Skip to main content

ఆగస్టు 23న జేఈఈ-అడ్వాన్స్ డ్ పరీక్ష

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్ డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈఈ-మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10-15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. అందులో టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకటించింది.
Published date : 08 May 2020 02:05PM

Photo Stories