ ఫ్రమ్‌ తిరుపతి
  • టెక్స్చర్స్‌ ఆఫ్‌ టైమ్‌ : రైటింగ్‌ హిస్టరీ ఇన్‌ సౌత్‌ ఇండియా
  • హైబిస్కస్‌ ఆన్‌ ది లేక్‌ : ట్వంటీయత్‌ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రమ్‌ ఇండియా
రామానుజన్‌ బహుమతి...
జెరూసలేంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఆఫ్‌ హిబ్రూ యూనివర్సిటీలో, మాడిసన్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హ్యుమానిటీస్‌లో ఫెలోగా వేల్చేరు ఉన్నారు. అనువాద రచనలకుగాను ఆయన ఏకే రామానుజన్‌ బహుమతి అందుకున్నారు.

సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ అంటే?
దేశంలోని ఉద్ధండ సాహితీవేత్తలను మాత్రమే సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికచేస్తారు. ఈ పురస్కారాలు ప్రకటించే ప్రతీసారి ఇరవై మంది లేదా అంతకు తక్కువ మందిని ఎంపిక చేస్తారు. 1968 నుంచి 2018 వరకు సుమారు వంద మంది వరకు ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
సాహిత్య అకాడమీ అవార్డు అంటే?
దేశంలోని సాహితీవేత్తలు రచించిన అత్యుత్తమ రచనలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశంలోని 24 ప్రధాన భాషల్లో మాత్రమే రచనలై ఉండాలి.
గౌరవ ఫెలోషిప్‌లు ఎవరికి ఇస్తారు?
ఇది సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత పురస్కారం. భారత పౌరులు కాని వారిని మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫెలోషిప్‌కు ఇప్పటివరకు 14 మంది ఎంపికయ్యారు. వారు...
1) కట్సూర కోగ (2015)
2) ప్రొ.కిమ్‌యాంగ్‌ షిక్‌ (2014)
3) డా. జిన్‌ దిన్‌ హాన్‌ (2014)
4) డా. అభిమన్యు ఉన్నుత్‌ (2013)
5) సర్‌ విఎస్‌ నైపాల్‌ (2010)
6) ప్రొ. ఆర్‌ఈ ఆషెర్‌ (2007)
7) డా.వాస్సిలిస్‌ విట్సాక్సిస్‌ (2002)
8) ప్రొ. ఇ.పి. చెలిషెవ్‌ (2002)
9) ప్రొ. ఎడ్వర్డ్‌ సి. డిమొక్‌ (1996)
10) ప్రొ. డేనియల్‌ హెచ్‌హెచ్‌ ఇంగాల్స్‌ (1996)
11) ప్రొ. కామిల్‌ వి.జ్వెలెబిల్‌ (1996)
12) ప్రొ.జి జియాంగ్‌ లిన్‌ (1996)
13) లియోపోల్డ్‌ సేదర్‌ సెన్‌ఘర్‌ (1974)
14) వేల్చేరు నారాయణరావు(2021)
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు ఎంపికైన 14వ పండితుడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : వేల్చేరు నారాయణరావు
ఎందుకు : సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్నందున

ఏపీ పోలీస్‌ శాఖకు డిజిటల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు
దేశంలో అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ‘డిజిటల్‌ టెక్నాలజీ సభ గ్రూప్‌’ ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ తన సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 12 అవార్డులను ప్రకటించగా అందులో నాలుగింటిని గెలుచుకుంది. ఏపీ పోలీస్‌ శాఖ నిర్వహిస్తున్న దిశ మొబైల్‌ అప్లికేషన్, దిశ క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్, సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టమ్, 4ఎస్‌4యు యూట్యూబ్‌ చానెల్‌కు ఈ నాలుగు అవార్డులు దక్కాయి. వెబినార్‌ ద్వారా ఫిబ్రవరి 27న నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అవార్డులను అందుకున్నారు.
లాకప్‌ మానిటరింగ్‌లో అగ్రస్థానం...
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ‘సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం, మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు.

ఆర్‌జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ అవార్డు
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐ ఏ) ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ అవార్డు లభించింది. ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా ఆర్‌జీఐఏకు.... అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఈ అవార్డును అందజేసింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఆర్‌జీఐఏ నిలిచింది.
తూర్పు నౌకాదళాధిపతిగా అజేంద్ర...
తూర్పు నౌకాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌(ఏబీ సింగ్‌) నియమితులయ్యారు. వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ నుంచి ఏబీ సింగ్‌ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన స్థావరం ఐఎన్‌ఎస్‌ సర్కార్‌ మైదానంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐ ఏ)
ఎక్కడ : ఆసియా–çపసిఫిక్‌ ప్రాంతం
ఎందుకు : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు

ప్రపంచానికి పరిచయమైన తొలి కంప్యూటర్‌ పేరు?
ప్రపంచంలోని తొలి కంప్యూటర్‌ పేరు... ఎలక్ట్రానిక్‌ న్యూమరికల్‌ ఇంటిగ్రేటర్‌ అండ్‌ కంప్యూటర్‌(ఇనియాక్‌). 1946 ఫిబ్రవరి 15న తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో 1943లో ఇనియాక్‌ నిర్మాణం మొదలైంది. ‘ప్రాజెక్ట్‌ పీఎక్స్‌’ పేరుతో అమెరికన్‌ మిలటరీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని తయారీని చేపట్టాయి. డాక్టర్‌ జాన్‌ డబ్ల్యూ మాచ్లీ, జే.ప్రెస్పర్‌ ఎకర్ట్‌ జూనియర్‌ల ఆధ్వర్యంలో సిద్ధమైంది.
ఇనియాక్‌ విశేషాలు
  • బరువు: 27 టన్నులు
  • ఆక్రమించే స్థలం 1800 చదరపు అడుగులు
  • తయారీకైన ఖర్చు ఈ రోజు(2021, మార్చి 1) విలువలో దాదాపు రూ.53 కోట్లు.
  • ఇది మనకు పరిచయమై 75 ఏళ్లు అవుతోంది.
  • ఎనభై అడుగుల పొడవులో యూ ఆకారంలో తయారైన ఇనియాక్‌లో మొత్తం 18,800 రేడియోవాల్వ్‌లు, వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లు ఉండేవి.
  • క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్‌ ప్రధాన లక్ష్యం.
  • ఇనియాక్‌ పనిచేసేందుకు ఏకంగా 150 కిలోవాట్స్‌/గంటల విద్యుత్తు అవసరమయ్యేది.
  • కే మెక్‌నల్టీ, బెట్టీ జెన్నింగ్స్, బెట్టీ స్నైడర్, మార్లిన్‌ వెస్కాఫ్, ఫ్రాన్‌ బిలాస్, రూథ్‌ లిచెటర్‌మ్యాన్‌ అనే మహిళలు దీనికి ప్రోగ్రామింగ్‌ను చేసేవారు. ప్రపంచంలోనే తొలి ప్రోగ్రామర్లు వీరే.
  • ప్రస్తుతం ఇనియాక్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు లండన్‌లోని స్మిత్‌సోనియన్‌ సైన్స్‌ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు.
Published date : 14 Apr 2021 02:13PM

Photo Stories