పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తక్షణమే భర్తీ చేయండి: టీఎస్ ప్రభుత్వం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉన్నందున..దానికి తగ్గట్టుగా పోస్టులను నియమించాలని స్పష్టం చేసింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఎం.రఘునందన్రావు..జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఖాళీలను గుర్తించి రాతపరీక్షల ద్వారా వీరిని ఎంపిక చేయాలన్నారు. ఆదర్శ గ్రామాలుగా మలచడంలో కార్యదర్శుల పాత్ర కీలకం గనుక ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మరోవైపు జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో పోస్టులను అడ్హక్ ప్రాతిపదికన భర్తీ చేసినందున.. క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకాలను చేపట్టాలని సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12వేల పైచిలుకు గ్రామ పంచా యతీలుండగా..ఇందులో దాదాపు 2వేల మేర పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీల ప్రక్రియ పూర్తిచేయకుండా కొత్త నియామకాలు చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్శాఖలో 15 ఏళ్లుగా బదిలీల ప్రక్రియ చేపట్టలేదని, కనీసం ఇప్పుడైనా బదిలీలు చేసి పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
Published date : 22 May 2020 02:37PM