Skip to main content

ఇంజనీరింగ్ విద్యకుసరైన మార్గం ‘నిట్’

జేఈఈ-మెయిన్.. జాతీయస్థాయిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలు, నిట్‌ల్లో ప్రవేశానికి మార్గం. ఇటీవల జేఈఈ-మెయిన్ ఏప్రిల్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు.. ఐఐటీల్లో ప్రవేశానికి వీలుకల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించలేకపోయిన విద్యార్థుల దృష్టంతా ఇప్పుడు నిట్‌ల్లో ప్రవేశం పొందడంపైనే ఉంటుంది. అలాగే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినా.. అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాత ఐఐటీల్లో పరిమిత సీట్ల కారణంగా అక్కడ అవకాశం లభించని విద్యార్థుల తొలి ప్రాధాన్యం కూడా నిట్‌లే! ఈ నేపథ్యంలో నిట్‌ల్లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది.. సీట్లు-ఫీజులు.. విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు తదితర వివరాలు...
23 ఐఐటీల్లో అందుబాటులో ఉన్న సీట్లు: 12,070. ఈ ఏడాది సూపర్ న్యూమరరీ కోటాలో మరో వెయ్యి సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటికి పోటీ పడాలంటే.. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు, 10+2/ఇంటర్మీడియెట్‌లో సంబంధిత బోర్డ్ ఎగ్జామ్‌లో 75 శాతం మార్కులు, అలాగే ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవడం తప్పనిసరి.
గతేడాది జేఈఈ-అడ్వాన్స్‌డ్ ద్వారా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2,305 మందికి ఐఐటీల్లో సీట్లు లభించాయి. ఈ సంవత్సరం కూడా జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత ద్వారా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు దాదాపు 40 వేల మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది.

ఐఐటీల తర్వాత ఎన్‌ఐటీలే..
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఐఐటీల తర్వాత టక్కున గుర్తొచ్చేది.. నిట్‌లే. ప్రస్తుతం జాతీయస్థాయిలో 31 నిట్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ రెండు కోర్సులు కలిపి మొత్తం 18,620 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఎన్‌ఐటీలు: 31.
ఎన్‌ఐటీలలో నాలుగేళ్ల బీటెక్ సీట్ల సంఖ్య: 17,580.
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీట్ల సంఖ్య: 1040.
ఎన్‌ఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్‌లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య: 18,620

జోసా ఆధారంగా..
నిట్‌ల్లో సీట్ల భర్తీ జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారాజరుగుతుంది. ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ.. జోసా. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) జోసా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జోసా ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ప్రాధాన్యత క్రమాన్ని పేర్కొనాలి. దీని తర్వాత విద్యార్థుల మెరిట్, అందుబాటులోని సీట్లను పరిగణనలోకి తీసుకొని అప్పటికే రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఆన్‌లైన్ సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. ఈ మేరకు అభ్యర్థులకు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ బ్రాంచ్‌లో సీటు లభించిందో ఆన్‌లైన్‌లోనే అలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది. విద్యార్థులు తమకు వచ్చిన సీటు, ఇన్‌స్టిట్యూట్ పరంగా సంతృప్తి చెందితే ఆన్‌లైన్‌లోనే అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా.. అంగీకారం తెలిపిన విద్యార్థులు నిర్దిష్ట మొత్తంలో యాక్సప్టెన్స్ ఫీజు(గతేడాది రూ.35,000)ను ఆన్‌లైన్‌లో ఈ-చలాన్ రూపంలో చెల్లించాలి. ఈ రిసీట్ ఆధారంగా తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు నిర్దేశిత తేదీల్లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మలి దశలకు హాజరయ్యే అవకాశం:
జోసా తొలి దశ కౌన్సెలింగ్‌లో తమకు నచ్చిన సీటు లభించని విద్యార్థులు.. మలి దశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశముంది. అందుకోసం విద్యార్థులు ఫ్లోట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇలా మొత్తం ఏడు దశల్లో జరిగే కౌన్సెలింగ్‌లో ఆరోదశ వరకు ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశముంది.

