Degree Exam Results: ఫలితం లేని ‘పరీక్ష’

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. రాసిన పరీక్షలకు ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వర్సిటీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా మారడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు సకాలంలో విడుదల చేయకపోవడంతో పీజీ కోర్సులకు వెళ్లలేని పరిస్థితి. మరో వైపు ఉద్యోగం వచ్చిన విద్యార్థులు సైతం ఫలితాలు రాకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓయూ పరీక్షలు వాయిదా: Click Here
15 వేల మంది నిరీక్షణ..
ఎస్కేయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, మెగా సప్లిమెంటరీ పరీక్షలు గతేడాది నవంబర్లో జరిగాయి. వీటితో పాటు ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు. 2014 నుంచి 2024 వరకు డిగ్రీ, బీఈడీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఏడాది పరీక్షల విధానంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. 1994 నుంచి ఫెయిల్ అయిన వారికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి దాకా ఫలితాలు మాత్రం రాలేదు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మొత్తం 18 వేల మంది విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. పరీక్షల విభాగం ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఇక్కడ బాగా పనిచేసే సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో సమస్య వచ్చిందంటున్నారు.
ఫలితాల విడుదలకు కృషి చేస్తాం
ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది వాస్తవమే. బాగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయకుండా ఉండాల్సింది. కనీసం సంబంధిత విభాగాధిపతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫలితాల విడుదలకు కృషి చేస్తాం. – జీవీ రమణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