Skip to main content

సర్కారీ కొలువు దక్కేలా.. ప్రిపరేషన్ పక్కాగా!

పోస్టులు వందల్లో... పోటీ లక్షల్లో..! ఎంతో మంది పరీక్ష రాసినా... కొలువు దక్కేది కొంతమందికే!! అర్హతల పరంగా చూస్తే... దాదాపు అభ్యర్థులందరికీ తగిన అర్హతలు ఉంటాయి. అందరికీ సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే పట్టుదల ఉంటుంది. దాదాపు అందరూ అవే పుస్తకాలు, అవే మెటీరియల్ చదువుతుంటారు. కాని కొంతమందికే ఉద్యోగం లభిస్తుంది. ఎందుకు!? పక్కా వ్యూహంతో పటిష్ట ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులే అంతిమంగా విజేతలుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించేందుకు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహం గురించి తెలుసుకుందాం...
వార్తాపత్రికలు..
పోటీ పరీక్షల ప్రిపరేషన్ పరంగా సమయానిది కీలక పాత్ర. కాబట్టి సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇంటర్నెట్లో గంటల తరబడి ఆర్టికల్స్ కోసం వెతుక్కోకుండా.. ఎప్పటికప్పుడు దినపత్రికలను పరీక్షల కోణంలో చదవాలి. పత్రికలను చదివేటప్పుడు నిర్మాణాత్మక పరిణామాలు, డవలప్మెంట్ ఓరియెంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. నియామకాలు, సిలబస్, పరీక్ష సంబంధిత మార్పులకు సంబంధించిన వార్తలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

సమయ ప్రణాళిక..
పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన తర్వాత ప్రిపరేషన్పై దష్టిసారించాలి. చక్కటి టైమ్ టేబుల్(సమయ ప్రణాళిక) రూపొందించుకొని.. దాన్ని అనుసరించాలి. సబ్జెక్టులను రోజులుగా, రోజులను గంటలుగా విభజించుకోవాలి. ఆయా సబ్జెక్టులను అవగాహన చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందనే∙విషయాలను గమనించాలి. స్వీయసామర్థ్యాలు ఏమేరకు మెరుగవుతున్నాయో అంచనా వేసుకోవాలి.

సొంత నోట్స్..
పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులెవరైనా నోట్స్ రూపొందించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. చదువుతున్న సబ్జెక్టు ఏదైనా నోట్సు రాసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. ప్రతి చాప్టర్ అధ్యయనం పూర్తయిన తర్వాత నోట్స్ను రివిజన్ చేసి..అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే.. విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రింటెడ్ పుస్తకాల్లో చదివిన అంశాల కంటే నోట్ బుక్లో రాసుకున్న విషయాలనే సులభంగా తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటారు. నోట్స్ సులభమైన భాషలో షార్ట్ కట్లో ఉంటే.. ప్రింటెడ్∙పుస్తకం కొంచెం క్లిష్టంగా ఉండటమే దీనికి కారణం.

మోడల్ పేపర్లు..
ఇంటర్నెట్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు లభ్యమవుతున్నాయి. స్థానిక బుక్ స్టోర్స్లోనూ మోడల్ ప్రశ్నపత్రాలు లభిస్తున్నాయి. మోడల్ టెస్టుల వల్ల నాలెడ్జ్తోపాటు స్వీయ సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చు. వారం, నెలల వారీగా మోడల్ టెస్టులను ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల శైలి, ఏయే అంశాలపై దష్టిపెట్టాలనే విషయాలపై అవగాహన వస్తుంది. మోడల్ టెస్టు పేపర్స్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమర్ పెట్టుకోవడం లాభిస్తుంది.

స్వీయ ప్రేరణ..
ప్రభుత్వ పోటీ పరీక్షలు ఏవైనా..వాటిలో విజయం సాధించాలంటే ప్రేరణ తప్పనిసరి. ఏటా పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి పోటీని తట్టుకొని నిలబడాలంటే.. ప్రేరణ ఎంతైనా అవసరం. ముఖ్యంగా పోటీ పరీక్షల విజయంలో స్వీయ ప్రేరణ కీలకంగా నిలుస్తుంది.

క్రమశిక్షణ, అంకితభావం..
పరీక్షల్లో విజయం అనేది స్వల్పకాలంలో దక్కేది కాదు. కొన్నిసార్లు దీర్ఘకాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. ఈ సమయంలో అభ్యర్థుల్లో స్వీయ ప్రేరణ సడలే ఆస్కారం ఎక్కువ. కొన్నిసార్లు చదవాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. అలాంటి సమయంలో క్రమశిక్షణ, అంకితభావం చాలా అవసరం.

ఆరోగ్యాన్ని..
పరీక్షలు.. లక్ష్యాలు... ఏవైనా... ఆరోగ్యం సహకరిస్తేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆర్యోగాన్ని కాపాడుకోవాలి. వరుసగా కొన్ని రోజులు ప్రిపరేషన్ తర్వాత అనారోగ్యం పాలై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ప్రిపరేషన్కు బ్రేక్ పడుతుంది. ప్రిపరేషన్ తిరిగి గాడిలో పడటం కష్టంగా మారుతుంది. కాబట్టి అభ్యర్థులు జంక్ ఫుడ్, ఇతర అనారోగ్య పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఏకాగ్రత..
కొంతమంది ఏకధాటిగా ఐదారు గంటలు చదువుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్లో చిన్న చిన్న గ్యాప్లు ఇవ్వాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఎన్ని గంటలు చదివాం అనే దానికంటే.. ఎంత నాణ్యమైన సమయం ప్రిపరేషన్కు కేటాయించామనేదే ముఖ్యం.

కోచింగ్...
పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కాలంలో కోచింగ్కు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఆన్లైన్ మార్గాలను అన్వేషించాలి. ఆన్లైన్ క్లాసులు తప్పనసరి అని భావించిన విద్యార్థులు కొంత రీసెర్చ్, సీనియర్లను సంప్రదించి ప్రామాణిక మెటీరియల్, బోధన అందించే కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవడం మేలు.

గ్రూప్ డిస్కషన్...
పోటీ పరీక్షల ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్స్(జీడీ)కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో సమకాలీన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్ రంగ సమస్యలపై చర్చించమని కోరుతున్నారు. కాబట్టి అభ్యర్థులు సమకాలీన అంశాలపై ఎక్కువగా దష్టిసారించాలి. అలాగే కేంద్ర బడ్జెట్–కీలక విషయాలపై ఫోకస్ చేయాలి.

పర్సనల్ ఇంటర్వ్యూ...
అభ్యర్థులు ఎస్బీఐ పీవోగా కొలువుదీరేందుకు చివరి దశ ప్రక్రియ.. ఇంటర్వ్యూ. ఇందులో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థి విద్యా నేపథ్యం, వ్యక్తిగత విషయాలు, పని అనుభవం, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించినవిగా ఉంటాయి. ముఖ్యంగా దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఎక్కువ దష్టిపెట్టాలి.
Published date : 01 May 2020 10:14PM

Photo Stories