నిట్‌లకు పెరుగుతున్న క్రేజ్ :
నిట్‌ల్లో చేరాలనుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నప్పటికీ.. వాటిలో సీట్ల సంఖ్య పరిమితం. అంతేకాకుండా వీటిలో పదికిపైగా ఐఐటీలు గత రెండు, మూడేళ్ల వ్యవధిలో కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటిలో మౌలిక సదుపాయాల, ఫ్యాకల్టీ, భౌగోళికత తదితర అంశాలు విద్యార్థుల ప్రాధాన్యతలపై ప్రభావం చూపుతున్నాయి. దాంతో చాలామంది విద్యార్థులు.. కొత్త ఐఐటీల కంటే పాత నిట్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాది నిట్‌ల్లో 18,620 సీట్లు అందుబాటులో ఉంటే.. 18,422 సీట్లు భర్తీ అయ్యాయి.

జోసా తర్వాత సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్ :
జోసా ప్రక్రియతోనే నిట్‌ల్లో సీట్ల భర్తీ జరుగుతున్నప్పటికీ.. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే .. వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా ఎన్‌ఐటీ ప్లస్ సిస్టమ్ పేరుతో సీఎస్‌ఏబీ(సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్) ఆధ్వర్యంలో ఎన్‌ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా ఇది రెండు దశల్లో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

హోమ్ స్టేట్ కోటా.. ఎన్‌ఐటీల ప్రత్యేకత
నిట్‌లు, సీట్ల భర్తీ క్రమంలో జేఈఈ-మెయిన్ ఉత్తీర్ణులకు అత్యంత అనుకూలించే అంశం.. హోమ్ స్టేట్ కోటా విధానం. దీని ప్రకారం నిట్ ఏర్పాటైన రాష్ట్ర విద్యార్థులకు మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను కేటాయిస్తారు. ఉదాహరణకు నిట్-వరంగల్‌ను తీసుకుంటే.. ఇందులో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇలా దేశంలోని మొత్తం 31 నిట్‌లలోనూ ఈ విధానంతో సంబంధిత రాష్ట్రాల విద్యార్థులు సీట్లు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోని నిట్‌లు :
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు నిట్ క్యాంపస్‌లు ఉన్నాయి. అవి.. ఎన్‌ఐటీ-వరంగల్(తెలంగాణ), ఎన్‌ఐటీ-ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లిగూడెం). వీటిలో ఎన్‌ఐటీ వరంగల్‌లో గతేడాది గణాంకాల ప్రకారం మొత్తం ఎనిమిది బీటెక్ బ్రాంచ్‌లలో 817 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిట్-ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం సీట్ల సంఖ్య 487. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటా, మహిళా విద్యార్థుల కోసం సూపర్ న్యూమరరీ కోటా పేరుతో సీట్లను పెంచేందుకు అవకాశముంది.

Admissionsమన విద్యార్థులు ఆసక్తి చూపుతున్న నిట్‌లు :
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హోమ్ స్టేట్ కోటా ప్రకారం వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఆ తర్వాత ప్రాథమ్యాలుగా నిట్ కురుక్షేత్ర, జలంధర్, సూరత్‌కల్, నాగపూర్, తిరుచిరాపల్లి క్యాంపస్‌లు నిలుస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో మౌలిక సదుపాయాలు, బోధన మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దాంతోపాటు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు వంటివి కూడా మరో కారణంగా నిలుస్తున్నాయి.

