జూలై/ఆగస్టులో ‘ఉమ్మడి ప్రవేశ పరీక్షలు’ !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలను జూలై 6 నుంచి నిర్వహించేలా ప్రతిపాదించిన విద్యాశాఖ అధికారులు.. ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణపైనా కసరత్తు చేస్తున్నారు.

ఒక్కొక్కటిగా వీటిని జూలై, ఆగస్టుల్లో పూర్తి చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జూలై 4న ఈసెట్ పరీక్షను నిర్వహించేలా ప్రతిపాదించారు. మరోవైపు ఐసెట్, ఎడ్సెట్, పీఈసెట్, పీజీఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలను జూలై, ఆగస్టుల్లో నిర్వహించి, ఆగస్టు నెలాఖరు నాటికి ప్రవేశాలను చేపట్టి, మొదటి దశ కౌన్సెలింగ్ను పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యార్థులకు తరగతులను (కొత్త విద్యా సంవత్సరం) ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్లోనే సెట్స్ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు భావించినా అది సాధ్యం అవుతుందో లేదోనన్న అనుమానంతో జూలైలో నిర్వహణకు ప్రతిపాదించారు. వీటన్నింటిపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి, అధికారిక ప్రకటన చేయనున్నారు.
Published date : 14 May 2020 05:46PM