పదో తరగతి పరీక్షలొద్దు...హైకోర్టులో పిల్
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

టెన్త్ పరీక్షా విధానంలో మార్పులు తెచ్చిన అధికారులు, దీనికి అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం అయ్యేందుకు సమయం ఇవ్వకుండానే జూలైలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారని పేర్కొంటూ కాకినాడకు చెందిన సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ సంస్థ అధ్యక్షుడు టి.భవానీ ప్రసాద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు లేని అభ్యంతరం పిటిషనర్కు ఎందుకన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.
Published date : 28 May 2020 02:55PM