జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు మరో అవకాశం ఇదే..
Sakshi Education
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నించి, కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఆ యోచనను విరమించుకున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్చార్డీ) తెలిపింది.

‘విదేశాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకునేందుకు ఏర్పాటు చేసుకుని, లాక్డౌన్ కారణంగా వెళ్లలేకపోయిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి వారి కోసం మే 19 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నాం. ఇతర కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు’అని ఆ శాఖ మంత్రి పొఖ్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా జూలై 18-23వ తేదీల మధ్యలో జరగనుంది.విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థుల్లో సుమారు 48 శాతం మంది కోవిడ్ కారణంగా ఆ యోచనను విరమించుకున్నారని క్వాకరెల్లి సిమ్మండ్స అనే సంస్థ అధ్యయనం వెల్లడించింది. విదేశాల్లో ఖరీదైన విద్య, కోవిడ్-19 అనంతరం విదేశాల్లో తగ్గనున్న ఉద్యోగావకాశాలే ఇందుకు కారణమని తెలిపింది.
Published date : 20 May 2020 05:16PM