ఫీజులు అధికమే కానీ.. వర్గాల వారీగా రాయితీ
  • నిట్‌లలో ఫీజులు కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ట్యూషన్ ఫీజు సెమిస్టర్‌కు రూ.62,500. అంటే.. ఏడాదికి రూ.1.25 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. ఇది ఆయా నిట్‌ను బట్టి కొంత అటూ ఇటూగా మారుతూ ఉంటుంది. ట్యూషన్ ఫీజుకు అదనంగా అడ్మిషన్ ఫీజు, ఇన్‌స్టిట్యూట్ ఫీజు, లేబొరేటరీ ఫీజు, ఇన్సూరెన్స్ వంటివి కూడా ఉంటాయి.
  • ప్రస్తుతం విద్యార్థులకు వారి సామాజిక వర్గాలు, కుటుంబ ఆదాయం ఆధారంగా ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తోంది.
  • కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న విద్యార్థులు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల కేటగిరీలో ట్యూషన్ ఫీజు మినహాయింపు పొందొచ్చు.
  • కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఉన్న విద్యార్థులకు మొత్తం ట్యూషన్ ఫీజులో మూడింట రెండొంతుల ఫీజు మినహాయింపు లభిస్తుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు మినహాయింపు సౌలభ్యం ఉంది.
  • ఈ మినహాయింపులు కోరుకునే అభ్యర్థులు సంబంధిత ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్‌లోనూ..
గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఆర్‌ఎఫ్(నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) పేరుతో రూపొందిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్‌లోనూ నిట్‌లు సత్తా చాటుతున్నాయి. తాజాగా ఎన్‌ఐఆర్‌ఎఫ్-2019 ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-50లో 9.. అదే విధంగా టాప్-100లో 18 నిట్‌లకు చోటు దక్కడం విశేషం. టాప్-150 జాబితాను చూస్తే.. మొత్తం 31 నిట్‌లకు గాను 22 నిట్‌లకు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో స్థానం లభించింది.

నిట్ సీట్ల భర్తీ షెడ్యూల్ :
ఇటీవల ఎంహెచ్‌ఆర్‌డీ వర్గాల సమాచారం ప్రకారం ఐఐటీలు, నిట్‌లు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన జోసా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19 నుంచి జూలై 15 వరకు ఏడు లేదా ఎనిమిది దశల్లో జరగనుంది. నిట్ ఔత్సాహిక విద్యార్థులు ముందుగా తమ జేఈఈ-మెయిన్ రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఆధారంగా లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నిర్ణీత తేదీలను అనుసరించి ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. ఈలోపుగానే నిర్దేశిత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి.

నిట్ అడ్మిషన్ ప్రక్రియ..
ముఖ్యాంశాలు :
  • జాతీయస్థాయిలో 31 నిట్ క్యాంపస్‌లు.
  • మొత్తం 18,620 సీట్లు (ఈ ఏడాది వీటి సంఖ్య పెరిగే అవకాశముంది).
  • జోసా ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ.
  • కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ట్యూషన్ ఫీజు నుంచి నిర్ణీత మొత్తాల్లో ఫీజు మినహాయింపు.
  • జూన్ 19 నుంచి ప్రారంభం కానున్న జోసా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ.
అవసరమైన పత్రాలు..
 1.  మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు.
 2.  ఫొటో ఐడెంటిటీ కార్డ్.
 3.  జేఈఈ-మెయిన్ అడ్మిట్ కార్డ్.
 4.  జేఈఈ-మెయిన్ స్కోర్ కార్డ్.
 5.  జనన ధ్రువీకరణ పత్రం(పదో తరగతి మెమో).
 6.  ఇంటర్మీడియెట్ మెమో.
 7.  మెడికల్ సర్టిఫికెట్.
 8.   కుల ధ్రువీకరణ పత్రం.
 9.  ఆదాయ ధ్రువీకరణ పత్రం.
 10.  వీటితోపాటు సీటు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ సెంటర్‌లో ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్, జోసా వెబ్‌సైట్‌లో నిర్దేశించిన పత్రాలను పూర్తిచేసి ఇవ్వాల్సి ఉంటుంది. సీటు అంగీకార చెల్లింపు రశీదు(ఈ-చలాన్) ను రిపోర్టింగ్ సెంటర్‌లో అందజేయడం తప్పనిసరి.
Published date : 29 May 2019 12:19PM

Photo Stories