Skip to main content

‘ఎంసెట్’ కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వండిలా...

ఎంసెట్.. ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థులకు క్రేజీ పరీక్ష. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ముగిసింది! ఇక ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఫలితాలు వచ్చాక చూద్దాంలే అనుకోకుండా.. ఇప్పటినుంచే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై అవగాహన పెంచుకోవడం మేలు. తద్వారా వెబ్‌కౌన్సెలింగ్ విధానంలో జరిగే సీట్ల కేటాయింపు పరంగా చివరి క్షణం ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు! ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ.. కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విధానం గురించి తెలుసుకుందాం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో ఎంసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. కాబట్టి విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీల వరకు వేచి చూడకుండా అడ్మిషన్ల ప్రక్రియపై ఇప్పటినుంచే అవగాహన పెంచుకుంటే.. నచ్చిన కాలేజీలో, మెచ్చిన బ్రాంచ్‌లో అడ్మిషన్ ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది.

ముందుగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ :
ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇందుకోసం ఆన్‌లైన్ విధానంలో వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. దీనికోసం విద్యార్థులు తమ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నంబరు వివరాలతో ఆన్‌లైన్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దశలో సదరు వెబ్‌సైట్ (ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్)లో కనిపించే కళాశాలలు, బ్రాంచ్‌ల జాబితాను పరిశీలించి.. తమకు ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఆన్‌లైన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. ఇలా పొందుపరచిన వివరాల మేరకు.. నిర్ణీత గడువు తర్వాత అభ్యర్థి ప్రాథమ్యాలు, ఎంసెట్‌లో పొందిన ర్యాంకు, అందుబాటులోని సీట్ల ఆధారంగా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. అభ్యర్థులు తాము కోరుకున్న విధంగా సీటు అలాట్‌మెంట్ జరిగితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తమకు లభించిన బ్రాంచ్ లేదా కళాశాల నచ్చకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వీరికి తదుపరి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌లో స్లైడింగ్ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తొలిదశలో తమకు లభించిన సీటును యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మలిదశ కౌన్సెలింగ్‌లో తాజా అభ్యర్థిగా పరిగణనిస్తారు.

రెండు విధానాల్లో సీట్ల భర్తీ :
ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ కళాశాలల్లోని సీట్ల భర్తీకి ప్రభుత్వం ప్రస్తుతం కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా.. అనే రెండు విధానాలను అనుసరిస్తోంది.

కన్వీనర్ కోటా :
  • కన్వీనర్ కోటాలో భాగంగా ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
  • ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లనే కన్వీనర్ కోటాలో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. మిగతా 30 శాతం సీట్లను సదరు కళాశాలల యాజమాన్యాలు బి-కేటగిరీ పేరుతో సొంతగా భర్తీచేసుకోవచ్చు. ఈ 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ :
15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ప్రవాస భారతీయుల పిల్లలు, లేదా వారు స్పాన్సర్ చేస్తున్న విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రవేశం పొందేందుకు ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. లేదా స్కేలింగ్ విధానం ప్రకారం-10 సీజీపీఏ స్కేలింగ్‌లో 5 సీజీపీఏ సాధించాలి.

యాజమాన్య సీట్లు :
  • ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయించిన 15 శాతం సీట్లు పోగా.. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీచేసుకునే వీలుంది. వీటిలో ప్రవేశం పొందేందుకు ఎంసెట్‌లో ర్యాంకు సాధించడమే కాకుండా, ఇంటర్మీడియెట్ పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా భర్తీచేసుకోవచ్చు.
  • అప్పటికీ సీట్లు మిగిలితే ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లో 45 శాతం మార్కులు, (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు) పొందిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.

ఇప్పటి నుంచే కసరత్తు..
ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కోసం వేచిచూస్తూ సమయం వృథా చేసుకోకుండా.. ఇప్పటి నుంచే బెస్ట్ కళాశాలలు, బ్రాంచ్‌ల గురించి అన్వేషణ ప్రారంభించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు పలు రకాల మార్గాల ద్వారా టాప్ ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు, వాటికి ఏఐసీటీఈ, యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు వంటి విషయాలను తెలుసుకోవాలి. వీలైతే ఆయా కళాశాలలను సందర్శించి అప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడటం ద్వారా కళాశాల నాణ్యతపై అవగాహన పెంపొందించుకోవచ్చు.

మేనేజ్‌మెంట్ కోటా మార్గదర్శకాలు..
  1. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ప్రతి కళాశాల తప్పనిసరిగా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. కళాశాలలు తమ ఇన్‌స్టిట్యూట్‌లోని సీట్ల వివరాలను అందులో అప్‌లోడ్ చేయాలి.
  2. విద్యార్థులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు, సీట్ల వివరాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా ఆధారంగా పైన పేర్కొన్న ప్రకారం.. ఎన్‌ఆర్‌ఐ, ఎంసెట్ మెరిట్, ఇంటర్ మెరిట్ ఆధారంగా వరుస క్రమంలో సీట్లు భర్తీచేయాలి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్లోనే చేపట్టాలి.
  4. అభ్యర్థులు సదరు కళాశాలను సంప్రదించి నేరుగా ఆఫ్‌లైన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలి.

ఇవి తప్పనిసరి..
  1. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీచేసే క్రమంలో ప్రతి కళాశాల కచ్చితంగా ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు దినపత్రికల్లో బి-కేటగిరీ విధానంలో అందుబాటులో ఉన్న సీట్లు, బ్రాంచ్‌లు, ఫీజుల వివరాలతో ప్రకటన విడుదల చేయాలి.
  2. ఏఎఫ్‌ఆర్‌సీ(లేదా) ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలి. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే దాన్ని క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్‌గా భావించి చర్యలు తీసుకుంటారు.
  3. విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించకపోయినా.. స్వీకరించిన దరఖాస్తులకు అకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వకపోయినా.. విద్యార్థులు సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇలా యాజమాన్య కోటాలో మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలను రాష్ట్రాల ఉన్నత విద్యామండలి అధికారులకు కచ్చితంగా తెలియజేయాలి.
గత ఏడాది ఏపీలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అన్ని కళాశాలలు ఉమ్మడిగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ చేపట్టాయి. తద్వారా అందుబాటులో ఉన్న సీట్లు, కళాశాలల వివరాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఈ ఏడాది కూడా ఇదే విధానం అమలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

ఏపీ విద్యార్థులకు మాక్ కౌన్సెలింగ్ సదుపాయం..
Education News
ఏపీ ఎంసెట్ విద్యార్థులకు ఈ ఏడాది మాక్ కౌన్సెలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనివల్ల విద్యార్థులు తాము పొందిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలల్లో సీటు లభించే అవకాశం ఉందో ముందుగానే ఒక అంచనాకు రావొచ్చు. ఇది వెబ్ కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ పరంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని ఎంసెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ఉపయోగించుకుంటే మేలు.
- ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబా, ఏపీ ఎంసెట్ కన్వీనర్.
Published date : 25 May 2019 04:54PM

Photo Stories